December 24, 2018

Personality of Naoya Shiga


Excerpts from the chapter about Naoya Shiga in ‘Modern Japanese Writers - And The Nature of Literature’ by Makoto Ueda (for reference):



(1) ART VERSUS NATURE

> A literary work, Shiga thought, should be autobiographical in the strict sense of the word; that is, it should be a conscious effort at self-revelation.

>...In the case of another prose piece, he had first entitled it "Kusatsu Spa, an Essay" and sent it off to a publisher. But when it came back for proofreading he changed it into a short story by simply erasing "an Essay" from the title. It is difficult to think of any other major writer in modern Japan who could have done such a thing.

> Why did he think fiction was the best mode in which to record the facts of his own daily existence? His answer can be found in his notes on ‘Voyage Through the Dark Night’. "Kensaku, the hero, is by and large myself," he wrote. "I would say his actions approximate the things I would do, or would wish to do, or actually did, under the given circumstances." The prime function of a diary, like most other genres of personal nonfiction, was to record only what one actually did. A work of fiction, on the other hand, could present what one "would do, or would wish to do" in various imaginary situations.

> Once, on devising a scene for a short story, Shiga placed the moon in a geographically impossible position, but knowingly let the description stand because that was the way he had long visualized the scene in his mind.

> What kinds of facts, whether actual or imaginary, are most suitable for a work of fiction? Ordinary facts would not do; they would merely provide material for a chat, or for a popular novel at best. "A story that can be told in a chat," Shiga once said, "should be told in a chat. Only a story with something in it that could not be told in a chat could be made into a work of literature. " Shiga did not elaborate on what that "something" was. But other writings of his show clearly enough what he meant. For instance, there is the revealing anecdote about the way he welcomed a close friend who had just returned from a year-long trip to Europe and North America. His wife showered the friend with "Welcome home!" and other such greetings. But Shiga did not utter a word of welcome; he did not even make the customary bow. It had always been this way between him and that friend of his, Shiga explained; he did not know why it should be so, but he felt "it was most natural.".... A serious writer of fiction presented men and women who behaved themselves more "naturally" than the average person...

> Man has impulses; Shiga would not deny that. Yet man has wisdom also, instinctive wisdom given him by nature for his own health and survival. Shiga advised that every man be attentive to it, understand it, and follow it; this was the way to return to nature.

> Shiga's adverse criticism of certain literary works can also be explained in terms of this highly individual view of human nature. He did not like Othello, Hamlet, or Romeo and Juliet because they were, in his opinion, tragedies caused by human folly. He felt that, in each case, the tragedy could have been averted if the protagonists had been "wiser" in the sense already discussed.

> Ultimately, Shiga's theory of literature is limited in the same way as his view of human nature. Even if it be granted that man has some basic animal wisdom such as Shiga recognized, it may be argued that he was being too optimistic.



(2) THE LITERARY WORK AND THE AUTHOR

> If a novel's primary purpose is to depict the life of a man who, having met with a catastrophic misfortune, recovers from it by his innate "wisdom," it seems that the novelist would do well to become such a man himself.

> ...there was a clear distinction between a poet and a novelist in this respect. "A poet is emotional and tends to destroy his personal life," he observed, "like Baudelaire, Verlaine, Rimbaud, etc. But this would never do in the case of a novelist. . . . Poets and novelists are both men of letters, but there is a good deal of temperamental difference between them." Hence Shiga disliked a novelist who was like a poet—that is, a novelist who did not rebound from a misfortune. For instance, he did not like Tanaka Hidemitsu (1912-49), because the latter showed "no spirit of prose literature" and was completely overcome by his own misfortunes. He also did not like Tanaka's idol, Dazai Osamu, because he thought Dazai was a weak man who adopted a conceited pose to hide his weakness. "However hard I tried, I just could not bring myself to sympathize -with Dazai's love suicide," he wrote.

> If this seems to present an image of an ideal man rather than an ideal novelist, that is consistent with Shiga's idea of a novelist. For Shiga, the ultimate goal in life was to become a man of moral strength. This was a logical conclusion for a writer who considered literature as at best an inferior substitute for life. Problems in life had to be solved in the realm of life; the solutions offered by art were, in the final analysis, no more than substitutes for real solutions, dreams that might or might not be fulfilled.

> Inevitably, given his view of literature, he lost the urge to write; he had no frustrations to vent, no disasters to rebound from. He wrote less and less frequently, his yearly production dwindling to fewer than five short prose pieces—normally two, one, or none—after 1928. Very likely he could not have cared less. "I have felt," he once said, "the important thing for me to do is to spend this unrepeatable life of mine in the best way possible. The fact that I have written works of fiction is of only secondary importance."


(3) THE LITERARY WORK AND THE READER

> An impression of natural beauty comes from observing a man who conducts himself honestly, in accordance with his inmost feelings. ...A man fighting for his survival was beautiful, because he was, if nothing else, pure in his motives. A fight for material gain or for lust was ugly, but a fight for bare existence, physical or mental, had its own dignity.

> Shiga may have had a special feeling for natural beauty, but nature in the conventional sense—flowers, trees, mountains, rivers, etc.—seems to have meant little to him. The vegetable and mineral worlds hardly feature in his occasional writings. There indeed is one short piece called "The Morning Glory," but in its second sentence the author makes clear that he valued this plant not for its flowers but for its medicinal leaves.

> He thought a dynamic, passionate person lived a strongly rhythmical life, and when such a person became the protagonist of a story the rhythm transmitted itself to the readers, stirring them up and moving them. Even when the story did not feature such a person, it could still create a strong rhythm of life if the storyteller had that rhythm and injected it into his narrative.

> Conversely, Shiga decried works of art that showed a weak rhythm of life. "Trying to create a novel out of rotten material," he said, "is like trying to cook a good meal out of rotten fish." If the novelist's life is rotten, his novels become rotten, too. Shiga's adverse criticism of Dazai seems to have been directed more at his life than at his works. Shiga was also critical of Japanese proletarian writers because they drew inspiration more from their ideology than from their experience; he thought even Lenin would have advised that they emulate Saikaku. He disliked Mori Ogai's works because he felt they were too cerebral, and failed to show any evidence of innate vitality on the author's part.

> Shiga also felt that any attempt to accommodate the reader inevitably weakens an author's rhythm of life, at least insofar as it is embodied in his work. Shiga was firmly against "literature for the millions." He did not like his stories to be made into films or translated into foreign languages. He preferred to be read by a select few, with their number to increase gradually as the centuries passed.


(4) STRUCTURE AND STYLE

> Shiga said little about plot. This is understandable, in view of his emphasis on spontaneity in creative writing. Constructing a plot is basically an intellectual undertaking, far removed from the sphere of impulse. It is also an area in which the novelist's desire to accommodate his readers is often only too obvious. An intriguing plot, Shiga thought, might be necessary for a popular novel, but it did nothing but harm to a genuine work of literature, whose prime purpose was to convey the author's vigorous rhythm of life.

> Shiga's view, then, was that a novelist did not have to pay much attention to plot, since if he had a vigorous rhythm of life the story would develop one of itself. Plot, in other words, marched to the rhythm of the author's own life.

> ...Shiga is thinking of two types of grammar, artificial and natural. Artificial grammar is school grammar, a set of rules devised by scholars. This is the kind of grammar that Shiga says he knows very little about; evidently, he could not have cared less. But he did care a great deal about natural grammar. He thought of language as a gift given to man by nature, and of speaking and writing as something natural and spontaneous. An ideal writer, he believed, would just let words flow out of his brain naturally, and let them form sentences of their own accord.

> One might wonder why Shiga, while aiming to reproduce the natural rhythm of life, arrived at this laconic style, the exact opposite of the "flowing style" that attracted Tanizaki Junichiro for precisely the same reason. The answer lies in their different concepts of the human psyche. For Tanizaki Junichiro, the ultimate source of psychic energy was the sexual instinct, the will to reproduce one's own kind. Since woman, with her ability to give birth, was closer to this source than man, her rhythm of life was correspondingly more vigorous. Shiga, on the other hand, found the source of life not in woman's reproductive power but in man's will to survive. Hence he favored the male, who had more physical strength, as more typical of a human being who was faithful to his inner impulses.


(5) THE PURPOSE OF LITERATURE

> A literary work, he thought, should improve its readers' self-knowledge and self-confidence, and bring them a sense of elation as it does so. Characteristic of Shiga was the fact that, with all this emphasis on what the novel could do for its readers, he still urged the novelist to write for himself, not for them. In Shiga's view, the novelist wrote for primarily personal motives, namely, to vent his own emotions and so recover his own mental equilibrium. If his readers also found themselves purged of their frustrations, that was only incidental; the novelist did not consciously intend the novel to have this effect.

> There is, however, a serious flaw in this line of thinking—a flaw that constitutes the main limitation of Shiga's views on art. To be sure, the artist or scientist may gain results while following his own bent. But it does not necessarily follow that these results will prove beneficial to all men alike. A delightful intellectual adventure may end in the horror of atomic weapons. The gloomy tale that the novelist feels better for having written may drive some of his readers to desperation or suicide. Shiga would have denied that his works could have any such effect; his heroes, he would have said, always end up victorious. But he never really admitted the moral ambivalence of literature in general. There is no Satan or lago in his works of fiction; indeed, he would not even read about murders and rapes in the newspapers. Yet these should be part of literature, too, as they are part of life.

