July 7, 2011

రంగు వెలిసిన రాజుగారి మేడ కథ

శ్రీపాదపట్నాన్ని పావురాళ్ల పట్నమని కూడా అంటారు. ఆ వూరిని నిర్మానుష్యంగానైనా వూహించవచ్చు గానీ, పావురాళ్ళు లేకుండా ఊహించలేం. ఇళ్ళ వాకిళ్ళలోనూ, అంగళ్ళ ముంగిటా, బడి పెంకులపైనా, గుడి గోపురం గూళ్ళలోనూ... ఎటు చూసినా పావురాలే! ఒక్కోసారి వాటి చొరవ చూస్తే, అసలిదంతా అవి నిర్మించుకున్న వూరేనేమో, ప్రజలే పాపం కాందిశీకులై వలస వచ్చారేమో అనిపిస్తుంది.  ఊరి వాళ్ళకి వీటితో మసలుకోవడం అలవాటైపోయింది. ఎండిన రెట్టల్తో తమ అరుగులన్నీ గరుకుబారినా గోకిగోకి కడుక్కుంటారేగానీ ఏ హానీ తలపెట్టరు. యిక్కడి ఊరకుక్కలు సైతం, పెంటకుప్పల మీద పులిస్తరాకులేరుకుంటున్న తొందరలో కూడా, వెన్నుపై వాలి అల్లరి చేసే తుంటరిపావురాళ్ళని పెద్దన్నల్లా ఓపిగ్గా భరిస్తాయేగానీ కసురుకోవు. వీటి పరపతికి జడిసి కాకులైతే శ్రీపాదపట్నంవైపు రానేరావు.

ఈ ఊరిపై వీటికింత మక్కువ కలగడానికి ముఖ్యకారణం యిక్కడి పాతమేడలు. నిండా గోపీచందనపు పూతతో మెరుగుపోయిన బంగారపు దిమ్మెల్లా మెరిసిపోయే యీ పాత మేడల అందం వర్ణనాతీతం. సాయంసంధ్యవేళ పల్చని ఎండలో అయితే మరీను. అటువంటి సమయాల్లో ఊర్నానుకుని పారే ఏటి మీదుగా ఎగిరే ఏ పొరుగూరి పావురమైనా సరే, ఈ పాతమేడల్ని చూసింతర్వాత కూడా శ్రీపాదపట్నానికి మకాం మార్చేయాలనే చాపల్యాన్ని నిగ్రహించుకోగలిగిందంటే, ముక్కు తిప్పుకుని ముందుకుపోగలిగిందంటే, అలా దాటిపోయిందని తోటి పావురాళ్ళకు తెలిసిందంటే, దాని మెదళ్ళో యిసుమంత రసత్వం కూడా లేదని ఈసడింపులు ఖాయం.

ఒకప్పుడు యేటి వొడ్డున జనార్దనస్వామి గుడి వున్న వీధి శ్రీపాదపట్నానికి ప్రధాన వీధిగా వుండేది. ఆ గుడిని కట్టించిన రాజవంశీకులు ఆ ప్రక్కనే రెండంతస్తుల భవంతిలో వుండేవారు. ఎన్నో తరాల బట్టి దాని బాగోగులు వాళ్ళే చూసుకుంటూ వచ్చారు. ఆ వరసలోనే జనార్దనస్వామి రథం నిలబెట్టిన పెద్ద కొట్టమూ, దూరప్రాంతాల్నించీ గుడి సందర్శనార్థం వచ్చే యాత్రికుల కోసం సత్రమూ, అర్చక కుటుంబం వుండే మండువా, యివన్నీ గాక పూజా ద్రవ్యాల్ని అమ్మే దుకాణాలూ, పూల కొట్లూ... వీటన్నింటితోనూ ఆ వీధి నిత్య సమ్మర్ధంగా వుండేది. అశ్వాలు పూన్చిన రథాలూ, పట్టుజరీతెరలు వాల్చిన పల్లకీలూ వస్తూపోతూండేవి. రాజుల ఆహ్వానంపై దూర దేశాల్నించి కళాకారులూ, ప్రదర్శకులూ వచ్చి విద్యల్ని చూపించేవారు. అయితే ఇదంతా ఒకనాటి మాట. రాజుల పరంపరలో చివరివాడైన సుబ్బరాజు గారి హయాం వచ్చేసరికే ఆ రాజవీధి ప్రాభవాన్ని కోల్పోయింది. ఆయన చనిపోయాకా చెడ్డపేరు కూడా తెచ్చుకుంది.

చెడ్డపేరుకి సుబ్బరాజు గారికన్నా, ఆయన ప్రేతాత్మ కారణమని చెప్పాలి. రెండంతస్తుల రాజభవంతిలో క్రింద అంతస్తులో యిప్పుడాయన ఆత్మ తిరుగుతోంది. పై అంతస్తులో ఆయన మనవరాలు రేణుకాదేవి వుంటోంది. ఆయన ఆత్మ పైలోకాలకు పోకుండా యింకా అక్కడే తిరగడానికి కారణం ఈ మనవరాలే అంటారు. బతికివుండగా కూతుర్ని కాపాడుకోలేకపోయాడు, చచ్చి యీ మనవరాల్ని కాపాడుకోవాలని చూస్తున్నాడని జనం మాట. ఒకప్పుడు ఆయనకు కూతురంటే పంచప్రాణాలు. ఆమె దేశంలోకే పెద్ద అందగత్తె. ఒక పొరుగూరి జమీందారు ప్రేమలో పడి సుబ్బరాజు గార్ని ఎదిరించి పెళ్ళి చేసుకుంది. వాడు ఆమె అందంలోని రాజసాన్ని, స్వభావసిద్ధమైన నిర్మలత్వాన్ని భరించగలిగే మనసున్నవాడు కాదు. కాస్త కురూపి కూడా కావడంతో ఆమె ప్రక్కన ఎప్పుడూ మాసిపోయినట్టు కన్పించేవాడు. ఆ న్యూనతను భరించలేక ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. పురుడు పోయడానికని వెళ్ళిన మంత్రసానికి ఆమె గుర్రపుశాలలో నొప్పులు పడుతూ ఎదురవడాన్ని బట్టి వాడి చిత్రహింసలెలాంటివో ఊరికి తెలిసింది. రేణుకాదేవి భూమ్మీద పడిన కొన్నేళ్ళకే ఆమె మరణించింది. సహజమరణమో, బలవన్మరణమో తెలియదు. అప్పటిదాకా కూతురు పడుతున్న బాధలు సుబ్బరాజుగారు ఆ నోటా ఈ నోటా వినివుండకపోలేదు. కాని, తన మాట వినని ఫలితమేమిటో తెలుసుకున్నాక కూతురే వెనక్కి వచ్చేస్తుందని ఆశించాడు. యిలా శవం వస్తుందని ఊహించలేకపోయాడు. ఆగ్రహోదగ్రుడై పాలేళ్ళని  వెంటేసుకుని వెళ్ళి జమీందార్ని చావచితక్కొట్టాడు. ఈడ్చుకెళ్ళి అతని చెరుకుతోటలోనే అతణ్ణి సజీవంగా పాతిపెట్టి, మనవరాల్ని వెనక్కి తెచ్చేసుకున్నాడు. యిప్పటికీ అక్కడ చెరుకు పంట కాపంతా చేదుగానే వుంటుందని అంటారు.

మనవరాలు రేణుకాదేవి ముమ్మూర్తులా కూతురి పోలికల్తోనే ఎదుగుతుండటం చూసాకా, ఆమెను కూడా బయటి ప్రపంచానికి పణంగా పెట్టడానికి యిష్టపడలేదు సుబ్బరాజుగారు. తన రెక్కల క్రిందే దాచేసుకోవాలనుకున్నాడు. దరిమిలా ఆ యింట్లో ఆయన మరో యిరవయ్యేళ్ళు బతికాడు. అన్నాళ్ళూ ఆ తాతామనవరాళ్ళెలా బతికారో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. పొలాలు కౌలుకి వదిలేశాడు. గుడిని పట్టించుకోవడం మానేసాడు. ఎప్పుడో రథసప్తమికి ఊరివాళ్ళే చొరవజేసుకుని రథాన్ని ఊరేగించేవారు. పొద్దస్తమానం మనిషెత్తు వుండే బయటి అరుగుల మీద పడక్కుర్చీలో కూర్చుని పావురాళ్లకి నూకలు చల్లేవాడు. పాలేర్లే బయటికెళ్ళి చేయాల్సిన కాసిని పనులూ చేసిపెట్టేవారు.

