February 26, 2011

పుస్తకాల్ని పైకి చదవడం గురించి

పుస్తకాల్ని పదిమందిలో పైకి చదవడం నాకు అస్సలు అలవాటు లేదు. చిన్నప్పుడు క్లాసులో టీచర్లు రెండుమూడుసార్లు పాఠాల్ని పైకి చదివించిన గుర్తుంది. కానీ నాకు మందిలో మసలుకోవడమంటే అంత సౌకర్యంగా ఉండదు. అలాంటి సందర్భాల్లో నా స్వభావాన్ని ఎక్కువసేపు అంటిపెట్టుకు వుండలేను. అది నాకే మసకగా మారిపోతుంది. చుట్టూ జనాల అంతరంగాల్లో బహుశా నేను ఎవరినై ఉంటానని అనుకుంటానో, ఆ పొగదెయ్యాల్లాంటి ప్రతిబింబాలు నన్ను చుట్టుముట్టి శాసిస్తాయి. ఒకేసారి అన్ని "నేను"ల గోల తికమకపెడుతుంది. నిభాయించుకోలేక అభాసుపాలవుతాను. చిన్నప్పుడు నేను మొత్తం క్లాసు ముందు నిలబడి పాఠం చదివిన కొన్ని సందర్భాలూ ఇలాంటివే. దీనికి తోడు నాకు నా గొంతే ఒక అడ్డం. మామూలుగా తక్కువగా మాట్లాడేవాళ్లకి తమ గొంతు వినే అవకాశం తక్కువ. ఇలా ఏదైనా పైకి చదవటం మొదలుపెట్టిన కాసేపటికే నా ధ్యాస చదవబడే విషయాన్ని వదిలి, చదువుతున్న నా గొంతు వైపు మళ్ళుతుంది. స్వరంలో హెచ్చుతగ్గులు, విషయాని కనుగుణంగా గొంతు మార్చటం... వీటిపైకి దృష్టిపోతుంది. దీంతో ఒకేసారి పుస్తకంలోని విషయం మీదా, నా వ్యక్తీకరణ మీదా శ్రద్ధ పెట్టగలిగేంతటి ఏకాగ్రత లేని నా మెదడుకు పేజీ మీద వున్న విషయం అలుక్కుపోతుంది. నేను తడబడతాను. మనకు చేతకానివి క్రమేణా మనకు నచ్చనివిగా మారిపోతాయి. నచ్చకపోవడానికి సమృద్ధిగా కారణాలు కూడా వచ్చి చేరతాయి. నావరకూ బహిరంగ పుస్తక పఠనాలు వ్యర్థ ప్రహసనాల విభాగంలోకి మళ్ళిపోయాయి. రచనను ఒకరు చదవడం, పదిమంది వినడం అనేది అసలు పుస్తకాల్ని ఆస్వాదించేందుకు పనికిరాని పద్ధతి అనీ, పుస్తకాల్ని చదవటమనేది ఒంటరిగా వున్నపుడు మాత్రమే అర్థవంతంగా సాగే పని అనీ అభిప్రాయం బలపడింది. ప్రేయసితో ఏకాంతం కావాలి. పుస్తకాలతో కూడా అంతేనని.