> For Shiga, literature could be immensely useful insofar as it could fill a particular need in one's life. It was useless for a person who did not have that kind of need, especially one who needed more than literature could give. Shiga, with his pragmatic view of art, could not ignore its limitations. He coolly abandoned it in later life, when he no longer had any need for it.

October 15, 2018

'ల్యోంపా' - యూరీ ఓలేషా

అలెగ్జాండర్ అన్న పిల్లాడు వంటగదిలో కలప చెక్కుతున్నాడు. అతని వేళ్ళ మీద దెబ్బలు ఊరించే బంగారు రంగులో పొరలుకట్టి ఉన్నాయి. వంటింటి గుమ్మం పెరట్లోకి తెరుచుకొని వుంది [1]; ఇది ఎండాకాలం, తలుపులు ఎప్పుడో తప్ప మూయరు. గుమ్మం దగ్గర గడ్డి మొలిచింది. నాపరాళ్లు నీళ్లు ఒలికి మెరుస్తున్నాయి. ఒక ఎలుక చెత్తకుండీలో తిరుగుతోంది. వంటింట్లో సన్నగా తరిగిన బంగాళదుంపలు వేగుతున్నాయి. కిరోసిన్ పొయ్యి వెలిగించగానే నారింజ రంగు మంట గొప్పగా విరబూసి పైకప్పు దాకా లేచింది. తర్వాత అణకువైన చిన్న నీలం మంటగా సర్దుకుంది. ఉడుకుతున్న నీళ్ళలో గుడ్లు గెంతుతున్నాయి. ఇంకొకతను పీతలు వండుకుంటున్నాడు. కదుల్తున్న పీతని రెండు వేళ్ళతో నడుం దగ్గర పట్టుకుంటున్నాడు. ఆ పీతలు పచ్చగా తూముపైపుల రంగులో ఉన్నాయి. ఉన్నట్టుండి కుళాయి లోంచి రెండు మూడు చుక్కలు తన్నుకొచ్చాయి. కుళాయి పద్ధతిగా ముక్కు చీదుకుంది. తర్వాత పైఅంతస్తులో నీటి గొట్టాలు రకరకాల గొంతులతో మాట్లాడుకున్నాయి. త్వరగా సాయంత్రమయ్యింది. కిటికీలో ఉన్న స్టీలుగ్లాసు మాత్రం గేటులోంచి పడుతున్న ఆఖరు సూర్య కిరణాలకి మెరుస్తోంది. కుళాయి ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉంది. పొయ్యి చుట్టూ రకరకాల చప్పుళ్ళు.

సాయంకాంతి రమ్యంగా ఉంది. ఎవరో పొద్దుతిరుగుడు విత్తనాలు తింటున్నారు, పాటలు పాడుతున్నారు. గదుల్లోంచి వీధిలోకి పడుతున్న పసుపురంగు కాంతిలో ఒక తోపుడు బండి వెలుగుతోంది.

వంటింటిని ఆనుకొన్న గదిలో బాగా జబ్బు చేసి పడుకుని ఉన్నాడు పొనోమరేవ్. ఆ గదిలో అతనొక్కడే ఉన్నాడు, కొవ్వొత్తి వెలుగుతోంది, తల దగ్గర మందుల సీసా ఉంది, దానికి మందుల చీటీ వేలాడుతోంది.

పలకరించటానికి వచ్చిన స్నేహితులతో పొనోమరేవ్: “కంగ్రాట్స్ చెప్పండి, చనిపోతున్నాను,” అనేవాడు.

ఆ సాయంత్రానికి అతనిలో భ్రాంతి మొదలైంది. మందులసీసా అతని వంకే చూస్తోంది. దానికి వేలాడుతున్న మందుల చీటీ పొడవాటి చీరకొంగులా ఉంది. మందులసీసా పెళ్ళికి ముస్తాబయిన యువరాణి. సీసా మీద పేరు పొడుగ్గా ఉంది. రోగి కలవరిస్తున్నాడు. ఏదో ఉద్గ్రంథం రాయాలని కాబోలు. దుప్పటితో మాట్లాడుతున్నాడు.

“సిగ్గులేదు నీకూ?’’ గొణిగాడు.

దుప్పటి అతని పక్కనే కూర్చుంటుంది, పడుకుంటుంది, అప్పుడప్పుడూ బైటికి వెళ్తుంది, కబుర్లు మోసుకొస్తుంది.

అతని చుట్టూ అతనికంటూ మిగిలినవి కొన్ని వస్తువులే: మందుసీసా, స్పూను, లైటు, వాల్‌పేపరు. మిగతావన్నీ అతడ్ని వదిలి వెళిపోయాయి. తన జబ్బు ప్రాణాంతకమైనదని అతనికి ఎప్పుడైతే అర్థమైందో, అప్పుడే ఈ వస్తు ప్రపంచం ఎంత పెద్దదో, అందులో తనకు వాటాగా మిగిలింది ఎంత చిన్న భాగమో అర్థమైంది. రోజురోజుకూ వస్తువులు అతన్నించి జారుకుంటున్నాయి. రైలు టిక్కెట్టు లాంటి మామూలు వస్తువు కూడా ఇప్పుడు దొరకనిదైపోయింది. మొదట్లో, అతనికి దూరంగా అంచుల్లో ఉన్న వస్తువులు తరిగిపోయాయి. క్రమంగా ఈ తరుగుదల వేగం పుంజుకొని, అతనికి వైపు, అతని మనసులోకి రావటం మొదలైంది–– పెరట్లోంచి ఇంట్లోకి, ఇంట్లోంచి వరండాలోకి, వరండాలోంచి అతని గదిలోకి.

రోగికి మొదట్లో ఈ అదృశ్యమవుతున్న విషయాలు పెద్ద బాధేమీ కలిగించలేదు.
అమెరికాలాంటి వెళ్ళాలని ఆశపడ్డ దేశాలు మాయమయ్యాయి, అందగాడో డబ్బున్నవాడో అయ్యే అవకాశం మాయమైంది, కుటుంబ సౌఖ్యం మాయమైంది (అతను ఒంటరివాడు)… అయితే ఇవి మాయమవటానికీ అతని జబ్బుకీ ఏ సంబంధమూ లేదు. వయసు మీద పడేకొద్దీ వాటంతటవి దూరమైపోయాయి. అలాగాక, అతని వెంట అడుగులో అడుగేస్తూ వచ్చినవి కూడా దూరమవుతున్నాయని తెలిసాకా- అప్పుడు మొదలైంది అసలు బాధ. ఒకేఒక్కరోజులో వీధి, ఉద్యోగం, ఉత్తరాలు, గుర్రాలు అతడ్ని వదిలేసి వెళ్ళిపోయాయి. తర్వాత ఈ అదృశ్యమవటం కళ్ళుతిరిగే వేగాన్నందుకుంది, దరిదాపుల్లో ఉన్నవి కూడా అదృశ్యమైపోతున్నాయి: ఇప్పటికే వరండా కనిపించకుండా పోయి చాన్నాళ్లయింది; చివరికి సొంత గదిలో, అతని కళ్ళ ముందే, అతని కోటూ, గది గొళ్ళెమూ, చెప్పులూ పనికిరానివైపోయాయి. చావు తనవైపు నడిచి వస్తూ దారిలో ఎదురైన అన్నింటినీ నాశనం చేస్తోందని అతనికి తెలుస్తోంది. ఈ అనంత వస్తు ప్రపంచంలో చావు అతని కోసం మిగిల్చింది కొన్నింటినే. అవి కూడా ఎలాంటివంటే, అతనిలో ఏమాత్రం శక్తి మిగిలివున్నా వాటిని చేరనిచ్చేవాడు కాదు. ఉచ్చపోసుకునే గిన్నె వచ్చింది కొత్తగా. చిరాకుపుట్టించే పరిచయస్తుల చూపులు, పరామర్శలు మొదలయ్యాయి. తను అడగనివీ ఆశించనివీ తనపై చేస్తున్న ఈ దాడిని ఇక నిలువరించలేడని అర్థమైంది. ఇప్పుడు వాటి నుంచి తప్పించుకునే వీల్లేదు. అతనికి ఎంచుకునే స్వేచ్ఛపోయింది.

బయట అలెగ్జాండర్‌ అన్న పిల్లాడు బొమ్మ విమానం తయారు చేస్తున్నాడు.
ఆ పిల్లాడు చుట్టూవున్న వాళ్ళ ఊహకందనంత గంభీరమైనవాడు, లోతైనవాడు. బొమ్మ తయారీలో వాడి వేళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి, రక్తం కారుతోంది, చెక్క పొట్టు నేలంతా పడుతోంది, జిగురు మరకలు అంటుతున్నాయి, అందర్నీ సిల్కు పీలికల కోసం బతిమాలుతున్నాడు, ఏడుస్తున్నాడు, దెబ్బలు తింటున్నాడు. పెద్దవాళ్ళు మాకు మేమే కరెక్టనుకుంటారు. ఆ పిల్లాడు మాత్రం పెద్దవాళ్ళ కన్నా హుందాగా ఉంటాడు. పెద్దవాళ్ళలో ఏకొద్దిమందో తప్ప అంత పద్ధతిగా ఆలోచించరు. ఆ బొమ్మ విమానాన్ని ఒక బ్లూప్రింట్‌ ప్రకారం తయారు చేస్తున్నాడు, లెక్కలు కడుతున్నాడు––అతనికి భౌతికశాస్త్ర నియమాలు తెలుసు. పెద్దవాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళకి భౌతికశాస్త్ర నియమాల గురించి చెప్పొచ్చు, ప్రయోగాత్మకంగా నిరూపించవచ్చు, కానీ ఏమీ మాట్లాడేవాడు కాదు, పెద్దవాళ్ళ కన్నా ఎక్కువ తెలిసినట్టు ఉండటం ఎందుకో తప్పనిపించేది.
ఆ పిల్లాడి చుట్టూ రబ్బరు బాండ్లు, వైరు ముక్కలు, చెక్కపేళ్ళు, సిల్కు పీలికలు, జిగురు వాసన ఆవరించి ఉన్నాయి. ఆకాశం మెరుస్తోంది. నాపరాళ్ళ మీద పురుగులు మెల్లగా పాకుతున్నాయి. ఒక నాపరాయిలో చిన్న నత్తగుల్ల శాశ్వతంగా ఇరుక్కుపోయి వుంది.