రేణుకాదేవి యుక్తవయస్సుకొచ్చేసరికి ఆయన చనిపోయాడు. యిక ఆమె బయటకి రాక తప్పదని శ్రీపాదపట్నం ఎదురుచూసింది. ఎవరూ బయటకి రాలేదు. భవంతి అదే నిశ్శబ్దాన్ని యథాతథంగా కొనసాగించింది. ఆ నిశ్శబ్దం వెనుక ఏవో ఘోరాలు ఊహించబడ్డాయి. అవన్నీ ఊరంతా పుకార్లుగా ప్రచారమయ్యాయి. ఆ దారంటా పోయే వాళ్ళు తలెత్తి చూస్తే అప్పుడపుడూ కిటికీ దగ్గర ఆమె ముఖం కన్పించేది. అది ఎపుడో గాని క్రిందకి చూస్తూ కన్పించేది కాదు. ఎక్కడో ఏటి కావల క్షితిజరేఖ వైపు చూస్తూ కనిపించేది. మొదట్లో ఆ ముఖంతో ప్రేమలో పడిపోయినవారెందరో వున్నారు. వాళ్ళెవరూ సాహసించని తెంపరితనం ఊళ్ళో ఓ భూస్వామి కొడుకు ప్రదర్శించాడు. ఈ ప్రపంచంలో తన మగతనానికి నిషిద్ధం ఏమీ లేదన్న గీర గలవాడు కావడంతో ఒకనాడు తెగించి ఎత్తు అరుగుల మెట్లెక్కి భవంతి లోపలికి వెళ్ళాడు. సాయంత్రానికి పిచ్చివాడై బయటికి వచ్చాడు. అతణ్ణించి తలాతోకా వున్న సంగతేదన్నా రాబట్టాలని వూరివాళ్ళు విఫల ప్రయత్నాలు చాలా చేశారు. బెదురు కళ్ళతో, చొంగ కార్చుకుంటూ, కన్నీరుమున్నీరవుతూ, “ఖాళీ ఊయల బల్ల ఊగుతోంది”, “మెడ తెగిన గొర్రెకి కళ్ళు బతికే వున్నాయి”, “కుక్కంత గండు చీమ కాపలా కాస్తుంది”... యిలా పరస్పరం సంబంధం లేని గజిబిజి దృశ్యాలు నెమరువేసుకు వణికిపోయాడు. ఈ సంఘటన ఊరివాళ్లకు కోపం తెప్పించింది. కొందరైతే భూతవైద్యుల్ని రప్పించి భవంతి వాకిట ముగ్గులేయించి నిమ్మకాయలు పెట్టి పూజలు కూడా చేయించారు. కానీ ఏ ప్రయత్నమూ దాని నిశ్శబ్దాన్ని భంగపరచలేకపోయింది.

జరిగిన అనర్థానికి కారణం మొదట్లో రేణుకాదేవే అనుకున్నారు జనం. ఆమెను ద్వేషించారు. ఆ కొన్నాళ్ళు మగరాయుళ్ళు భవంతి ముందు గుంపులుగా చేరి చుట్టలు కాలుస్తూ గుసగుసగా మాట్లాడేవారు. అమ్మలక్కలు కిటికీ వైపు మెటికలు విరిచేవారు. ఒక రథసప్తమినాటి ఊరేగింపులో నయితే, కొంతమంది దుడుకు కుర్రాళ్ళు రథం చిటారుకొమ్ము దాకా ఎక్కి, అక్కణ్ణించి ఒకే ఎత్తులో వుండే భవంతి కిటికీ మీదకి అరటిపళ్ళూ, కొబ్బరి పెచ్చులూ విసిరారు. కిటికీ ఊచల్లోంచి దూరిన ఓ పెచ్చు తగిలి ఆమె నుదురమ్మటా రక్తం కారడం కూడా చూశారు. ఆమె బాధతో తల పట్టుకుని కిటికీ తలుపు వేసేసింది. కక్షతో ఆమె ఏ దుష్టశక్తి ప్రయోగిస్తుందోనని జనం భయపడ్డారు. ఆ కుర్రాళ్ళ జీవితానికి అదే ఆఖరు రాత్రి అన్నట్టు తల్లులు శోకండాలు పెట్టారు. కానీ ఎవరికీ ఏమీ కాలేదు. దాంతో భూస్వామి కొడుక్కి పిచ్చెక్కడానికి కారణం సుబ్బరాజుగారి ప్రేతాత్మేననీ, ఆమె కాదనీ తీర్మానించారు. ఆ ప్రేతాత్మ కూడా జోలికి వచ్చినవాళ్ళనే పట్టించుకుంటున్నట్టు తోచింది. దాంతో కొన్నాళ్లకి అంతా భవంతిని పట్టించుకోవడం మానేసారు. దాని పసుపుగోడల మీద బొగ్గుతో పుర్రెబొమ్మలు గీసి, హెచ్చరికలు రాసారు.

యీ సంఘటనల వల్ల రాజవీధి మర్యాద మాత్రం దిగజారిపోయింది. ఒకప్పుడు ఆ వీధమ్మటా గేదెల్ని తీసుకెళ్ళాల్సి వస్తే వాటి పేడ నేల మీద పడకుండా రైతులు వెనక తట్టలు పట్టుకుని నడిచేవారు. యిప్పుడు అవి వేసిన పేడలు అలానే వీధిలో ఎండిపోతున్నాయి. వీధిలో సందడంతా చచ్చిపోయింది. గుడికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. దాంతో పూల కొట్లు పండగకు తప్ప తెరవటం లేదు. సత్రం పాడుబెట్టేశారు. అప్పటిదాకా శ్రీపాదపట్నానికి నడిబొడ్డుగా మెలిగిన ఈ వీధి క్రమేపీ పక్కకి నెట్టివేయబడింది. ఊరు మరో వైపు ఎదిగింది. ఊరికి అటుచివర గడియారస్తంభం వున్న దుకాణాల కూడలి నడిబొడ్డుగా మారింది. ఏటి వొడ్డున రాజవీధి మాత్రం ఓ శిథిలవాడగా మిగిలింది.

రోజులు గడుస్తున్నాయి. రేణుకాదేవి రోజులెలా గడుస్తున్నాయో మాత్రం ఎవరికీ తెలియదు. ఆమెకి పావురాలే తిండి తెచ్చి పెడుతున్నాయనుకునేవారు. శ్రీపాదపట్నం పావురాళ్ళు అంగళ్ళలో షావుకార్లు విసిరిన నూకల్తో సరిపెట్టుకోక, ఒక్కోసారి తిండిపదార్థాలూ నిత్యావసరవస్తువులూ కూడా దొంగిలించడమే దీనికి సాక్ష్యంగా కనపడేది. దీనికి తగ్గట్టే ఆ భవంతి కిటికీ చుట్టూ పొడుచుకు వచ్చినట్టుండే గూడు ఎప్పుడూ పావురాల్తో కిటకిటలాడుతూ వుండేది. ఆమె ఎవరికి రాణి అయినా కాకపోయినా ఆ పావురాళ్లకి రాణిలానే కన్పించేది. అవి కబుర్లూ, కష్టాలూ, గొప్పలూ, చాడీలూ అన్నీ ఆమెతోనే ఏకరువు పెట్టుకునేవి. మార్దవమైన, స్నేహితం తెలిసిన రాణి! ఈ బూడిదరంగు పావురాళ్ళన్నింటిలోనూ ఆమెకు ఒక తెలుపురంగు పావురం అంటే బాగా మచ్చిక. మిగిలినవన్నీ ఊళ్ళో పచార్లకు, సొంత పెత్తనాలకూ అటూయిటూ పోతూ వస్తూ వున్నా, అది మాత్రం ఎక్కువ కిటికీ దగ్గరే గడిపేది. దాన్నొక్కదాన్నే ఆమె కిటికీ ఊచల మధ్య నుంచి లోపలికి తీసుకునేది. వళ్ళో పెట్టుకు ఆడుకునేది. ఒకవేళ ఈ పావురం కూడా తన గూటి వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి బైటకి వెళిపోతే, ఆమె కలం కాగితాలూ పుచ్చుకుని బొమ్మలేసుకునేది. ఒకసారి ఈ తెల్ల పావురాన్ని కాగితం మీద ఒంటికాలితో నిలబెట్టి దాని గోళ్ళ అంచులమ్మటా కలం కదుపుతూ గీసి, వచ్చిన ఆకృతిని చీకటాకాశంలో పెద్ద నక్షత్రంగా వాడుకుంటూ బొమ్మ గీసింది. గోడకి అతికించిన ఆ బొమ్మ చూసినపుడల్లా తెల్ల పావురం రొమ్ము విరుచుకునేది.