అయితే ఒక్కడినే వున్నపుడు మాత్రం అపుడపుడూ బిగ్గరగా బయటకి చదువుతూంటాను. దీనికి కారణం వుంది. గొప్ప రచయితలేం చేస్తుంటారంటే, లేదా అప్పుడప్పుడూ ఏం చేయగలుగుతారంటే, భాష ద్వారా సాధ్యమయ్యే అభివ్యక్తి అవధుల్ని దాటేసి, భాషకు ఆవలి భావాల్ని స్ఫురింపజేయగలుగుతారు. చూట్టానికి అచ్చులు హల్లులతో అవే పదాలూ, వ్యాకరణానుగుణమైన అవే వాక్యాలూ ఏదో విషయాన్ని వ్యక్తీకరిస్తూనే వుంటాయి. కానీ దాన్ని మించిన భావమేదో అందీఅందకుండా ఆ వాక్యాల చుట్టూ ఒక ఆవిరిలానో కమ్ముకునో, వాటి వెనక నీడలా తచ్చాడుతూనో ఉంటుంది. అదేమిటాని పట్టిపట్టి అర్థంచేసుకోబోతే-- ఆ ప్రయత్నం చేసినకొద్దీ-- ఇంకా దూరమైపోతుంది. కానీ అర్థంచేసుకోవటాన్ని మించిన అనుభవమేదో స్ఫురిస్తూనే ఉంటుంది. ఈ ఫీట్‌ని అందరు రచయితలూ అన్నిసార్లూ చేయలేరు. కొందరే, అదీ వాళ్ల సామర్థ్యపు అంచుల్ని అప్రయత్నంగా అందుకోగలిగినపుడు మాత్రమే చేయగలుగుతారు. చదువుతూ చదువుతూ వుండగా, హఠాత్తుగా కమ్ముకున్న ఇంద్రజాలం మనల్ని చకితుల్ని చేస్తుంది. వొళ్ళు జలదరిస్తుంది. కానీ కారణం కనిపించదు. వ్యక్తీకరణకు మూలమైన భాష అంతా కళ్ళముందే వుంటుంది, మనకు తట్టిన భావం మాత్రం ఆ భాషలో ఎక్కడినుంచి వచ్చిందో మాత్రం ఎంత తరచినా అంతుచిక్కదు. ఈ కనికట్టు రహస్యం కనుక్కోబుద్ధవుతుంది. ఇంద్రజాలికుడు తన తిరగేసిన టోపీ లోంచి పావురాల్ని వదిలేయటం ఐపోయింది, అవి తపతపా రెక్కల చప్పుడుతో ఈకలు రాల్చుకుంటూ ఆకాశంవైపు ఎగిరిపోయాయి, మనసు వివశమై చప్పట్లు కొట్టేసింది, ప్రదర్శన ముగిసింది. అంతా వెళిపోయాకా, అక్కడ బోర్లా మిగిలిన టోపీలోకి మనం ఎంత తొంగిచూస్తే మాత్రం రహస్యమేం బోధపడుతుంది? నేను ఒంటరిగా వున్నపుడు వాక్యాల్ని బైటికి చదువుకునే సందర్భాలు ఇలా ఖాళీ టోపీని తిరగమరగేసి చూసే తంతు లాంటివే. నన్ను జల్లుమనేట్టు చేసిన ఆ భావం, కనిపిస్తున్న అక్షరాల్లో ఎక్కడుందా అని పదే పదే ఆ వాక్యాల్ని పైకి గట్టిగా చదువుతాను. మొదటిసారి పొందిన ఆనందాన్ని పదే పదే పొందాలన్న చేసుకోవాలన్న ఆశ కూడా అందులో వుంటుంది. (చదివిన ప్రతిసారికీ అంతకంతకూ తరుగుతూ ఈ ఆనందాన్ని పొందుతాను కూడా.) కానీ ఎన్నిసార్లు చదివినా అవే పదాలూ అవే వాక్యాలూ 
వినపడి పాతబడిపోతాయే గానీ, కనికట్టు వెనక గుట్టు మాత్రం అంతుపట్టదు. పాఠకులుగానే మిగిలిపోతే ఎప్పటికీ అంతుపట్టదేమో! ఎపుడో మనమూ రాయడం మొదలుపెట్టినపుడే, ప్రేరణ అనే నీలపు మంచు పూల తుఫాన్లో మన బుద్ధి దారి పోగొట్టుకున్నప్పుడే, ఆ గుట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా తెలియడమనేది వుండదు, అనుభవానికొస్తుంది, అంతే. ఈ ఇంద్రజాల రహస్యం ఆ ఇంద్రజాలికులకే తెలియదు. చేసి చూపించగలరు. ఎలాగంటే చెప్పలేరు. సాహిత్యం మనకు అందించే ఆనందపు మూలాల్ని ఎన్ని కాగ్నిటివ్ సైన్సులొచ్చినా శాస్త్రీయంగా అర్థం చేసుకోలేం అనుకుంటాను. అర్థం చేసుకోగలిగినా అసలు పాయింట్ అర్థం చేసుకోవటం కాదనుకుంటాను.