ఈ పిల్లాడు పనిలో ఉండగా ఇంకో పిల్లాడు దగ్గరకి వచ్చాడు. వాడిది మరీ చంటి వయస్సు, వొంటి మీద నీలం చెడ్డీ తప్పితే గుడ్డపీలిక లేదు. అన్నీ ముట్టుకుంటున్నాడు, పనికి అడ్డం వస్తున్నాడు. వాడు దగ్గరకు వచ్చినప్పుడల్లా అలెగ్జాండర్‌ లేచి తరిమేస్తున్నాడు. రబ్బరు బొమ్మలా ఉన్న ఈ చంటిపిల్లాడు వొంటి మీద గుడ్డల్లేకుండానే ఇల్లంతా కలదిరుగుతున్నాడు. ఒక సైకిల్‌ ఉన్న వరండాలోకి వచ్చాడు. (సైకిలు ఒక పెడల్‌తో గోడకి ఆనుకొని వుంది, ఆ పెడల్‌ వల్ల వాల్‌పేపర్‌ చిరుగుతోంది, సైకిల్‌ ఆ చిరుగుని పట్టుకొని వేలాడుతున్నట్టు ఉంది).

ఈ చంటిపిల్లాడు పొనోమరేవ్‌ గదిలోకి వచ్చాడు. వాడి బుర్ర మంచం అంచుల చుట్టూ బంతిలా గెంతుతోంది. జబ్బు మనిషి కణతలు పాలిపోయి ఉన్నాయి, గుడ్డివాడి కణతల్లాగ. పిల్లాడు దగ్గరగా వచ్చి పొనోమరేవ్‌ ముఖాన్ని పరీక్షగా చూశాడు. ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అనుకున్నాడు: ఎప్పుడూ ఒక గదిలో మంచం మీద ఇలా ఒక గడ్డం మనిషి పడుకునే ఉంటాడనుకున్నాడు. ఆ పిల్లాడు ఇప్పుడిప్పుడే వస్తువుల్ని గుర్తుపడుతున్నాడు; వస్తువుల ఉనికిలో కాలమనే అంశ కూడా ఉంటుందని వాడికి తెలీదు.

మంచం దగ్గరనుంచి కదిలాడు. గదిలో తిరగటం మొదలుపెట్టాడు. చెక్కపలకల నేలనీ, పలకల మధ్య దుమ్మునీ, గోడ మీద పగుళ్ళనీ చూసాడు. పిల్లాడి కళ్ళ ముందు కొన్ని గీతలు కలుస్తున్నాయి, విడిపోతున్నాయి. వస్తువులు ఏర్పడుతున్నాయి. ఉన్నట్టుండి ఏదో మెరిసింది, పిల్లాడు చప్పున అటు తిరిగాడు, కానీ అలా తిరగటం వల్ల దూరం మారి మెరిసిన కాంతి కనపడలేదు. పిల్లాడు ఆ కాంతి కోసం పైకీ కిందకీ చూశాడు, ఫైర్‌ప్లేస్‌ వెనకాల వెతికాడు. చివరకు అయోమయంగా భుజాలెగరేసి వెతకటం మానేశాడు. వాడి కోసం ప్రతిక్షణం ఒక కొత్త వస్తువు పుట్టుకొస్తోంది. సాలీడు ఒక అద్భుతంలా అనిపించింది. కానీ చేత్తో తాకాలన్న ఆలోచనకే అది పారిపోయింది.
జబ్బు మనిషి నుంచి పారిపోతున్న వస్తువులు అతనికి తమ పేర్లను మాత్రమే విడిచిపెడుతున్నాయి.

బయటి ప్రపంచంలో ఒక ఆపిల్‌ పండు ఉంది. అది పచ్చటి గుబుర్ల మధ్య నిగనిగలాడుతోంది, గుండ్రంగా తిరుగుతోంది, తనతోపాటు కొన్ని పగటి దృశ్యాల్ని లాక్కొని తిప్పుతోంది, తోట పచ్చదనాన్నీ, ఒక కిటికీ చట్రాన్నీ. ఆ ఆపిల్‌ పండు కోసమే ఎదురుచూస్తోంది- చెట్టు కింద, నల్లటి నేల మీద, ఎగుడు దిగుడు గుంతల్లోంచి భూమ్యాకర్షణశక్తి. గుంతల్లో పూసల బారుల్లా చీమలు కదులుతున్నాయి. తోటలో న్యూటన్‌ కూర్చొని ఉన్నాడు. ఆ ఆపిల్‌ ముందు ఎన్నో భవిష్యత్తులు చీలి ఉన్నాయి. కానీ అవేవీ పొనోమరేవ్‌ దాకా రావు. అతనికి ఆపిల్‌ అంటే ఒక భావంగా మాత్రమే మిగిలింది. ఒక వస్తువులో పదార్థమంతా పోయి భావం మాత్రమే మిగలటం అతన్ని బాధిస్తోంది.
అతను ఆలోచిస్తున్నాడు: “బయటి ప్రపంచం అంటూ ఏదీ లేదనుకున్నాను. నా కళ్ళు, చెవులే వస్తు ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయనుకున్నాను. నేననేవాడ్ని ఉండటం మానేశాకా ప్రపంచం కూడా ఉండటం మానేస్తుందనుకున్నాను. కానీ… ఇప్పుడు బతికున్న నన్ను విడిచిపెట్టి అన్నీ వెళ్ళిపోతున్నాయి. నేనింకా ఉన్నాను కదా! మరి వస్తువులెందుకు ఉండటం లేదు? వాటన్నింటికీ రూపమూ, బరువూ, రంగూ ఇచ్చేది నా మెదడే అనుకున్నాను. ఇప్పుడు అవి నన్ను వదిలి వెళ్ళిపోయాయి. కేవలం వాటి పేర్లే––సారంలేని, వ్యర్థమైన పేర్లు మాత్రమే––నా మెదడులో తిరుగుతున్నాయి. ఏం చేసుకోను ఆ పేర్లని?’’

పొనొమరేవ్‌ చంటిపిల్లాడి వైపు బెంగగా చూసాడు. వాడు అటూయిటూ నడుస్తున్నాడు. వస్తువులన్నీ వాడి వైపు ఆత్రంగా కదులుతున్నాయి. వాటి పేర్లేమీ తెలియకుండానే వాటి వంక చూసి నవ్వుతున్నాడు. వాడు బయటకు వెళితే, వెనక వస్తువులన్నీ కేరింతలు కొడుతూ ఊరేగింపుగా బయల్దేరాయి.

ఆ జబ్బు మనిషి పిల్లాడు వెళ్ళిన వైపు గట్టిగా అన్నాడు: ‘‘రేయ్‌… పిల్లాడా నీకు తెలుసా, నేను చనిపోయాకా ఏదీ మిగలదు. ఆ పెరడూ, చెట్టూ, మీ డాడీ, మమ్మీ… అంతా నాతో తీసుకుపోతాను.’’
వంటగదిలోకి ఒక ఎలుక వెళ్ళింది.

పొనోమరేవ్‌ వింటున్నాడు: ఎలుక ఇల్లంతా తనదే అన్నట్టు హడావిడి చేస్తోంది, కంచాల్ని కదుపుతోంది, కుళాయి తిప్పుతోంది, బకెట్టులో గీరుతున్న చప్పుడు చేస్తోంది.

“అబ్బో అంట్లు తోముతోందే,’’ అనుకున్నాడు పొనోమరేవ్‌.

వెంటనే ఒక ఘోరమైన ఆలోచన వచ్చింది: ఒకవేళ ఎవ్వరికీ తెలియకుండా ఆ ఎలుకకి ఒక పేరు ఉండుంటే? ఆ పేరు ఏమై ఉండచ్చా అని ఆలోచించాడు. అతనిలో భ్రాంతి పెరిగిపోయింది. ఆలోచించిన కొద్దీ భయంతో వణికిపోతున్నాడు. ఆ పేరు గురించి ఆలోచించటం మానేయాలని అనుకుంటున్నాడు, కానీ మానలేకపోతున్నాడు. ఆ అర్థంపర్థంలేని, భయానకమైన పేరు ఒక్కసారి స్ఫురించగానే ఇక తను చనిపోతాడని అతనికి అనిపించింది.

“ల్యోంపా!’’ హఠాత్తుగా భీకరమైన గొంతుతో అరిచాడు.

ఇల్లంతా నిద్రలో ఉంది. తెల్లారగట్ల ఆరుదాటి ఐదు నిమిషాలవుతోంది. అలెగ్జాండర్‌ అన్న పిల్లాడు మాత్రం నిద్రపోలేదు. పెరట్లోకి వంటింటి తలుపు తెరుచుకొని ఉంది. సూర్యుడు ఇంకా ఎక్కడో కిందే ఉన్నాడు.