రేణుకాదేవి దగ్గర తనకు దక్కింది చాలా ప్రత్యేకమైన హోదా అని దానికి తెలుసు. దానికి తోడు, ఆమె చేతి స్పర్శ తన కుచ్చుటీకల కన్నా మృదువైందేదో తడుముతున్నట్టూ, ఆమె వడి వెచ్చదనం తన గూటి కన్నా భద్రమైందేదో చుట్టూ ఆవరించుకున్నట్టూ వుండేవి. దాంతో విడిచిపెట్టేది కాదు. ఆమెకు మరింత ముద్దొచ్చే చేష్టలే ప్రదర్శించాలని తపించేది. ఆమె మనసు విరిగేలా ఎపుడూ ప్రవర్తించేది కాదు. అయితే కొన్నాళ్ళకే ఆమె మనసు విరిగే పరిస్థితి కలిగింది. పావురం వల్ల కాదు, మరో వైపరీత్యం వల్ల. ఒకనాడు ఆమె వళ్ళో ఒదిగి అర్థనిమీలిత నేత్రాల్తోవున్న పావురంపై రేణుకాదేవి భళ్ళున గుక్కెడు రక్తం కక్కింది. పావురపు తెల్లని వళ్ళంతా రక్త స్నానం చేసినట్టయింది. అది బెదిరి కిందకు దూకింది. రేణుకాదేవి బాధతో కడుపుపట్టుకుని మెలి తిరుగుతూ నేల మీదకు జారి దొర్లసాగింది. పావురం బెంబేలెత్తి రెక్కలల్లార్చుకుంటూ ఆమె చుట్టూ గెంతింది. కిటికీ ఊచల్లోంచి మిగతా పావురాలూ తలలు లోపలికి పెట్టి కళవళంగా అరవసాగాయి. ఎవరికీ ఏమీ పాలుపోలేదు. చివరికి తెల్లారగట్ల ఎప్పటికో ఆమె తనంతటతానుగా స్పృహలోకి వచ్చింది.

తర్వాతి రోజులు పావురాళ్లకి భారంగా నడిచాయి. ముఖ్యంగా తెల్లపావురాయికి. దానికి యిదివరకటి మాలిమి లేదు. రేణుకాదేవి యిదివరకట్లా వుండట్లేదు. వళ్ళో తీసుకు నిమరడమైతే చేస్తోంది గానీ, ఆ పావురాయికీ తెలుస్తోంది, తన స్థానంలో వేరే ఏ పావురమున్నా, అసలు ఏదన్నా కాకి వున్నా కూడా అట్లానే నిమురుతుందని. ఆమె ఎక్కువ సమయం పందిరిమంచం మీద నిద్రపోవడంలోనే గడుపుతోంది. కిటికీ దగ్గరకు రావడం తగ్గిపోయింది. లోపలికి వచ్చే చొరవ ఎలాగూలేని పావురాలు ఏం చేసేది లేక కిటికీ దగ్గరే చక్కర్లు కొడుతున్నాయి. ఆ చొరవ వున్న తెల్ల పావురం కూడా, ఈ నిర్లక్ష్యం పట్ల తాను కినుక చెందినట్టు ఆమె గ్రహించాలనీ, తను లేని లోటు తెలిసొచ్చి ఆమే స్వయంగా రమ్మనే దాకా లోపలికి వెళ్ళకూడదనీ నిశ్చయించుకుని, ఎక్కువగా బయటే మసలుకుంటోంది. ఒకనాటి ఉదయం కిటికీ దగ్గర మిగతా పావురాళ్ళు గుంపుగా గుమికూడటం చూసి, వాటిని ఆదరాబాదరాగా తప్పించుకొని, తెల్లపావురం లోపలికి వెళ్ళేసరికి, రేణుకాదేవి నేల మీద బోర్లా వాలి తెల్ల కాగితం మీద ఏదో గీస్తోంది. అలికిడి విని తలెత్తి అలసటగా నవ్వింది కూడా. పావురాయి ఊపిరి పీల్చుకుని, గెంతుకుంటూ ఆమె భుజం ప్రక్కకు చేరింది. ఆమె వేసే బొమ్మని తల చకచకా వంకర్లు తిప్పుతూ  ఆసక్తిగా చూసింది. అర్థం కాకపోయినా ఆమెను ఉత్సాహపరిచేందుకు రెక్కలల్లాడించి కువకువలాడింది. ఆమె నవ్వుతూ పావురాన్ని చేతుల్లోకి తీస్కొని ఎండిన రక్తం మరకలతో వున్న దాని శరీరాన్ని జాలిగా నిమిరింది. ముద్దుపెట్టుకుంది. తర్వాత అప్పటిదాకా గీసిన కాయితాన్ని మడిచి దాన్నో దారంతో పావురాయి కాళ్లకు కట్టింది. పొందిగ్గా దోసిట్లో ఎత్తుకు కిటికీ దగ్గరకు వచ్చి ఊచల సందుల్లోంచి గాల్లోకి వదిలింది. మిగతా పావురాళ్ళు కొంత దూరం కుతూహలంతో దాని వెనక ఎగిరాయి గాని, అది కసురుకోవడంతో తిరిగి కిటికీ దగ్గరకు వెళిపోయాయి.