ఇపుడు అసలు విషయం. ఈ మధ్య నా ఒంటరి పఠనాల్లోకి ఇంకొకర్ని ఆహ్వానించాను. కొన్నిసార్లు ఆత్మీయుల సమక్షంలో అయినా సరే అదేపనిగా గడపాలంటే ఏదో ఒక సాకు కావాలి. ఇలా పుస్తకాలు చదివి వినిపించటమనే సాకు మాకు దొరికింది. వేరేవాళ్ల దగ్గర యిలా ఏ సెల్ఫ్‌కాన్షస్‌నెస్సూ లేకుండా చదవగలగడం నాకు కొత్త. మరొకరి సమక్షంలో కూడా మన ఏకాంతాన్ని మనం ఆనందించగలిగేంతటి చనువు కొందరితో ఎన్నేళ్ల సాంగత్యంలోనూ ఏర్పడదు, మరి కొందరితో ఇట్టే ఏర్పడిపోతుంది. అది నాకు ఈ పఠనాల్లో కొత్త మజానిస్తోంది. అంతేకాదు, నేను ఆనందిస్తూ శ్రోతనీ ఆనందింపజేస్తూ చదవాలి గనుక, రచనల్ని మరింత లోతుగా చదవగలుగుతున్నాను.

మనుషుల మధ్య లౌక్యం పునాదిగా ఏర్పడే సుహృద్భావ వాతావరణం నా మనసుకి వాంతి తెప్పిస్తుంది. అందులో నేనెపుడూ భాగం కాలేను. అలాంటి సందర్భాల్లో spoilsport పదవి వద్దన్నా నన్ను వరిస్తుంది. ఈ పదవి నిర్వహించడం నాకెంతగా అలవాటైపోయిందంటే, ఎపుడన్నా స్వచ్ఛమైన సుహృద్భావ వీచికలు నా వైపు వీచినా, నేను ముక్కు మూసుకుని అనుమానంగా చూస్తుంటాను. మనిషి అలాంటి కరడుగట్టిన గుల్లలోకి ముడుచుకుపోయి వుండటం ఎక్కువ కాలం కొనసాగితే, ఇక తనంతట తాను బయటకి రావడం చాలా కష్టం. గుల్ల బద్దలుకొట్టి మనల్ని బయటకి లాగటానికి ఎక్కువమంది అవసరమూ లేదు. సత్యం పునాదిగా ఒక్క స్నేహమే అయినా చాలు. 
షోపనార్ గురించి నీషే అంటాడు: "He was an out and out solitary; there was not one really congenial friend to comfort him -- and between one and none there gapes, as always between something and nothing, an infinity." గుల్ల నుంచి బయటకు లాగబడ్డాకా కూడా మనం స్నేహంగా మసలుకోగలిగేది ఆ ఒక్క వ్యక్తితోనే కావచ్చు. కానీ నీషే అన్నట్టు ఒక్క స్నేహితుడుండటానికీ, ఎవరూ లేకపోవడానికీ మధ్య అనంతమైన అంతరం నోరుతెరిచి ఆవలిస్తుంది. ప్రపంచమంతా పరుషత్వంతో పోట్లు పొడిచినా, ఒక్క స్నేహపు ఊరట దగ్గరుంటే పెద్ద బాధ వుండదు. ఈ చిన్ని స్నేహ వృత్తంలో ఒక ప్రపంచాన్నే పుట్టించుకోవచ్చు. అక్కడ నువ్వు నీలా మసలు కోవచ్చు. ఇంతకీ నేనీ పేరా ఎందుకు రాస్తున్నాను? ఏమీ లేదు. నేను నాలా వున్నపుడు చాలా ధీమాగా వుండగలను. చాలా ధీమాగా పుస్తకాల్ని పైకి చదవగలను. వాటిల్లో కథనాన్నే కాదు, మధ్యలో వున్న సంభాషణల్ని కూడా ఆయా పాత్రల గొంతులు అనుకరిస్తూ చదివేయగలను. అలాగని నాకిపుడే తెలిసింది. వచనాన్ని ఏకాంతంలో ఎవరికి వారే చదుకోవాలి తప్ప పైకి చదవకూడదంటాడు హెన్రీ గ్రీన్:

Prose is not be read aloud but to oneself alone at night, and it is not quick as poetry but rather a gathering web of insinuations… Prose should be a long intimacy between strangers with no direct appeal to what both may have known. It should slowly appeal to feelings unexpressed, it should in the end draw tears out of the stone…

కానీ మరొకరి సమక్షంలో కూడా మనతో మనం మసలుకోగలిగే ఏకాంతాన్ని అందుకోగలిగినపుడు, వచనాన్ని బయటకి చదివినా ప్రభావం పోదంటాను. ప్రస్తుతం తనకు నేను "వేయి పడగలు", తను నాకు "మ్యూజింగ్స్" చదివి వినిపించుకుంటున్నాం. "వేయిపడగలు" ఇద్దరం చదవలేదు. నేను ఇదివరకోసారి మొదలుపెట్టాను గానీ, బయటేవో ఒత్తిళ్ల వల్ల మధ్యలో పక్కనపెట్టేసాను. "మ్యూజింగ్స్" ఇదివరకూ చదివాను, మళ్ళీ చదవాలని చాన్నాళ్ళనుంచీ అనుకుంటున్నాను. రెండూ పెద్ద పుస్తకాలే కాబట్టి ఇవి చాన్నాళ్ళు కొనసాగే పఠనాలు. అందుకని మొనాటనీ రాకుండా మధ్య మధ్యలో కథలూ కవితలూ కూడా ఇరికిస్తున్నాం. ఈ పఠనాల్లో నేను రచనల వైనాల్ని మరింత తీక్ష్ణంగా గమనించగలుగుతున్నాను. ఏ రచయితకారచయితకుండే ప్రత్యేకమైన సాధనాల్ని గుర్తించగలుగుతున్నాను. వచనపు లయని మరింత ఆస్వాదించగలుగుతున్నాను.

విశ్వనాథ ఉపమానాలు ఒక క్రమ పద్ధతిని అనుసరించి సాగుతాయి. ఆయన తెచ్చే పోలికలన్నీ కథలో ఆయా సన్నివేశాలతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగివుంటాయి. ఉదాహరణకు శివాలయంలో జరిగే ఒక సన్నివేశంలో, శుక్లాష్టమి వెన్నెలకు తెచ్చిన ఉపమానాలన్నీ శివుని సంబంధించినవే:
శుక్లాష్టమి వెన్నెల శివజటాటవీ నటన్మందాకినీ నవస్మేర వీచీ రామణీయకము వోలె, అంబికా ప్రసన్నాపాంగరేఖా ప్రసారము వోలె, విఘ్ననాయకుని ఏకదంత సితచ్ఛటా స్వచ్ఛతంబోలె శైవమహాత్మ్యమై విరిసెను.

దేవదాసి అనే పాత్రని వర్ణించేటపుడు, ఉపమానాలన్నీ విష్టువుకు సంబంధించినవే వుంటాయి:
దాని తెల్లని పలువరుస సుదర్శనాయుధపు టంచులవలె పదునుపెట్టి నట్లుండెను. దాని చెవులు శ్రీకారములై పాంచజన్యము లట్లుండెను. దాని కన్నులు కమలములు. దాని నాసిక కౌమోదకి. దాని భ్రూయుగము శార్ఙము ద్విథా విభక్తమైనట్లుండెను. దాని మూర్తి వికుంఠమై మనోజ్ఞమయ్యెను. [కౌమోదకి = విష్ణువు గద; శార్ఙము = విష్ణువు విల్లు]