చావుకి దగ్గరపడ్డ జబ్బు మనిషి వంటగదంతా తిరుగుతున్నాడు. అతని నడుం వంగి వుంది, చేతులు మణికట్టు నుంచి ప్రాణంలేనట్టు వేలాడుతున్నాయి. వెంట తీసుకుపోవటానికి అతను వస్తువుల్ని ఏరుకుంటున్నాడు.

అలెగ్జాండర్‌ పెరటికి అడ్డంగా పరిగెత్తాడు. అతని ముందు బొమ్మ విమానం రివ్వున ఎగిరింది. పొనోమరేవ్‌ ఆఖరుసారి చూసింది అదే.

దాన్ని మాత్రం ఏరుకోలేకపోయాడు. అది ఎగిరిపోయింది.

ఆ మధ్యాహ్నానికి పసుపురంగు అలంకరణలతో వున్న నీలంరంగు శవపేటిక ఒకటి వంటగదిలోకి వచ్చింది. రబ్బరు బొమ్మలా ఉన్న చంటిపిల్లాడు వరండాలో నుంచొని, వీపు వెనక చేతులు కట్టుకుని, దాని వైపు చూస్తున్నాడు. గుమ్మంలో పట్టని ఆ శవపేటికని లోపలికి తీసుకురావటానికి అటూయిటూ తిప్పి నానా ప్రయాస పడాల్సి వచ్చింది. అది అలమారాని గుద్దుకొంది, కంచం కిందపడింది, సున్నం పెచ్చులు ఊడాయి. అలెగ్జాండర్‌ పొయ్యి గట్టు మీదకు ఎక్కి, పెట్టెని కింద నుంచి పట్టుకొని సాయం చేశాడు. వరండా నీడలో శవపేటిక రంగు నల్లగా మారింది, ఆ రబ్బరు బొమ్మలాంటి పిల్లాడు నేలమీద పాదాలు తపతపలాడిస్తూ వరండాలో పరిగెత్తాడు, ‘‘తాతా! తాతా! నీకోసం శవాల పెట్టె తెచ్చారు,’’ అని అరుస్తూ. 


Note:

[1] ఈ కథలోని ఇల్లు ఒక్కో కుటుంబం ఉండే ఇల్లు కాదు. సోవియట్ రష్యాలో చాలా కుటుంబాలు కలిసి ఉండే కమ్యూనల్ అపార్ట్‌మెంట్. ఈ అపార్ట్‌‍మెంట్‌లోని కుటుంబాలన్నింటికీ వంటగది ఉమ్మడిగా ఉండేది.

యూరీ ఓలేషా పరిచయం ఇక్కడ.

(ఈ అనువాదం 'రస్తా' మేగజైన్‌లో పబ్లిష్ అయింది.) 

September 10, 2018

యూరీ ఓలేషా (1899-1960) పరిచయం: పాత కొత్త ప్రపంచాల నడిమి నీడలో...

కమ్యూనిస్టు విధానంలో నడిచే సమాజంలోంచి సహజంగానే కొత్త గుణాలతో ఒక కొత్త మనిషి ఉద్భవిస్తాడని మార్క్సిజం ఊహించింది. కానీ కమ్యూనిస్టు రష్యాలో ఈ కొత్త మనిషికి బలవంతంగా మూస పోసే ప్రయత్నం జరిగింది. భౌతికవాద విలువలు మూర్తీభవించిన, మానవ సహజమైన బలహీనతలకు లొంగని, హేతుబద్ధ యంత్రం లాంటి ఈ మనిషి కమ్యూనిజం అమలుకు అత్యంత కీలకమని సోవియట్‌ పాలకులు భావించారు. వీడికి ‘కొత్త సోవియట్‌ మనిషి’ (న్యూ సోవియట్‌ మాన్‌) అని పేరు కూడా పెట్టారు.

పాలకుల బలవంతం మీద ఆ కాలపు సోవియెట్‌ రచయితలు కూడా తమ రచనల్లో ఈ కొత్త సోవియట్‌ మనిషిని ఆదర్శంగా చిత్రించే ప్రయత్నం చేశారు. అయితే యూరీ ఓలేషాకి మాత్రం ఈ మనిషిపై చాలా అనుమానాలున్నాయి. అలాగే కొత్త ప్రపంచం మైకంలో పడి అందరిలా విప్లవానికి ముందంతా చెడ్డదేనన్న తీర్మానానికి వచ్చేయలేదు. విప్లవానంతరం రష్యన్‌ మేధో సమాజం పాత ప్రపంచ విలువల్ని వెనకే వదిలేసి కొత్త విలువల్ని కాంక్షిస్తూ ముందుకు నడిచింది. ఓలేషా కూడా అందరితోపాటు నడిచాడు. అయితే పాత ప్రపంచంలో తనకు విలువైనవన్నీ కూడా వెంట తెచ్చుకోవాలనుకున్నాడు.

యూరీ ఓలేషా (Yury Olesha) పోలండ్‌లో ఒక బతికిచెడ్డ భూస్వామి కుటుంబంలో పుట్టాడు. అతనికి మూడేళ్ళ వయస్సుండగా కుటుంబం రష్యాలోని ఒడెస్సా పట్టణానికి వచ్చి స్థిరపడింది. ఓలేషా చదువంతా అక్కడే సాగింది. విప్లవం తర్వాత కుటుంబం పోలండుకు తిరిగి వెళ్ళిపోయింది. బోల్షెవిక్‌ ఆదర్శాలతో ప్రభావితుడైన ఓలేషా మాత్రం రష్యాలోనే ఉండిపోయాడు. 23 ఏళ్ళ వయస్సులో మాస్కో నగరానికి వచ్చి ఒక రైల్వే పత్రికలో జర్నలిస్ట్‌గా చేరాడు. ఆ పత్రికలో 'చిసెల్' (ఉలి) అన్న మారు పేరుతో వ్యంగ్య రచనలు చేసేవాడు. 28 ఏళ్ళప్పుడు తొలి నవల ‘ఎన్వీ’ రాశాడు. ఇందులో ఇతివృత్తం పాత కొత్త ప్రపంచాల మధ్య సంఘర్షణే. కథలో రెండు ప్రపంచాలకీ ప్రతినిధులనదగ్గ పాత్రలు ఉంటాయి. ఇవాన్‌ అనే పాత్ర ఇలా అంటాడు: ‘‘...కరుణ, సున్నితత్వం, గర్వం, ఈర్ష్య, ప్రేమ--ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ముగింపు కొస్తున్న శకంలో మానవాత్మను కమ్ముకొని ఉన్న భావావేశాలన్నింటినీ పూర్తిగా నిర్మూలించాలి. సోషలిస్టు శకం ఈ భావావేశాల్ని కొత్త మానసిక స్థితులతో భర్తీ చేస్తుంది’’. అక్కడితో ఆగడు,‘‘పాత ప్రపంచానికి పూర్తిగా తెరపడేలోగా, ఆ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే భావావేశాలన్నింటి తోనూ ఒక ఆఖరి ప్రదర్శన ఇప్పించాలనుకుంటున్నాను’’ అంటాడు.

ఓలేషా పాత, కొత్త ప్రపంచాల్లో ఒకటి గొప్పదనీ, ఒకటి తక్కువదనీ అలా ఏం అనుకోలేదు. రెంటినీ సమభావంతోనే చిత్రించాడు. అందుకే ‘ఎన్వీ’ నవల వచ్చినప్పుడు ఆయన దేన్ని సమర్థిస్తున్నాడో ఓ పట్టాన ఎవరికీ అర్థం కాలేదు. అది ఎవరు ఎలా చదివితే వారికి అలా అర్థమయ్యింది. విప్లవానికి ముందున్న ప్రపంచాన్ని వెక్కిరిస్తున్నాడనుకొని మొదట్లో కమ్యూనిస్టు విమర్శకులంతా నవలను ఆకాశానికెత్తేశారు. ఆ నవల కథానాయకుడు కవెల్రోవ్‌ ఒక తాగుబోతు. ఒక సమర్థుడైన సోవియెట్‌ అధికారి పట్ల ఈర్ష్యతో రగిలిపోతుంటాడు. ఈ ఈర్ష్యే నవల ప్రధాన ఇతివృత్తం. కథ చివర్లో కవెల్రోవ్‌ పూర్తిగా ఓడిపోయి మట్టిగొట్టుకు పోతాడు. దీంతో విమర్శకులంతా పాత ప్రపంచానికి ప్రతినిధి అయిన ఒక అసమర్థ పాత్రని నిరసించటమే ఓలేషా ఉద్దేశ్యమనుకొని పొగిడారు. అయితే కథ మొదటి భాగమంతా కవెల్రోవ్‌ చెప్పే కథనంలో అతని స్వాప్నికత, ప్రపంచాన్ని కవితాత్మకంగా స్వీకరించే తీరు వ్యక్త మవుతాయి. విమర్శకులు ఏమనుకున్నా, పాఠకులు మాత్రం ఈ తాగుబోతు పాత్రలోనే తమని తాము చూసుకోవటం మొదలుపెట్టారు. దీంతో విమర్శకులు నవలను మళ్ళీ తిరగదోడారు. ఈసారి విమర్శల పరంపర మొదలైంది. అయినా ఓలేషా తన పద్ధతిలోనే రాయాలని కొన్నాళ్ళు ప్రయత్నించాడు. ఆ ఉరవడిలోనే ‘ల్యోంపా’, ‘లవ్‌’, ‘ద చైన్‌’, ‘చెర్రీస్టోన్‌’ లాంటి మంచి కథలు వచ్చాయి. అయితే కమ్యూనిస్టు ఆదర్శాలకు సాగిలపడనందుకు అతని రచనల్ని ప్రచురించటం ఆపేశారు.