ఎగరడమైతే ఎగిరింది గాని, పావురానికి ఎటువెళ్లాలో తెలియలేదు. కానీ రేణుకాదేవి దగ్గర పాత హోదా తిరిగి దక్కిన ఉత్సాహం ఎటో ఎగరమంటోంది.  రేవు దగ్గర రావి చెట్టు కొమ్మల్లోంచి పలకరించిన పిట్టల్ని పట్టించుకోకుండా, పడవల తెరచాపల్ని చుట్టుతిరుక్కుంటూ, ఏరు దాటి ఉత్సాహంగా క్షితిజరేఖ వైపు సాగిపోయింది. ఎన్నో ఊళ్ళూ పొలాలూ దాటుకుంటూ పోయింది. ఒక చోట ఊరి చివర పొలం మధ్యనున్న ఓ గుడిసె దాన్ని ఆకర్షించింది. ఆ గుడిసె వాకిట్లో పాతిన కర్ర పైని చెక్కగూట్లో పావురాల సందడి కనిపించింది. ముఖ్యంగా పెంటిపావురాల వాసన మదమెక్కించేట్టు వస్తోంది. ఎగురుతున్న పావురం కాస్తా రెక్కల జోరు తగ్గించి, ఆ గూటివైపు దిగింది. దిగుతోంటే తెలిసింది అదో కుమ్మరి గుడిసె అని. కుమ్మరి వాడు అడుసు తొక్కడంలో మునిగి వున్నాడు. పావురం ఉబలాటంగా వచ్చి చెక్కగూట్లో వాలింది. అనుకున్నట్టే అక్కడున్న వాటిల్లో అందమైన పెంటిపావురమొకటి వుంది. దాని వంటి తెలుపూ, రెక్కల నాజూకూ, తోక సోకూ!... పావురానికి కైపెక్కిపోయి దాని చుట్టూ గెంతసాగింది. కాని అదేమంత ఉత్సాహం చూపించలేదు సరి కదా, దీని వంటిపై రక్తపు మరకలు చూసి రోతగా మొహం పెట్టి పక్కకు పోయింది. తెల్లపావురం అంత త్వరగా వెనక్కి తగ్గేది కాదు. కానీ యింతలోనే గూటి చుట్టుప్రక్కలా, పైనా వున్న మిగతా పావురాళ్ళన్నీ వచ్చి దీన్ని అవతలికి పొమ్మని కసురుకోవడం మొదలెట్టాయి. ఈ గలాటా అంతా విన్న కుమ్మరివాడు కొంపదీసి ఏదన్నా గ్రద్ద వచ్చివాలిందేమోనని కంగారు పడి గూటి దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. సరిగ్గా అపుడే గూట్లోంచి నెట్టబడిన తెల్లపావురం సరాసరి వాడి చేతుల్లో పడింది. అయినా అది సిగ్గులేకుండా యింకా గూట్లో పెంటిపావురం కేసే నిక్కినిక్కి చూస్తోంది. తాను కుమ్మరివాడి చేతుల్లో వున్నాననీ, వాడు తన కాళ్ళకున్న కాగితం చుట్టని విప్పదీసుకుంటున్నాడనీ కూడా దానికి స్పృహ లేదు. వాడు కాగితం తీసుకుని పావురాన్ని నేల మీదకు వదిలిపెట్టాడు. పావురానికి అదో కొత్త లోకంలా వుంది. ప్రేమకి అనువైన కొత్త బంగారు లోకం! కుమ్మరి వాడు గుడిసంతా కళ్ళకింపుగా సర్దుకున్నాడు. చుట్టూ దడికి బదులు రంగురంగుల అయిరేణి కుండలు పేర్చుకున్నాడు. గుడిసె మీదకి గుమ్మడి పాదులు దట్టంగా పాకివున్నాయి. గుడిసె చూరు క్రింద సారె తిరుగుతోంది. వాకిట్లో ఓ మూల ఆవం తెల్లటి పొగలు కక్కుతోంది. వాకిలి దాటితే చుట్టూ పచ్చగా పొలాలు ఆవరించి వున్నాయి. ఓ పద్ధతంటూ లేకుండా విసిరేసినట్టున్న ఈ అందాలన్నీ, గుడిసె వాకిట్లో నిలబెట్టిన పావురాల గూటిని ములుకుగా చేసుకుని చుట్టూ పరిభ్రమిస్తున్నట్టున్నాయి. ఆ గూటిలో పావురాలన్నింటి మధ్యా రాణిలాగా తన పావురం! తెల్లపావురానికి, తననిలా పట్టి లాగేస్తోంది ఈ అందానికి మధ్యలో వున్న పెంటిపావురమా, లేక దాని చుట్టూ వున్న ఈ అందమా అన్నది అర్థం కాలేదు. ఆలోచించలేక తల విదుల్చుకుంది. ఓ ప్రక్క కుమ్మరి వాడు అప్పటిదాకా అడుసు తొక్కిన బురద కాళ్ళతోనే గుడిసె గుమ్మంలో కూచుని రేణుకాదేవి పంపిన బొమ్మని ఏకదీక్షగా చూస్తున్నాడు. ఇదే అదనుగా మళ్ళీ ఓసారి గూటి మీదకు ఎగురుదామా అని చూసింది తెల్లపావురం. కానీ పైన అవి యింకా గోల చేస్తూనే వున్నాయి. పెంటిపావురమైతే లోకంలో ఆడజాతి నిరసన అంతా తన కళ్ళల్లోనే పెట్టుకు చూస్తోంది. తెల్లాపావురం మాత్రం ఆ నిరసనను పెద్దగా పట్టించుకోలేదు. రేణుకాదేవి మిగతా పావురాలన్నింటినీ కాదని దీన్ని మాలిమి చేసినప్పటి నుంచీ, దీనికి తన ఆకట్టుకునే శక్తి మీద బోలెడు భరోసా వచ్చేసింది. అయితే అన్నీ తొలిచూపులోనే అయిపోవాలంటే ఎలాగని తనకు తానే సర్ది చెప్పుకుని, మళ్ళీ వచ్చి ప్రయత్నిద్దాంలే, అప్పటికీ కాకపోతే, మళ్ళీ మళ్ళీ వచ్చి ప్రయత్నిద్దాం లెమ్మనుకుంది. ఈ నిర్ణయం యిచ్చిన ఉత్సాహంతో ఉవ్వెత్తున రెక్కల మీద లేచి వచ్చిందారినే వెనక్కుపోయింది. యిక మర్నాటి నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. రోజూ రేణుకాదేవి ఏదో బొమ్మ గీసి కాళ్లకు కట్టి పంపించడం, తెల్లపావురం తిన్నగా ఈ గుడిసె దగ్గర వచ్చి వాలడం. దానికి ఒకటర్థమైంది, రేణుకాదేవి పంపే బొమ్మలేవో ఈ కుమ్మరి మొహాన పడేస్తే, ఆ తర్వాత తాను గూట్లో దూరి పెంటిపావురంతో ఎన్ని సరాగాలాడినా, అది పెంకిగా ఎంత గోల చేసినా, కుమ్మరి వాడిక పట్టించునే ధ్యాసలో వుండడు. కాబట్టి అది వచ్చి వాలీవాలడమే కుమ్మరి వాడెక్కడుంటే అక్కడ వాలేది. వాడు అడుసు తొక్కుతున్నా, సారె తిప్పుతున్నా, కుండలకు మట్టు కొడుతున్నా, బానల్ని ఆవంలో కాల్చుతున్నా, ఎంత హడావిడి పనిలో వున్నా సరే, అన్నీ వదిలేసి పావురం దగ్గరకు వచ్చేసేవాడు. పావురం కాలికి కట్టివున్న కాగితం విప్పుకుని, ఓ మూలకి పోయి, దాన్నే చూస్తూ కూచునేవాడు. ఈ పరధ్యాసని అనుకూలంగా మార్చుకుని తెల్లపావురం నానా తైతక్కలూ ఆడి తొందర్లోనే పెంటిపావురాన్ని గెల్చేసుకుంది.