చలం "మ్యూజింగ్స్"లో ఇదివరకూ ప్రపంచం మీద కోపాన్నే ఎక్కువ చూసాను. ఇపుడు నిష్పలమైన బక్క కోపం చివరకు ఎకసెక్కపు హాస్యంలోకి పరిణితి చెందిన వైనాన్నీ గమనించి ఆస్వాదించగలుగుతున్నాను.
చాలామంది సముద్రం వొడ్డుకి ఎందుకు వొస్తారంటే, మార్పు కోసం. ఆఫీసు నించీ, వంటిళ్ల నించీ, నలుగురూ వస్తే యెవరన్నా తెలిసినవారిని కలుసుకోవచ్చుననీ, చల్లగాలిలో విశ్రాంతిగా కబుర్లు చెప్పుకోవచ్చుననీ బైబిల్ని యింగ్లీషు కోసం చదివే వాళ్ల లాగు.
-- -- --
సౌందర్యం శృంగారం ఏమి వ్రాసినా, బూతూ, వ్యభిచారంగా పరిణమిస్తున్నాయి యీ క్షుద్ర విమర్శకులకి. ... పవిత్రంగా ఆధ్యాత్మికంగా, పరిణయంగా, అగ్నిసాక్షిగా, స్త్రీతో ఏం సంబంధం పెట్టుకుంటావు? విమర్శకుడా! చేతులూ, పెదిమలూ, తొడలూ పనిచెయ్యకుండా, ఎట్లా మోహిస్తావు, ప్రేమిస్తావు స్త్రీని. అదేదో ఆ రహస్యం కొంచెం చెబుదూ? నీరసంగా, ఏడుస్తో, తిడుతూ కళ్లు మూసుకుని, పాపకార్యం సాగిస్తున్నావా, మహామునీ! అనుభవించి పోతున్నారనా, ఆగ్రహం!

"
మ్యూజింగ్స్"లోని కవిత్వాన్ని కూడా ఇపుడు మరింత దగ్గరకి తీసుకోగలుగుతున్నాను:
ఈ పక్షి పాట యెట్లా వూపుతోందో ఈ పరిసరాల్ని! ఈ కుర్చీలు కూడా ఆ పాటకి ప్రకంపిస్తున్నాయి. ఏనాడో, ఏ బర్మా అరణ్యాల్లోనో, టేకు మానులై వున్న రోజుల్లో తమ శాఖల మీద కూచుని పాటలతో రంజింపజేసిన పక్షుల రుతాలు జ్ఞాపకం రావడం లేదు కదా యీ కుర్చీలకి?
-- -- --

ఆ గడ్డి మధ్య ఒక్కటే యెర్రని పువ్వు గాలిలో ఊగుతూ అలసిన నా దృష్టిని ఆపి పలకరించింది. అప్పుడే క్రొత్తగా భూమిని బద్దలు చేసుకుని, ముఖాన్నెత్తి, ఎండనీ, చెట్లనీ, చూసి పకపక నవ్వుతో తను కూడా బతుకులోకి దూకాననే సంతోషంతో గంతులు వేసి ఆడుతోంది. ఈ బిడ్డను చూసి చుట్టూ వున్న ముసలమ్మ చెట్లు బోసి చిగుళ్లు బైట పెట్టి ఆనందిస్తున్నాయి.
ఇలాంటివన్నీ నేను ఒక్కడ్నే కూర్చుని చదువుకున్నా గమనించేవాణ్ణేమో. కానీ మరో దగ్గరి మనిషితో కలిసి చదువుతున్నపుడు వట్టి గమనింపుతో ఆగిపోం, గమనించినవాటిని వారితో కలిసి సెలబ్రేట్ చేసుకోబుద్ధవుతుంది. అది పఠనానందం పక్కన శతసహస్రగుణకాన్ని తెచ్చి పెడుతుంది. 
. . .