1934లో ‘సోవియట్‌ రచయితల సభలు’ జరిగాయి. సభల ఉద్దేశాన్ని పైకి ఏమని ప్రకటించినా, అసలు ఉద్దేశం మాత్రం రచయితలెలా రాయాలో వాళ్ళకి చెప్పటమే. రచయిత కథను వర్ణించేటప్పుడు తనలో ఇంకిన ప్రపంచాన్ని వ్యక్తం చేయాలనుకుంటాడు. కానీ సోవియట్‌ రాజ్యం తన రచయితల్నుంచి కోరిందల్లా ఇన్‌స్ట్రక్షన్‌ మాన్యువల్స్‌ని మాత్రమే. అందుకు తగ్గట్టు రాయనివాళ్ళని నిషేధించారు. హఠం వీడకపోతే హత్యలూ చేశారు. ఈ సభల్లో ఓలేషా కూడా సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. తన ‘ఎన్వీ’ నవల వెనుక ఉద్దేశాన్ని వివరించాల్సి వచ్చింది. ఒక రకంగా తన మానాన తనని రాసుకోనివ్వమని బతిమాలుకున్నాడనే చెప్పాలి. ఉపన్యాసంలో ఒక చోట ఇలా అంటాడు: ‘‘ఆర్టిస్టుగా నాలోని స్వచ్ఛమైన చేవతో కవెల్రోవ్‌ పాత్రని సృష్టించాను. తొలి సృజన జోరులో, తొలి స్పందనల ప్రభావంతో ఈ నవల రాశాను. కానీ జనం కవెల్రోవ్‌ని వెకిలి, పనికిమాలిన పాత్ర అన్నారు. నాలోంచి ఎంతో తీసుకుని పుట్టిన కవెల్రోవ్‌ని ఇలా అనటంతో నన్నే నిందించినట్టు బాధ పడ్డాను. అమలినమైన కుతూహలం కలిగి, ప్రపంచాన్ని తనదైన తీరులో చూడగలిగిన మనిషి వెకిలివాడు, పనికిమాలినవాడు ఎలా అవుతాడు. నాలో నేనే ఇలా అనుకున్నాను: అంటే నీకు చెందినదంతా, నువ్వు నీ సామర్థ్యమని అనుకొనేదంతా వెకిలితనం, పనికిమాలినతనమూనా! నన్ను తిట్టిన నా కామ్రేడ్స్‌--కమ్యూనిస్టు సాహిత్య విమర్శకులు--నిజమే చెబుతున్నారని నమ్మాలనుకున్నాను. చివరకు నమ్మాను కూడా.’’

చూట్టూ చాలామంది రాస్తున్నట్టు రాయలేని తన నిస్సహాయతను కూడా వ్యక్తం చేసుకున్నాడు. ‘‘నేను ఒక కన్‌స్ట్రక్షన్‌ సైటుకు వెళ్ళి, అక్కడి శ్రామికుల మధ్య జీవిస్తూ వాళ్ళ గురించి ఒక వ్యాసమో, నవలో రాయగలనేమో--కానీ అది నా ఇతివృత్తం కాదు; నా రక్తంలో పారే ఇతివృత్తం కాదు, నా ఊపిరి కాదు. ఆ ఇతివృత్తాన్ని తీసుకుంటే నేను నిజమైన రచయితను కాను. అప్పుడిక ప్రేరణ నాపై పని చేయదు. ఒక కార్మికుణ్ణి, ఒక విప్లవ నాయకుడ్ని నేను పాత్రలుగా గ్రహించలేను’’ అన్నాడు. కానీ ఇకమీదట తాను రాయదల్చుకుంటే ఆ పని చేయక తప్పదని తెలుసు. అందరూ ఊదరగొడుతున్న ఈ కొత్త మానవుడ్ని ఇష్టం లేకున్నా వస్తువుగా తీసుకోక తప్పదని తెలుసు. కానీ రాయాలంటే వాడితో ఒక సయోధ్య కుదరాలిగా: ‘‘ఈ దేశంలో ఒక కొత్త తరం మనిషి, మొదటి సోవియట్‌ మనిషి, ఇప్పుడే ఆవిర్భవిస్తున్నాడు. నేను అతడివైపు ఆత్రంగా వెళ్ళి అడిగాను: ‘ఎవరు నువ్వు? ఏ రంగులు చూస్తావు? కలలు కంటావా? ఏమనుకుంటావు నీ గురించి? దేనికి ఆశపడతావు? ఎలా ప్రేమిస్తావు? దేన్ని ఒప్పుకుంటావు, దేన్ని కాదంటావు? నీలో హేతువు బలమైనదా, భావావేశమా? సున్నితత్వం నీకు తెలుసా? ఓ సోషలిస్టు సమాజ యువకుడా ఎలాంటి మనిషివి నువ్వు?’’’ అంటాడు.

ఈ సోవియట్‌ రచయితల సభల తర్వాతే రచయితగా ఓలేషా పతనం మొదలైంది. రాయాలనుకున్నది రాయలేడు. అలాగని రచయితై వుండీ రాయటం మానేస్తే ‘సామాజిక పరాన్నజీవి’గా ముద్రవేసి జైల్లో తోసే అవకాశముంది. దాంతో ఇక తప్పక సోవియెట్‌ ఆదర్శాల్ని బలవంతాన వొంట బట్టించుకొనే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో తనను తాను పోగొట్టు కున్నాడు. రచయితగా శక్తులన్నీ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు రాయాలనుకున్నది రాసే అవకాశం లేకపోయింది. ఈ నిరాశలో తాగుడికి లొంగిపోయాడు. నిస్సారమైన రాతలు రాశాడు. ఓలేషాకు యాభైఏళ్ళు దాటాక స్టాలిన్‌ చనిపోయాడు. అప్పుడు తాత్కాలికంగా రచయితలకు కొంత స్వేచ్ఛ దొరికింది. ఓలేషా పాత రచనల్ని పునర్ముద్రించారు. అప్పుడు కూడా ‘‘రచయిత ఈ రచనల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని తర్వాత తప్పు అని ఒప్పుకున్నాడు’’ అన్న ముందుమాట చేర్చి మరీ ప్రచురించారు. ఓలేషా మరో ఆరేళ్ళు బతికి గుండెపోటుతో చనిపోయాడు. ఆఖరు రోజుల్లో రాసిన ‘నో డే వితవుట్‌ ఎ లైన్‌’ అనే ఒక పూర్తికాని స్మృతి రచనలో, ‘‘రచనా జీవితంలో నేను చేసింది ఒక రూపకాలంకారాల దుకాణాన్ని తెరవటం. కానీ ఆ ఖరీదైన, జటిలమైన రూపకాల్ని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో ఆ దుకాణం మూసేసాను’’ అని రాసుకున్నాడు. ఎదిగేకొద్దీ మన చూపు ప్రపంచంపై కప్పే అలవాటనే పొరని తీసేయటం, దానిని తిరిగి బాల్య స్వచ్ఛతతో సర్ది చూపించటం ఓలేషా శైలిలో కనిపిస్తుంది.

రష్యన్‌ సాహిత్యంలో పుష్కిన్‌, గొగోల్‌లు ఇద్దరూ రెండు భిన్న సంప్రదాయాలకు ఆద్యులు. ఇంద్రియాలకు తోచే సమస్త ప్రకృతి మీద వాత్సల్యంతో దానిని కవితాత్మకంగా స్పృశించేది పుష్కిన్‌ పద్ధతి అయితే, తీవ్రంగా మెలిపడిన వ్యక్తిత్వంలోంచి ప్రకృతిని తనదైన వికృతిలోకి తర్జుమా చేసుకుని చూడటం గొగోల్‌ పద్ధతి. ఒకరి కలం వెలుపలికి చూస్తుంది, మరొకటి లోపలి లోతుల్ని తవ్వి తీస్తుంది. అటు పుష్కిన్‌ ఇటు గొగోల్‌, అటు టాల్‌స్టాయ్‌ ఇటు దాస్తోయెవ్‌స్కీ... ఇలా భిన్న ధృవాలను తమలో ఇముడ్చుకొని రాసిన అరుదైన రష్యన్‌ రచయితల్లో ఓలేషా ఒకడు. ఈ విషయంలో ఓలేషాకి సరిజోడు మరో రష్యన్‌ రచయిత వ్లాదిమిర్‌ నబొకొవ్‌. ఓలేషా, నబొకొవ్‌ ఇద్దరూ ఒక ఈడు వాళ్ళే. ఇద్దరిదీ ఒకటే చూపు, ఒకటే ప్రతిభ. నిజానికి, ఇద్దరూ ఒకే వయస్సులో రాసిన తొలి నవలల్ని చూస్తే, నబొకొవ్‌ కన్నా ఓలేషా ఎంతో పరిణతితో కనిపిస్తాడు. అయితే నబొకొవ్‌ కమ్యూనిస్టు రష్యా నుంచి బైటపడి బతికిపోయాడు. పూర్తి స్థాయిలో వికసించగలిగాడు. ఓలేషా అక్కడే ఉండి జీవచ్ఛవంగా మిగిలాడు. మొగ్గగానే తెగిపోయాడు. అతని తొలి నవల పరిమళం మాత్రమే అలా మిగిలి తారాడుతోంది.
(ఆంధ్ర జ్యోతి వివిధలో)