కుమ్మరివాడు యువకుడు. ఎన్నేళ్ళమట్టో సారె తిప్పుతున్న భుజాలతో, అడుసు తొక్కుతున్న కాళ్ళతో శరీరమైతే బిరుసెక్కింది గానీ, సారెపై మట్టిముద్దని వేలి అంచుల నిపుణమైన కదలికల్తో కుండగా మలిచేటప్పుడు కలిగే సీతాకోక రెక్కంత పల్చనైన పులకలురేపే ఆనందానికి స్పందించడంలో, మనసు మాత్రం స్నిగ్ధత్వాన్ని కోల్పోలేదు. అవే కుండలూ అవే బానలూ ఎన్నిసార్లు చేసినా, అంచు దగ్గర కొత్తగా పెట్టిన మెలికో, మూత మీద కొత్తగా తిప్పిన వంపో అతనికి ప్రతీ కుండ తయారీలోనూ ప్రత్యేకమైన సాఫల్య సంతృప్తిని కలిగించేది. అతని పనంటే అతనికి ప్రాణం. ఎలాగూ పూట గడవడానికి అక్కరకొస్తుంది కాబట్టి కానీ, లేదంటే ఎదురుడబ్బిచ్చైనా చేసేవాడే. రాత్రి పనికట్టేసి గుడిసె వాకిట్లో నులకమంచం వాల్చుకుని పడుకున్నపుడు మాత్రం, గుండెని బంకలా అంటుకున్న ఖాళీతనమేదో ఆవిరిలా అతణ్ణి ఆవరించుకునేది. ఈమధ్య పావురం తెస్తున్న బొమ్మలతో ఈ ఖాళీ కొంత భర్తీ అయింది. యిదివరకట్లా పైన నక్షత్ర ఖచిత ఆకాశమూ, అడపాదడపా తాగితూల్తున్న నక్షత్రాల్లా వంకర్లు తిరుగుతూ ఎగిరే మిణుగురులూ, ప్రక్కన పావురాళ్ళ గుడగుడలూ... యివన్నీ అతణ్ణి వశపర్చుకోలేకపోతున్నాయి. పడుకున్నపుడల్లా ఆ రోజొచ్చిన బొమ్మ గురించి ఆలోచించేవాడు. అవన్నీ అతణ్ణి ఆకట్టుకున్నాయి. బూడిదరంగు పావురాల్ని పూసిన రావిచెట్టూ, తెరచాపలు విడిచి వీధుల్లో తేల్తూ ప్రయాణిస్తూన్న మేడలూ, గిట్టలకు అంటిన పుప్పొడితో దేవగన్నేరు పూల చుట్టూ తుమ్మెదరెక్కల్తో చక్కర్లు కొడుతున్న బుల్లి గేదెలూ... యిలా వింతగా వుండేవి ఆ బొమ్మలు. ఒక్కో బొమ్మలో ఆహ్లాదం వుండేది, ఒక్కో బొమ్మలో దిగులు వుండేది, కానీ ప్రతీ బొమ్మలోనూ ఏదో తరుముకొస్తున్న తొందర వుండేది. బొమ్మల గీతల్లో ఏదో అందమైన మనసు శ్రద్ధ పెట్టి గీసినట్టు తెలిపే అపరిపక్వత వుండేది. అది అతనికి బాగా నచ్చింది. కానీ ఎవరికో నిర్దేశించబడిన ఈ సంకేతాలన్నీ పావురం కామ ప్రకోపం కారణంగా దారి తప్పుతున్నాయని ఆ పంపేవాళ్ళకెలా తెలియజెప్పాలో కుమ్మరివాడికి తెలిసింది కాదు. పావురం వెనక్కి వెళ్తున్నపుడు తిరుగుటపాలో ఏదన్నా రాసి పంపుదామంటే అతనికి చదువు రాదు. పైగా బోలెడంత కుతూహలం పెరిగిపోతోంది. చదువైతే రాదుగానీ, కుమ్మరిది కుశాగ్రబుద్ధి. ఒకనాడు పావురం తెచ్చిన బొమ్మలో కిటికీ ఊచల్లోంచి కన్పిస్తున్నజనార్దనస్వామి రథం వూరేగింపూ, దాని చిటారు కొమ్మ మీద తాటాకంత రెక్కల్ని అల్లలాడిస్తున్న పెద్ద గ్రద్ద వున్న దృశ్యం చూసాక, ఈ బొమ్మలెక్కణ్ణించి వస్తున్నాయో ఊహించగలిగాడు. కుంభవృష్టిగా వర్షం కురుస్తున్న ఓ రోజు, గుడిసె గొళ్ళెం వేసి, గొడుగు చేతపట్టుకుని, శ్రీపాదపట్నానికి ప్రయాణమయ్యాడు.

శ్రీపాదపట్నం పోవడానికి ఏరు దాటాలి. పడవలో వున్నంతసేపూ బొమ్మలున్న కాగితాల్ని కండువాలో మడతపెట్టి చంకలో దోపుకున్నాడు. తెడ్డేస్తున్న పడవవాడు వాన ధాటికి చుట్ట మాటిమాటికీ ఆరిపోతుంటే కాసేపు తెడ్డేయడం ఆపి కుమ్మరి పట్టుకున్న గొడుగులో దూరి కాల్చుకున్నాడు. చంకలో వున్నవేంటని అడిగాడు. సొమ్ములన్నాడు కుమ్మరివాడు. ఒకే గొడుగులో వున్నాక మాట కలపకపోతే బావుండదని, శ్రీపాదపట్నంలో ఆ యేడు రథంవూరేగింపు ఎలా జరిగిందని అడిగాడు పడవవాణ్ణి. వాడు పొగాకు ఉమ్ము ఏట్లోకి ఊసి, ప్రతీ యేడూ ముంగటి ఏడు కన్నా నాసిగా జరుగుతోందనీ, ఈ యేడూ అల్లానే అయిందనీ, జనార్దనస్వామి అజాపజా పట్టించుకునేవాళ్ళు లేకండాపోయారనీ, తిరణాలక్కూడా జనం రాటం లేదనీ, వేరే యాపారం పెట్టుకుందారని చూస్తన్నాననీ, యిదిగో పడవ అమ్మకానికే బేరం తెవలట్లేదనీ... మొత్తం కథంతా చెప్పుకొచ్చి, చుట్ట వో చివరి పట్టు పీల్చి, మళ్ళీ ఆదరాబాదరాగా తెడ్డేయడానికి వెళిపోయాడు. ఏనుగు తొండాల్తో కుమ్మరించినట్టు కురుస్తున్న వానలో జనార్దనస్వామి గుడిగోపురం లీలగా కనిపించడం మొదలుపెట్టింది.

రేవులో దిగి వీధి పైకి నడిచాక అతనికి రాజ భవంతిని ఆనవాలు పట్టడం కష్టం కాలేదు. ఎందుకంటే పావురం తెచ్చిన చివరిబొమ్మ ప్రకారం రథం చిటారుకొమ్మ కిటికీలోంచి కనపడాలంటే అది రెండంతస్తుల భవంతి అయివుండాలి. ఆ వీధిలో రెండంతస్తులున్న భవంతి అదొక్కటే. దాని ఎదుట నిలబడి కాసేపు పై అంతస్తు కిటికీ వైపు చూసాడు. కానీ దళసరి వానతెర వల్ల ఏమీ స్పష్టంగా కనపడలేదు. చివరికి ఎత్తు అరుగుల మెట్లెక్కి, గొడుగు అరుగు మీద ఆరబెట్టి, లోపలికి తొంగి చూస్తూ పిలిచాడు. ఎవరూ పలకలేదు. చాలాసేపు చూసి చూసి యిక లాభం లేదని జంకుతూనే లోపలికి వెళ్లాడు. మొత్తం అంతా తిరిగాడు గానీ ఎవరూ లేరు. ఒక చోట పచ్చగా చెక్క మెట్లు పై అంతస్తుకి వెళ్తున్నాయి. ఎక్కి పైకి వెళ్ళాడు. లోపల గదిలో పందిరిమంచం మీద ఒకామె నిద్రిస్తోంది. లేపబుద్ది కాలేదు. లేచేదాకా వుందాంలే అని గుమ్మానికి ఆనుకుని నిలబడిపోయాడు. అంత అందమైన ముఖం వాడు అదివరకూ కలల్లో కూడా చూడలేదు. చూస్తూ వుండిపోయాడు. నిద్ర మధ్యలో ఓ సారి కళ్ళు తెరిచిన రేణుకాదేవి, యిలా తన గుమ్మం దగ్గర ఆనుకుని వున్న కొత్త మనిషి కూడా తన కలలో భాగమన్నట్టు, పలకరింపుగా నవ్వి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆమె కళ్ళు వెంటనే మూసేసినా, ఆమె నవ్వుకు ప్రతిగా కుమ్మరి నవ్విన నవ్వు మాత్రం కాసేపలానే అతని ముఖం మీద తారాడింది. పూర్తిగా నిద్రలేచింతర్వాత కూడా, ఆమె ఏ కొత్తా కనపరచలేదు. యిందాకటి నవ్వుకు కొనసాగింపులాగా పలకరింపుగా నవ్వి, నింపాదిగా లేచి కూర్చుని, లోనికి రమ్మని పిలిచింది.