July 30, 2018

హొర్హె లూయీ బోర్హెస్‌ (1899-1986) పరిచయం: ‘‘స్వర్గం ఒక లైబ్రరీలా ఉంటుందేమో అనుకుంటాను’’

కథలు రాయటానికి బోర్హెస్‌ జీవితానుభవంపై కన్నా, పఠనానుభవాలపై ఎక్కువ ఆధార పడ్డాడు. తత్త్వశాస్త్ర పఠనంలో తనను బాగా ఆకర్షించిన సమస్యలూ మీమాంసల ఆధారంగా ఆడిన ఆటలే ఆ కథలు చాలావరకూ. అలాని అవేం గంభీరంగా సాగవు. ఉదాహరణకి కొన్ని కథల థీమ్స్‌ ఇలా ఉంటాయి: మన జీవితాన్ని ఎవరో కలకంటున్నారని తెలిస్తే? నిజంగా అమరత్వం లభిస్తే? ఈ విశ్వం అవధిలేని షడ్భుజాకార గ్రంథాలయమైతే? దేవుని అసలు ప్రతినిధి క్రీస్తు గాక జుడాస్‌ అయితే? నామవాచకాల్ని నిరాకరించే ప్రపంచం ఎలా ఉంటుంది? అసలు దేన్నీ మరచిపోలేని మనిషి ఎలా ఉంటాడు? ఇలాంటి ఇతివృత్తాల్ని బోర్హెస్‌ క్రైమ్‌ థ్రిల్లర్లలోకీ, డిటెక్టివ్‌ కథల్లోకీ, నకిలీ పుస్తక సమీక్షల్లోకీ ఇమిడ్చి చెబుతాడు.

హొర్హె లూయీ బోర్హెస్‌ ((Jorge Luis Borges) అర్జెంటీనా రాజధాని బ్యునోస్‌ ఐర్స్‌లో పుట్టాడు. తండ్రి లాయరు, సైకాలజీ బోధించేవాడు. ఆయనకు రచయిత కావాలని ఉండేది. కొంత రాసాడు కానీ పేరు తెచ్చుకోలేకపోయాడు. తండ్రి వల్ల కానిది కొడుకు చేస్తాడన్నది ఆ కుటుంబంలో పైకి ఎవరూ అనకపోయినా అందరూ అంగీకరించిన విషయం. బోర్హెస్‌ ఏడేళ్ళ వయసులోనే ఆస్కార్‌ వైల్డ్‌ కథను అనువదించాడు. అంతకన్నా ముందే సాహిత్య పఠనం ప్రారంభించాడు. తండ్రి లైబ్రరీలో అడుగు పెట్టడమే తన జీవితాన్ని మలుపుతిప్పిన గొప్ప సంఘటన అంటాడు బోర్హెస్‌. నానమ్మ ఇంగ్లాండు మనిషి కావటంతో, ఆమె నుంచి తండ్రికీ, తండ్రి నుంచీ బోర్హెస్‌కీ ఇంగ్లీషు సహజంగా వచ్చేసింది. మాతృభాష స్పానిష్‌ పుస్తకాల కన్నా ముందే ఇంగ్లీషు పుస్తకాలను చదివాడు. తర్వాతెపుడో ప్రసిద్ధ స్పానిష్‌ నవల ‘డాన్‌ కిహోటే’ని చదువుతుంటే, అంతకుముందే చదివిన ఇంగ్లీషు వెర్షన్‌కి ఈ మూలం నాసిరకం అనువాదంలాగ తోచిందట.

బోర్హెస్‌ తాతల తరంలో సైన్యంలో కల్నల్స్‌గా పనిచేసి యుద్ధాల్లో చనిపోయినవారున్నారు. తను మాత్రం ఇలా పుస్తకాల పురుగులాగ మారటం పట్ల బోర్హెస్‌కు కించపడేవాడు. ప్రాణాలకు విలువివ్వని వీరోచితమైన మనుషులంటే ఆకర్షణ ఆయనకు జీవితాంతం ఉంది. తనకు ఆ ధైర్యం లేదన్నది యవ్వనంలో ఆయన్ను వేధించేది. బోర్హెస్‌కు 15ఏళ్ళ వయస్సులో తండ్రికి కంటిచూపుకు వైద్యం చేయించ టానికని కుటుంబం జెనీవాకు వెళ్ళింది. ఇక్కడే ఆడవాళ్ళపై బెరుకుపోగొట్టడానికి తండ్రి స్వయంగా బోర్హెస్‌ను వేశ్య దగ్గరకు పంపించాడు. బోర్హెస్‌కు స్త్రీలతో ప్రేమ సంబంధాలు తక్కువే. 68ఏళ్ళ వయస్సులో చేసుకున్న పెళ్ళి మూడేళ్ళే నిలిచింది.

జెనీవాలో చదువుకుంటూ బోర్హెస్‌ లాటిన్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌ భాషలను నేర్చుకున్నాడు. 22ఏళ్ళ వయస్సులో తిరిగి బ్యునోస్‌ ఐర్స్‌ చేరుకున్నాడు. బాల్యంలో వదిలి వెళ్ళిన నగరాన్ని యవ్వనంలో తిరిగివచ్చి కొత్త కళ్ళతో చూసాడు. నగరం మీద రాసిన కవితలతో 1923లో తొలి పుస్తకం పబ్లిష్‌ చేసాడు. అది మొదలు మరో పదేళ్ళలో ఏడు పుస్తకాలు పబ్లిష్‌ చేశాడు (నాలుగు వ్యాస సంపుటులు, మూడు కవితా సంపుటులు). మిత్రులతో కలిసి చాలా సాహిత్య పత్రికల్ని నడిపాడు. ఈ కాలంలో రాసిన పుస్తకాలన్నింటినీ బోర్హెస్‌ తర్వాతి కాలంలో తిరస్కరించాడు. ఒక ఫోజులాగా కారణంలేని దిగులును మీద వేసుకుని హామ్లెట్‌నూ రస్కోల్నికోవ్‌నూ ఒక మూసలో పోసినట్టు ఉండే వాడిననీ, అదే తన కవిత్వంలోనూ ప్రతిబింబించేదనీ తర్వాత చెప్పుకున్నాడు.

తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కథల్ని ఆయన 35ఏళ్ళు దాటాక గానీ రాయలేదు. కథలు రాయగలడని ఆయనపై ఆయనకే నమ్మకం ఉండేది కాదు. అందుకని తొలి కథల్ని ఎక్కడా లేని మనుషుల ఆత్మకథల్లాగా, లేని పుస్తకాలకు సమీక్షల్లాగా రాసాడు. తనే ఎడిటర్‌గా పనిచేసే ఒక సాహిత్య పత్రికలో ప్రచురించేవాడు. కథలు రాయగలనని నమ్మకం కుదరటానికి ఆయనకు జరిగిన ఒక ప్రమాదం కారణమైంది. బోర్హెస్‌కు తండ్రిలాగే కంటిచూపు మొదట్నించీ సరిగా ఉండేది కాదు.

ఒకసారి మెట్లు దిగివస్తూ జారిపడ్డాడు. ఆ పడటంలో ఏదో గట్టిగా తలకు తగిలి స్పృహ కోల్పోయాడు. రెండు వారాల పాటు బతుకుతాడో లేదో తెలియని అపస్మారక స్థితిలో గడిపాడు. కోలుకున్నాక, తానిక రచన చేసే శక్తిని కోల్పోయాడని అనిపించింది. ఒకసారి ప్రయత్నం చేయాలను కున్నాడు. కానీ అప్పటిదాకా కవిత్వమే ప్రాణంగా బతికి ఇప్పుడు అది రాయలేనని తెలిస్తే భరించ లేననీ, అలవాటులేని ప్రక్రియలో రాస్తే విఫలమైనా అంత బాధ ఉండదనీ ఒక కథ రాసాడు. ఆ కథ ‘పియర్రె మేనార్డ్‌: ఆథర్‌ ఆఫ్‌ కిహోటే’ ఆయనకు బాగా పేరుతెచ్చింది. తర్వాతిక అంతూపొంతూలేని గ్రంథాలయాల్నీ, మన ప్రపంచంలోకి చొరబడే వేరే ప్రపంచాల్నీ, మొత్తం ప్రపంచాన్ని అన్ని స్థలాల్లోనూ అన్ని కాలాల్లోను ఒకేసారి చూపెట్టగలిగే వస్తువుల్నీ, ఎడతెగక సాగే పుస్తకాల్నీ, అనేక విశ్వాల్నీ ఊహిస్తూ కథలు రాయటం ప్రారంభించాడు. ఫిక్కినోస్‌ (1949), ఎల్‌ అలెఫ్‌ (1952) పుస్తకాలు ఇంగ్లీషులోకి అనువాదమై ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

1955లో బోర్హెస్‌ అర్జెంటినా జాతీయ లైబ్రరీకి డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. ‘‘నేను ఎప్పుడూ స్వర్గం ఒక లైబ్రరీలా ఉంటుందేమో అనుకుంటాను’’ అని చెప్పుకున్న బోర్హెస్‌కు ఇది చాలా చక్కగా అమిరే ఉద్యోగం. కానీ అప్పటికే ఆయన్ను అంధత్వపు చీకట్లు పూర్తిగా చుట్టుముట్టాయి. ‘‘దేవుడు నాకు పుస్తకాల్నీ రాత్రినీ ఒకేసారి ఇచ్చాడు’’ అని ఒక కవితలో రాసుకున్నాడు. ఈ అంధత్వం ఫలితంగా బోర్హెస్‌ వచన కవితల్ని పక్కనపెట్టి, ఛందోబద్ధమైన నిర్మాణాన్ని తీసుకున్నాడు. మనసులోనే అల్లగలిగే వీలు, ఆ అల్లికను జ్ఞాపకంలో దాచుకోగలిగే వీలు వచనం కన్నా పద్యానికే ఎక్కువ కాబట్టి, పద్యాలు ఎక్కువగా రాయటం మొదలుపెట్టాడు. అయితే కవిత్వం కన్నా బోర్హెస్‌కు ఆయన కథలే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. మనం వాస్తవంగా భావించి నిబ్బరంగా నడిచే మానవానుభవతలంపై మనల్ని బోల్తాకొట్టించే గుంతల్ని తవ్వుతాయి ఆ కథలు.