కుమ్మరి అణకువగా లోనికి వచ్చి తనను పరిచయం చేసుకున్నాడు. ఉత్తరాలు దారి తప్పుతున్న సంగతి చెప్పి, వాటిని ఆమెకి అందించాడు. ఆమె అదేమీ పెద్ద విషయం కాదన్నట్టూ వాటిని తీసుకుని పక్కన పెట్టేసింది. ప్రయాణం సంగతి అడిగింది. అతను ప్రయాణం బానే జరిగిందని చెప్పి, తనకు చదువురానందువల్లనే ఈ విషయం తిరుగు టపాలో పంపలేక స్వయంగా రావలసివచ్చిందని, సంజాయిషీగా ఏదో మొదలుపెట్టాడు. ఆమె ఆ విషయంపై ఆసక్తి చూపించకుండా, కిటికీ దగ్గరున్న కుర్చీ లాక్కుని కూచోమంది. కుర్చీ లాక్కుంటున్నపుడు అతనికి కిటికీ ఊచల దగ్గర వానలో తడవకుండా మునగదీసుకు వణుకుతున్న తెల్లపావురం కనపడింది. ముద్దుగా పలకరించాడు గానీ, అదేమీ గుర్తించనట్టు ఓసారి ముక్తసరిగా కువకువమని మిన్నకుండిపోయింది. కుర్చీ పందిరిమంచానికి ఎదురువేసుకుని కూర్చున్నాక, రేణుకాదేవి అతని వివరాలు అడిగింది. మొదట్లో ఆమె వంటి రాచరికపు మనిషి తనబోటి వాడి జీవితం నుంచి ఏమి తెలుసుకోగోరుతుందని తను అనుకుంటున్నాడో ఆ వివరాలు చెప్పాడు. తన కుమ్మరి పని గురించీ, తను తయారు చేసే సరుకు రకాల గురించీ, ఈ మధ్య గిరాకీ ఎలా వుందన్న దాని గురించి, తమ వంశంలో మంచి పనివాళ్ళ గురించీ... యివన్నీ చెప్పుకొచ్చాడు. ఆమె తలాడిస్తూ వింది. కానీ కాసేపటికే ఒకటి గమనించాడు. ఆమె ఈ విషయాల మీద కన్నా, యివి చెప్పడంలో మాటవరసగా అడపాదడపా దొర్లే తన మనసుకు నచ్చిన విషయాల పట్లే ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. అవి అల్ప విషయాలు. గొప్పవాళ్ళ దగ్గర ప్రస్తావించేందుకు అనర్హమనిపించే తేలిక విషయాలు. ఒకసారి దొడ్లో బంతిపూల మొక్కల్ని కుందేలు వచ్చి ఊరికే కొరికేస్తుంటే, దాన్ని అదిలిద్దామన్చెప్పి, తిరుగుతున్న సారెని అలానే వదిలేసి పరిగెత్తాడు. తరిమేసింతర్వాత వచ్చి చూస్తే సారె మీద మట్టిముద్దగా కూలిపోయిన కుండ అచ్చంగా కుందేటి తలకాయలా వుందన్న విషయం చెప్పినపుడు ఆమె కళ్ళు విప్పార్చుకు విన్నది. అలాగే పొలాల్లో తిరిగే ఓ తోడేలు రాత్రుళ్ళు తన గుడిసెకి వచ్చి కుండల్లో తల పెట్టి ఊళ వేసేదని, తన పాట సోకుకీ గొంతు గంభీరానికీ తనే మురిసిపోయేదనీ చెప్తూంటే, ఆమె చెంపలు విప్పార్చి నవ్వింది. తన కిటికీ దగ్గర కూడా పావురాలు చేసే అలాంటి అల్లరి చేష్టల్ని చెప్పింది. తనకు నచ్చే మాట ఏది చెప్పినా ఆమెకి నచ్చుతోంది. అతను తొందర్లోనే జంకు వదిలేసాడు. ఎపుడూ వెలుగు చూడని లోపల్లోపలి కలలన్నింటికీ మాటలు ఏరి తెచ్చి బైటికి సాగనంపుతున్నాడు. ఆమె మంచం మీద కాసేపు బాసింపట్టు వేసుక్కూచునీ, కాసేపు కాళ్ళు కిందకి వేలాడేసి, కాసేపు శేషశయనుడైన విష్ణుమూర్తిలా తలగడ మీద వాలిపోయి, ఊ కొడుతూ వింటోంది. తనకు తోచినవి చెప్తోంది. ఒకరికొకరు ఎంత తెలిసిపోయారంటే, ఒకరి సంగతులు చెప్పుకుంటున్నపుడు మరొకరు వింటూ ఊరుకోకుండా, నువ్వలా చేసావంటే నమ్మను! అని ఆశ్చర్యపోవడమో, అబ్బే అందాకా వస్తే నువ్వెందుకూరుకుంటావని ఎగదోయడమో, నీకు చాలా బాధేసివుంటుందని జాలిపడడమో, యిలా ఎదుటివారి స్పందనని స్వంతం చేసేస్కుని మాటలు కలుపుతున్నారు. యిలా గంటలు కరిగించేశారు. కిటికీ దగ్గర తెల్లపావురం తల తిప్పుకుని వానాకాలాన్ని విసుక్కుంటోంది.

చీకటివేళ అయింది. బయట వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. తర్వాత వెళ్దువు లెమ్మని రేణుకాదేవి అతణ్ణి నిలేసింది. అతనికీ వెళ్లాలని లేదు. అసలు ముందూ వెనకలేం పట్టడం లేదు. అతని ప్రపంచమంతా ఆమె ప్రభావంలో చకితమైపోయివుంది. క్షణాలు ఉద్విగ్నమై మనోహరమై బిగుస్తూ వదులవుతూ ప్రజ్వలించి సంచలిస్తున్నాయి. మనసు స్థలకాలాలకు అతీతమై చీకటి శూన్యంలో ఒకేవొక్కటై వెలుగుతోంది. నేల మీద చమురుదీపపు వెలుగువలయంలో యిద్దరూ కూర్చున్నపుడు ఆమె తన బొమ్మల్ని చూపిస్తూంటే భుజం మీంచి తొంగి చూస్తున్నవాడల్లా ఆమె చెంపలకి చెంప ఆనించకుండా వుండలేకపోయాడు. అతని వేడి చెంపని ఆమె అనునయంగా స్వీకరించింది. బుజ్జగిస్తూ ముందు బొమ్మలు చూడమంది. అతను అప్పటికే కాలిపోతున్నాడు. ఆమెను వళ్ళో లాక్కున్నాడు. మెత్తని ఆమె శరీరాన్ని వడి నిండా పరచుకున్నాడు. తర్వాత ఏం చేయాలో తెలియని కంగారులో పడ్డాడు. మరో శరీరాన్ని ఎన్నడూ అంత చేరువగా తాకలేదు తడమలేదు అదుముకోలేదు. సారె మీద వేళ్ల మధ్య నలిగే మట్టి ముద్ద కన్నా మెత్తగా వుంది ఆమె శరీరం. తేలికైన ప్రాణాన్ని దాచుకున్న పక్షిఎదను నిమురుతున్నట్టు వుంది. ఆమె కూడా, సర్వాంగాలూ పరాధీనాన్ని అంగీకరించి కొత్త స్పందనల్ని చూపిస్తూంటే ఆసరా అందని భయంలో మొద్దుబారిపోయినట్టయి చాలాసేపటి దాకా మృతశరీరంలా అతను ఎటు తిప్పుకుంటే అటు తిరిగింది. అతని శరీరానికి అనుబంధమైపోయి మసలుకొంది. అతను సున్నితత్వం మర్చిపోయాడు. వేటకందిన జీవి ప్రాణంపోగొట్టుకుంటున్న వేదనామయ వొంటరి క్షణాల్లో చంపుతున్న తనే ఆసరా అందిస్తున్నట్టు పులి తన పంజాల్తో ఎంత దగ్గరగా పొదువుకుంటుందో అలా ఆమెని పొదువుకుంటూ, మెడ నోటకరిచి ఎలా అనువైన భంగిమలకి తిప్పుకుంటుందో అలా ఆమెని తిప్పుకుంటూ రమించాడు. చివరకు చలిగా జలదరించి విగత వీర్యుడై ఆమె చిరుచెమటల ఎదపై నిస్సత్తువుగా వాలినాకనే ఆమె పునర్జీవితురాలైనట్టు మరలా నవ్వింది.

ఆ రాత్రి చాలాసేపు నేల మీదే ఎదురుబొదురు ఒత్తిగిలి పడుకుని చమురుదీపం వెలుగులో మసగ్గా కనిపిస్తున్న ఒకరి మొహాల్ని ఒకరు చూసుకుంటూ, ఊరికే ఒకర్నొకరు తడుముకునేందుకు సాకుగా మధ్య మధ్యలో అల్ప విషయాలను, అవి కేవలం మాటలే కానక్కర్లేదు, ఉచ్ఛ్వాసనిశ్వాసాలైనా మూలుగులైనా నవ్వులైనా సరే గొణుక్కుంటూ, అతను ఆమె చెవి తమ్మెల్నో, ఆమె అతని ఛాతి వెంట్రుకల్నో నిమురుతూంటే, ఒళ్ళిక ఒళ్ళు కాకుండా పోయి మళ్ళీ కాక రేగి, మీదకు జరిగి మైథునానికుపక్రమిస్తూ, మొత్తం రాత్రంతా యిలాగే, అతని ప్రహరణాల్ని ఉరుములూ ఆమె మణికూజితాల్ని పావురాళ్ళ కువకువలూ మింగేస్తూండగా ఎప్పటికో సుదీర్ఘంగా తెల్లారింది. ఆ తర్వాతి కొన్ని రోజులూ కూడా యిలాగే సాగాయి. అయినా ఒకరి శరీరంపై ఒకరికి తనివి తీరలేదు. ఒకరి కబుర్లలో మరొకరికి కొత్త కథలు వినిపిస్తూనే వున్నాయి. కానీ అతనిలో దిగులు మొదలవసాగింది. ఆమెను గుడిసెకు తీసుకుపోవాలన్నది అతని ఆశ. మాటల్లో జంటగా తామిద్దరి భవిష్యత్తును ఆమె కళ్ళకు కట్టించడానికి ప్రయత్నించేవాడు. ఆ ప్రస్తావన వచ్చినపుడు ఆమె ఎపుడూ నిశ్శబ్దాన్ని అవలంబించేది. అతను కాసేపు అనునయంగా బుజ్జగించేవాడు, కాసేపు అసహనంగా వేడుకునేవాడు. ఆమె తల దించుకుని పరికిణీ అంచుల్ని మడతపెట్టడమో, నేల మీద గీతలు గీయడమో చేస్తూండేది. ఆమె ఎప్పుడూ ప్రస్తుతంలోనే వుండేది, ఈ క్షణాలు చాలదా అన్నట్టు ప్రవర్తించేది. ఎందుకు సరిపెట్టుకోవాలో అతనికి తెలియదు.

ఒకనాడు రేణుకాదేవి ప్రవర్తన వింతగా వుంది. చంచల చిత్తంతో కంగారుగా వుంది. అతని కౌగిట్లో వుండీ లేనట్టు వుంది. మునుపటి క్షణం వరకూ ఎంత సన్నిహితంగా వుందో, మరుసటి క్షణమే అంత పరధ్యానంగానూ ప్రవర్తిస్తోంది. అతనిలో దిగులూ అసహనం తారాస్థాయికి చేరుకున్నాయి. ఏదీ తేలని అనిశ్చితి విసుగు పుట్టిస్తోంది. ముందువెనకల్లేని ఈ త్రిశంకు స్వర్గం అయోమయం కలిగిస్తోంది. చివరి అస్త్రం ప్రయోగించి చూద్దామనుకున్నాడు. తాను వెళిపోదల్చుకున్నాననీ, తనతో కలిసి బతకదల్చుకుంటే పావురంతో కబురంపమనీ చెప్పి కదిలాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది. కనీసం ఆగమని కూడా అడకపోవడం చూసి విసురుగా గడపదాటి చరచరా మెట్లు దిగేసాడు. క్రిందకి వచ్చేసరికి యిపుడు వెళిపోతే తనకేమి మిగులుతుందో తలచుకుంటే గుబులు వచ్చేసింది. దాంతోపాటే అనుకున్నపుడల్లా మౌనంతో తన అంతరంగ ద్వారాల్ని మూసేసుకుని తనని వెలుపలే నిలబెట్టే ఆమె మంకుతనం మీద కోపం వచ్చేసింది. అదే వేగంతో మెట్లెక్కి గదిలోకి వచ్చి ఆమెను దూషించసాగాడు. తర్జని చూపిస్తూ ఆరోపణలు చేయసాగాడు. బెదిరింపులకూ దిగాడు. అన్నీ బయటకు కక్కేసి ఖాళీ అయిపోయిం తర్వాత, ఈ ఉపద్రవంలో తానెంత వెలికిరాలేనంతగా, వెలికిరాయిచ్ఛగించనంతగా కూరుకుపోయాడో అర్థమై, వెక్కి వెక్కి ఏడ్వసాగాడు. ఆమె కదిలి వచ్చి అతణ్ణి కౌగిలిలోకి తీసుకుంది. అలిసిపోయినవాడై యిక తన జీవితాన్ని నిగూఢమైన ఆమె మనస్సాక్షి యిచ్ఛకు వదిలేసినట్టు నిస్సత్తువగా ఆమె చేతుల్లోకి వాలిపోయాడు. యిద్దరూ నేల మీదకు ఒరిగిపోయారు. ఆమె అతణ్ణి వళ్ళోకి తీసుకుని తల నిమురుతూ చెప్పింది, తనకు చావు రాసిపెట్టి వుందనీ, మృత్యువు తన ప్రాణాన్ని తీసుకుపోవటానికి రేపు రాత్రే వస్తుందనీ, అపుడు ఎక్కడున్నా ఒకటేననీ, కానీ నువ్వు నా దగ్గరుండటం ముఖ్యమనీ చెప్పింది. అతను తలెత్తి ఆమె కళ్ళల్లోకి శూన్యంగా చూశాడు. మొద్దుబారిన మనసుతో అయోమయంగా ఆమెను నలిపేస్తూ కౌగలించుకున్నాడు. ఆమె ఉప్పటి కన్నీటి కళ్ళ మీద ముద్దుపెట్టుకున్నాడు. చావుని రానివ్వనన్నాడు. అడ్డం నిలబడతానన్నాడు. ఆమె ఏదో విషయం గుర్తు వచ్చిననట్టు అతణ్ణి విడిపించుకు లేచింది. పందిరిమంచం వైపు నడిచి, పరుపు పైకెత్తి, అక్కడున్న ఒక పెద్ద దబ్బనాన్ని తెచ్చి అతని చేతికి యిచ్చింది. మృత్యువు వచ్చినపుడు ఈ దబ్బనంతో తన గుండెల్లో పొడిస్తే తాను మారు రూపం దాలుస్తాననీ, మృత్యువు గుర్తుపట్టలేక వెళ్ళిపోతుందనీ, తర్వాత ఆ మారిన రూపాన్ని మళ్ళీ పొడిస్తే తిరిగి పూర్వరూపానికి వస్తాననీ చెప్పింది.  అతనికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆమె నిద్రిత ముఖాన్ని చూస్తూ వుండిపోయాడు.