(ఆంధ్ర జ్యోతి వివిధలో)


July 23, 2018

రాబర్ట్ వాల్సర్ (1878-1956): రోజువారీ కవిత్వం

 ‘‘రాబర్ట్‌ వాల్సర్‌కి ఒక లక్షమంది పాఠకులు గనక ఉన్నట్టయితే ఈ ప్రపంచం ఎంతో బాగుపడేది,’’ అంటాడు ‘సిద్ధార్థ’ నవలా రచయిత హెర్మెన్‌ హెస్సే. అలాగని రాబర్ట్‌ వాల్సర్‌ కలంపట్టి ప్రపంచం బాగు కోసం పూనుకున్నవాడేం కాదు. బహుశా ఆయన్ని చదివి ఆనందించగలిగే పాఠకులు ఆయనలాగే ప్రపంచాన్ని పెద్ద ఫిర్యాదులేం లేకుండా, దాని దయను పెద్ద ఋజువులేం లేకున్నా నమ్ముతూ, దాన్ని మరీ గంభీర దృష్టితో కాకుండా పిల్లల తుంటరితనంతోను కుతూహలం తోను చూడగలరని హెర్మెన్‌ హెస్సే భావం అయ్యుండొచ్చు.

రాబర్ట్‌ వాల్సర్‌ (Robert Walser) స్విట్జర్లాండ్‌లో బెర్న్‌ అనే ప్రాంతంలో 1878లో పుట్టాడు. ఎనిమిదిమంది పిల్లల్లో ఒకడు. నాన్నకి ఒక స్టేషనరీ షాపు ఉంది. పదిహేనేళ్ళకే స్కూలు మానేసి చిన్నాచితకా ఉద్యోగాలు చేసాడు. కవిత్వం రాయటం మొదలుపెట్టాడు. 27 ఏళ్ళ వయస్సులో బెర్లిన్‌లో చిత్రకారుడిగా పనిచేస్తున్న అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సేవకుల (బట్లర్‌) ఉద్యోగాలకోసం తర్ఫీదు ఇచ్చే స్కూల్లో చేరాడు. ఒక చోట బట్లర్‌గా పనిచేసాడు కూడా. కానీ రచనల ద్వారా వస్తున్న సంపాదనతో బతికేయవచ్చనిపించి ఆ పని మానేసాడు. విరివిగా చిన్నచిన్న వచన ఖండికలు రాసాడు. మూడు నవలలు రాసాడు. చాలా పేరూ వచ్చింది. అయితే నగర జీవితంలో కుదురుకోలేకపోయాడు. నిజానికి బెర్లిన్‌లో ఉండుంటే అక్కడి మేధావుల సర్కిల్‌లోకి సాదరంగానే వెళ్ళగలిగేవాడు, స్థాయికి తగ్గ పనేదో చేస్తూ బానే బతకగలిగేవాడు. కానీ- ఏమాత్రం సాహిత్య వాతావరణం లేని సొంత ఊళ్ళో తను జన్మతహ ఏ వర్గానికి చెందుతాడో వారి మధ్యనే ఉండటానికి ఇష్టపడ్డాడు. కొన్నాళ్ళు అక్కతోపాటు ఉన్నాడు. తర్వాత ఒంటరిగా చిన్న చిన్న అద్దె గదుల్లో బతకటం మొదలుపెట్టాడు.

మరోపక్క అతని రచనలకి డిమాండ్‌ తగ్గుతూ వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనూ, ఆ తర్వాతా- ప్రపంచాన్ని కవితాత్మక ధోరణిలో పరికించే వాల్సర్‌ తరహా రచనలకు ఆదరణ తగ్గింది. అతను మాత్రం రాయటం మానలేదు. తరుగుతున్న సంపాదనకు తగ్గట్టు ఖర్చులూ తగ్గించుకున్నాడు. కానీ సరైన దుస్తులు కూడా వేసుకోలేని స్థితికి వచ్చాకా, చుట్టుప్రక్కలవాళ్ళ చూపులు, ఈసడింపులు భరించటం కష్టమైంది. ఒక నవలలో చుట్టూ ఉన్న సమాజంలో కుదురుకోలేకపోతున్న ఒక పాత్ర గురించి వాల్సర్‌ ఇలా రాస్తాడు: ‘‘అతను ఎప్పుడూ మంద తప్పిన మేకపిల్లలా ఉండేవాడు. జనం బతకటం ఎలాగో నేర్పిద్దామని అతన్ని బాధ పెట్టేవారు. దానికి తగ్గట్టే ఏ రక్షణా లేనట్టు ఉండేవాడు. చెట్టు మీద మిగతా ఆకులకన్నా వేరేగా కనిపిస్తుందన్న కారణంగా పిల్లాడు కర్రతో కొట్టి తెంపేసే చిన్న ఆకులా ఉండేవాడు. ఇంకోలా చెప్పాలంటే, రండి నన్ను బాధపెట్టండి పిలుస్తున్నట్టు.’’

గడవటం అంతకంతకూ కష్టం కావటంతో ఉద్యోగంలో చేరాడు కానీ ఎన్నాళ్ళో నిలుపుకోలేకపోయాడు. బాగా తాగేవాడు. రాత్రుళ్ళు నిద్రపట్టేది కాదు. చెవుల్లో ఎవరో మాట్లాడుతున్నట్టు, అరుస్తున్నట్టు వినిపించటం మొదలైంది. పిడుగులు పడుతున్నట్టు, ఎవరో పీక నులిమేస్తున్నట్టు భ్రమలు పెరిగాయి. ఆత్మహత్యకూ విఫలయత్నం చేశాడు (‘‘నాకు కనీసం ఉరితాడు పేనుకోవటం కూడా చేతకాదు’’). చివరకు తన్ను తాను సంభాళించుకునే స్థితిలో లేడనిపించింది. అక్క సలహాతో 1928లో యాభయ్యేళ్ళ వయసులో ఒక మానసిక చికిత్సాలయంలో చేరాడు.

అదిమొదలు, అలాంటి చికిత్సాలయాల్లోనే దాదాపు పాతికేళ్ళ పాటు, చనిపోయేవరకూ జీవితాన్ని గడిపేసాడు. నిజంగా అతని మతి చెడిందా లేదా అన్నది ఇప్పటికీ ఎవరికీ నికరంగా తెలీదు. ఆయన ఆ తర్వాత రాసిన రచనల్లో అందుకు సూచలేం కనపడవు. డాక్టర్లు కూడా ఒక సందర్భంలో కొన్నాళ్ళు బయట గడిపి చూడమని సలహా ఇచ్చారు. కానీ తన ఇష్టాయిష్టాల్తో నిమిత్తం లేకుండా ఒక పద్ధతి ప్రకారం సాగిపోయే ఈ జీవితమే వాల్సర్‌కి నచ్చింది. ‘‘ఆసుపత్రిలో నాకు కావాల్సిన నిశ్శబ్దం దొరుకుతోంది. ఉన్నా లేనట్టే ఎవరికీ కనిపించకుండా మాయమైపోగలుగుతున్నాను’’ అని చెప్పుకున్నాడు.

ఆసుపత్రికి వచ్చే వంటసరుకుల్ని సర్దటం, ఉత్తరాల్ని విడదీయటం, కాయితం సంచుల్ని తయారు చేయటంలాంటి పనులుచేస్తూ ఉండేవాడు. ఇవి లేనప్పుడు బయట నడవటానికి పోయేవాడు. నడవటం అంటే వాల్సర్‌కి ఎంత పిచ్చి ఇష్టమంటే, ఊళ్ళకు ఊళ్ళు దాటి అలా నడుస్తూనే ఉండేవాడు. 1956లో క్రిస్మస్‌ రోజున ఇలాగే బయల్దేరి నడుస్తూనే మంచులో కుప్పకూలిపోయాడు. అప్పుడు పోలీసులు తీసిన ఫోటోలు కొన్ని ఆయన ఆఖరి క్షణాల్ని చూపెడతాయి. మంచులో కొంతదూరం సాగిన ఒక జత పాదముద్రల చివర వాల్సర్‌ శవం ఉంటుంది.