మరుసటి రోజు పౌర్ణమి. ఉదయమంతా ఎవరి లోకం వారిదన్నట్టు వున్నారు యిద్దరూ. లేక అతణ్ణి అతని లోకంలో వుండనియ్యడం కోసం ఆమె దూరంగా వుందేమో, అతనికి తెలియదు. ఆ రోజు వాన వెలియడంతో కిటికీ దగ్గర పావురాళ్ళు మునుపట్లా సందడి చేసాయి. రేణుకాదేవి ఆ రోజు తెల్లపావురాన్ని ఒకటే ముద్దు చేసింది. అతను మాత్రం గదిలో ఓ మూల వొదిగి గుబులు గుండెల్తో ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. అతనికి తన గుడిసె, కుండలూ గుర్తొచ్చాయి. అదంతా చేరుకోలేని దూరంగా, తిరిగిరాని గతంగా అన్పించింది. రాత్రి కానే వచ్చింది. పూర్ణచంద్రుడు ఏటి మీద పెద్దగా ఉదయించాడు. కాసేపటికే బయటంతా పిండారబోసినట్టు వెన్నెల. వున్నట్టుండి పావురాళ్ళు ఒక్కొకటిగా కిటికీ వదిలి తమ గూళ్ళకు వెళిపోయాయి. వెళ్ళలేక అక్కడే తచ్చాడుతున్న తెల్లపావురాన్ని ఆమె బుజ్జగించి పంపించేసింది. అతని వైపు తిరిగింది. మూలనున్న అతను చేతులు చాచి రమ్మంటే దిగులుగా వెళ్ళి వళ్ళో కూచుంది. ఎవరూ లేచి చమురు దీపం వెలిగించలేదు. కిటికీలోంచి ముద్దగా పడుతున్న వెన్నెల వెలుగు సరిపోయింది. నేల మీద కిటికీ ఊచల్తో సహా పరుచుకున్న వెన్నెల పలక అతనికి ప్రమాదకరంగా, తమ గూటిలోకి ఆగంతక చొరబాటుగా అనిపించింది. యిద్దరూ గది మూల మసక చీకటిలోనే చాలాసేపు ఒదిగి కూచున్నారు. అతని గడ్డం మీద ముద్దు పెట్టి ధైర్యాన్నిస్తున్నట్టు వీపు నిమిరింది. ఆమె రొమ్ముల కింద నుంచి చేతులు కట్టి దగ్గరకు లాక్కున్నాడు. యిరువురి గుండె సవ్వళ్ళే విరామచిహ్నాలుగా గడియల గద్యం గుబులుగా గడిచింది. అర్థరాత్రి అవుతుందనగా ఆమె అతని కౌగలి విడిపించుకులేచింది. వెళ్ళి పందిరిమంచం మీద పడుకుంది. అతనికి సమయం ఆసన్నమైనట్టు అర్థమైంది. లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. వంటి మీద చలి మరకలా వెన్నెల పాకింది. బయట రేవులో పడవలు గాలికి జోగుతున్నాయి. నీళ్ళు ఒడ్డుకేసి కొట్టుకుంటున్నాయి. రావి ఆకులు గలగల్లాడుతున్నాయి. ఎక్కణ్ణించో తోడేటి ఊళ వినిపిస్తోంది. అతనికి ఉన్నట్టుండి పడమటి దిక్కున క్షితిజరేఖకు పైనగా ఏటి అవతల్నించి ఏదో నల్లగా ఎగురుకుంటూ రావడం కన్పించింది. పక్కకు తిరిగి ఆమె వైపు చూసాడు. మసక చీకట్లో ఆమె కళ్లు విప్పారి చూస్తున్నాయి. వేగంగా పందిరిమంచం మీద ఎక్కి ఆమెని వెనక నుంచి కౌగలించుకుని చెక్కిలిపై ముద్దు పెట్టాడు. కళ్ళు మూసుకుని దబ్బనాన్ని పిడికిలి మధ్య బిగించి గుండెల్లో గట్టిగా పొడిచాడు. కౌగిట్లో ఆమె శరీరం విలవిల్లాడటం కాసేపు తెలిసింది. తర్వాత హఠాత్తుగా ఆమె శరీర స్పర్శ  లేకుండాపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి పక్క మీంది ఓ కప్ప క్రిందకి దూకుతూ కన్పించింది. అతను దిగ్గున లేచి కూర్చున్నాడు. అదే సమయానికి కిటికీ దగ్గర రెక్కల చప్పుడూ, ఏదో వాలిన అలికిడీ వినిపించింది. దాని నీడ నేల మీద వెన్నెల పలకలో కన్పిస్తుంది. అతను లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. తాటాకంత రెక్కల్తో ఒక పెద్ద గ్రద్ద ఊచల్లోంచి తలపెట్టి తొంగిచూస్తోంది. అతను దబ్బనాన్ని వీపు వెనక దాచుకుని కిటికీకి ఎదురెళ్ళి నుంచున్నాడు. కానీ అది మాత్రం అతనక్కడ లేనేలేడన్నట్టు మెడ అటూయిటూ తిప్పుతూ గది అంతా కలయజూస్తోంది. ఎవరూ కన్పించకపోయేసరికి అసహనంగా అతనివైపు చూసి వికృతమైన అరుపు అరిచింది. రెక్కల్ని తాటించుకుంటూ వెనక్కి ఎగిరిపోయింది. అది రావి చెట్టు దాటి, పడవల తెరచాపలు దాటి, ఏరు దాటి, క్షితిజరేఖపై చిన్న చుక్కగా మారిపోయేంత వరకూ కుమ్మరివాడు కిటికీ దగ్గరే నిలబడి చూశాడు. తర్వాత కూడా చాలాసేపు అక్కడే వుండి, అది మరిక తిరిగి రావటం లేదని నిశ్చయించుకున్నాక, అప్పుడు కప్ప కోసం గదంతా కలయజూసాడు. ఎక్కడా లేదు. చమురు దీపం వెలిగించి పందిరిమంచం పైనా క్రిందా, గది మూలమూలల్లోనూ వెతికాడు. తలుపు సందు ఓరగా తెరిచి వుండడం చూసి ఆందోళనగా మెట్ల మీదకు వెళ్ళాడు. దీపంతో మెట్లు పరీక్షించాడు. కప్ప తడి కాళ్ళ ముద్రలు కన్పించాయి. హఠాత్తుగా అతని మనసులో ఒక అనుమానం ప్రవేశించింది. ఆమెకు మనిషిగా వున్నప్పుడు తాను ప్రియుణ్ణన్న స్పృహ వుంటుంది. కప్పగా వున్నపుడు వుండకపోతే. తనిప్పుడు ఆమెకి ఏమీ కాకపోతే. ఆ తెలివిడి కూడా ఆమెకి లేకపోతే. అతని చేతిలో దీపం వణికిపోసాగింది. అతను మొత్తంగా వణికిపోసాగాడు. జారుతోన్న గుండెల్తో కింద అంతస్తు గదులన్నీ వెతికాడు. పేరుపెట్టి పిలిచాడు. పొంగి వస్తున్న ఏడుపు కంఠంలోనే దిగమింగుకుని కప్ప బెకబెకల కోసం చెవులు రిక్కించి విన్నాడు. చివరకు నిర్మానుష్యమైన నిశీథి వీధిలోకి వెళ్ళి వెన్నెల వెలుగులో కన్నీటి మసకను తుడుచుకుంటూ అంతా వెతికాడు. ఏటి ఒడ్డున బురదలోంచి బెకబెకలు విన్పించి చివ్వున లేచి అటు మళ్ళాడు. కానీ అక్కడ ఒక్కటి కాదు, వందల కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. అటు పరిగెత్తుకు వెళ్ళాడు గుండెలవిసేలా ఏడుస్తూ.

శ్రీపాదపట్నానికి తెల్లారింది. ఏటి మీదకు పడవలు తీసికెళ్దామని వచ్చిన బెస్తవాళ్ళకు నీటిలో వెల్లకిలా తేల్తున్న కప్పల కళేబరాలు చాలా కన్పించాయి. కాస్త దూరాన వంటినిండా బురదతో తుప్పలన్నీ వెతుకుతున్న మనిషి కూడా ఒకడు కనపడ్డాడు. బెస్తవాళ్ళు వాణ్ణి పట్టుకున్నారు. జనం పోగయ్యారు. పెద్దలు వచ్చారు. కాస్త గొడవా గోలా జరిగింతర్వాత సంగతి అర్థమై వాడి మానాన వాణ్ణి వదిలేశారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. కాలక్రమేణా బురదగుంటల్లో దబ్బనం పట్టుకు తిరిగే అతని వాలకం జనానికి అలవాటైపోయింది. వాణ్ణి కప్పలోడని పిలిచేవారు. పుణ్యానికి అపుడపుడూ పిలిచి అన్నం పెట్టేవారు. తెల్లపావురం అతణ్ణి జాలితో చూసేది. అది కూడా దొరికిన తిండేదో అతని భుజంపై చనువుగా వాలి నోటి కందియ్యడానికి ప్రయత్నించేది. ఒక్కోసారి నోరు చాపేవాడు, ఒక్కోసారి విదిలించుకునేవాడు. ఆ పావురం తర్వాత చాన్నాళ్ళు బతికింది. బతికినంత కాలం తన రెక్కలపై రేణుకాదేవి రక్తపు మరకలు చెరిగిపోకుండా వుంటానికి వానలో తడవకుండా జాగ్రత్త పడేది.
_______