వాల్సర్‌ రచనల్ని అభిమానించిన, ఆయన శైలి నుంచి ఎంతో కొంత అందిపుచ్చుకున్న మరో ప్రసిద్ధ జర్మన్‌ రచయిత ఫ్రాంజ్‌ కాఫ్కా చనిపోయాకా తన రచనల్ని కాల్చేయమని స్నేహితుడికి చెప్పాడు. అయినా స్నేహితుడు కాల్చడనీ, తన రచనలు బయటి ప్రపంచాన్ని ఎలాగో చేరతాయనీ ఆయనకు ఏమూలో నమ్మకం వుండేవుంటుంది. కానీ అసలు బయట ఎవరైనా చదువుతారన్న స్పృహలేకుండా అచ్చంగా తన కోసమే రాసుకున్న రచయితలు ఎవరన్నా ఉంటే వాల్సర్‌ ఆ అరుదైన సమూహంలో ఒకడని అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్చాసుపత్రిలో చేరాకా కూడా వాల్సర్‌ రాస్తూనే ఉన్నాడు. పెన్ను వాడటం మానేసి త్వరగా చెరిగిపోయే పెన్సిల్‌తో రాయటం మొదలుపెట్టాడు. ఆలోచనతో పోటీపడి వేగంగా రాసేందుకు తనే ఒక సొంత షార్ట్‌హేండ్‌ శైలిని తయారు చేసుకున్నాడు. ఆయన చనిపోయాకా ఇలా క్లుప్తం చేసిన పదాలతో, చిన్ని చిన్ని అక్షరాల్లో ఇరికించి రాసిన వందల కాయితాలు బయటపడ్డాయి. ముప్ఫైపేజీల్లో ఒక నవల రాసేడంటే ఎంత ఇరికించి రాసేవాడో అర్థం చేసుకోవచ్చు. ఈ రాతనీ, ఆయన షార్ట్‌హాండ్‌ శైలినీ డీకోడ్‌ చేయటానికే పబ్లిషర్స్‌కు చాలా ఏళ్ళు పట్టింది. వీటిని ‘మైక్రోస్ర్కిప్ట్స్‌’ పేరిట ఈమధ్యనే ప్రచురించారు.

వాల్సర్‌ జీవితమంతా దిగులుతోవలోనే గడిచినా, ఆయనకి ప్రపంచంపై అక్కసేమీ ఉన్నట్టు రచనల్లో కనిపించదు. పైగా అదంటే ఎంత ఇష్టమంటే, రాన్రానూ అందులోంచి ఒక కథ పుట్టించాల్సి రావటం కూడా దాన్ని నేరుగా కావలించుకునేందుకు ఒక అడ్డమే అయింది. కథల మీద తన అయిష్టత గురించి ఇలా చెప్పుకొచ్చాడు: ‘‘కథని బాగా అల్లటంలో ఆరితేరినవాళ్ళన్నా, ప్రపంచంలో ఎవర్నైనా సరే పాత్రలుగా తీసేసుకోగలిగే రచయితలన్నా నేను చప్పున దూరం జరుగుతాను. రోజువారీ విషయాల్ని మచ్చిక చేసుకుంటే చాలు, బోలెడు కవిత్వాన్ని విరజిమ్మే అందమూ, ఐశ్వరమూ వాటికి ఉన్నాయి.’’ వాల్సర్‌ వచన ఖండికలు చాలావరకూ అటు కథా కాదు, ఇటు వ్యాసమూ కాదన్నట్టు సాగుతాయి. బయోగ్రాఫికల్‌ స్కెచెస్‌ అనవచ్చు. ఎవరో తీరుబడిగా నడుస్తూ కాలక్షేపం కోసం మనసులో కల్పించుకునే ఉబుసుపోని ఊహలన్నింటినీ అప్పటికప్పుడు వాక్యాల్లోకి తర్జుమా చేసినట్టు ఉంటాయవి. కుతూహలంతో మెరిసే రెండు కళ్ళు ప్రపంచాన్ని ఆత్మీయంగా దర్శిస్తున్నట్టు ప్రతి వాక్యంలోనూ తెలుస్తుంది.

(ఆంధ్ర జ్యోతి వివిధలో)


July 16, 2018

ఆంద్రె బెలీ (1880-1934) పరిచయం: ప్రపంచమనే సంకేతాల అడవిలో...

 రష్యాలో 1890ల్లో జార్‌ చక్రవర్తులకు వ్యతిరేకంగా తిరుగు బాట్లు చెలరేగిన కాలానికీ, 1917లో రష్యన్‌ విప్లవం సఫలమై సోవియట్‌ రాజ్యం ఏర్పడిన కాలానికీ మధ్య- ఆ దేశ సాహిత్యం దాదాపు ఒక ముప్ఫయ్యేళ్ళ పాటు మరో ప్రభావానికి గురైంది. అదే సింబాలిజం.

అటు ప్రపంచమంతా హేతువు ప్రకారం నడుస్తుందని నమ్మే విప్లవకారులకూ, ఇటు ప్రపంచానికి అర్థమంతా బైబిలు పేజీల్లో దొరికేస్తుందని నమ్మే సంప్రదాయవాదులకూ మధ్య ఒక సంశయాత్మక తరంగా ఈ సింబాలిస్టులు పుట్టారు. వీరు సృష్టి రచనకు ఏ సులభమైన తాత్పర్యాన్ని ఒప్పుకోలేదు. ప్రపంచాన్ని అర్థంకాని మర్మాలతో, నిగూఢ సంకేతాలతో (సింబల్స్‌తో) నిండినదిగా చూశారు. రష్యన్‌ విమర్శకుడు మిర్‌స్కీ- సింబాలిజానికి సాహిత్యపరమైన మూలాల్ని ఫ్రెంచ్‌ కవి బాదిలేర్‌ కవిత నొకదానిలో చూడవచ్చని అంటాడు. ‘కరెస్పాండెన్సెస్‌’ అనే ఈ కవితలో మొదటి పంక్తులు ఇలా సాగుతాయి: ‘‘ఈ ప్రకృతి గుడిలో సజీవమైన స్తంభాలు/ ఉండుండి ఏదో గొణుగుతాయి/ మనిషి సంకేతాల అడవిలోంచి నడుస్తాడు/ అవన్నీ అతని వైపు ఎరిగున్నట్టు చూస్తాయి’’. సింబాలిస్టుల దృష్టిలో ప్రపంచం ఇలా నిగూఢ సంకేతాలతో కిక్కిరిసిన ఒక అడవి.

ఆంద్రె బెలీ (Andrei Bely) ఈ సింబాలిస్టుల తరానికి చెందినవాడే. బెలీ మొదట్లో ఎక్కువ కవిత్వం రాసాడు. సింబాలిస్టులందరిలాగే బెలీ కూడా సాహిత్యాన్ని సంగీతానికి చేరువ చేయాలనుకున్నాడు. ఆయన దృష్టిలో పదాలు కేవలం అర్థాన్ని సూచించే సంకేతాలు మాత్రమే కాదు. అవి తమ రూపం ద్వారా, శబ్దం ద్వారా కూడా భావ ప్రసారాన్ని చేయగలవు. పదాలకున్న అర్థ, రూప, శబ్దాల ఈ త్రిముఖ స్వరూపాన్ని పూర్తిగా వాడుకొనేందుకు బెలీ ప్రయత్నించాడు. మిగతా సింబాలిస్టులు ఈ ధోరణిని తమ కవిత్వానికే పరిమితం చేసుకోగా, బెలీ తన నవలల్లో కూడా ఇదే ధోరణిని అనుసరించాడు.

బెలీ ప్రసిద్ధ నవలలు ‘ద సిల్వర్‌ డోవ్‌’, ‘కోతిక్‌ లెతేవ్‌’, ‘పీటర్స్‌బర్గ్‌’ ఈ మూడూ రష్యన్‌ వచన సాహిత్యాన్ని చాలా ప్రభావితం చేసాయి. వీటిలో ‘పీటర్స్‌బర్గ్‌’ను బెలీ మాస్టర్‌పీస్‌గా చెబుతారు. 1905లో జరిగే ఈ కథలో జార్‌ చక్రవర్తుల కోసం పనిచేసే ఒక అధికారిని చంపటానికి అతని కొడుకు చేతికే బాంబ్‌ ఇస్తారు విప్లవకారులు. కథ పైకి రాజకీయంగా కనిపించినా, తండ్రిని చంపటానికి కొడుకు పడే మీమాంసే ఎక్కువ పేజీలుంటుంది. పీటర్స్‌బర్గ్‌ నగరం కూడా కథ అంతటా ఒక పాత్రలా పరచుకొని ఉంటుంది.

బెలీ బోల్షెవిక్‌ విప్లవాన్ని మనస్ఫూర్తిగా సమర్థించాడు. విప్లవం తర్వాత రష్యాలో ఒక తాత్త్విక, పారమార్థిక పునరుజ్జీవనం జరుగుతుందని ఆశించాడు. ఆ దిశగా ఉత్సాహంతో కొంత కాలం పనిచేసాడు కూడా. అయితే సోవియట్‌ సాహిత్యానికి బెలీ లాంటి రచయితల అవసరం లేకపోయింది. 1932లో సోవియెట్‌ ప్రభుత్వం- రచయితలు సమాజం గురించి వాస్తవిక (రియలిస్ట్‌) శైలిలో మాత్రమే రాయాలనీ, ఆ రచనలనే ఆమోదిస్తామనీ అధికారి కంగా ప్రకటించింది. అంటే అందరూ గోర్కీ ‘అమ్మ’ లాంటి నవలలే రాయాలి. కమ్యూనిస్టు విలువల్ని ఎత్తిచూపాలి. ఫ్యాక్టరీ గొట్టాల్నీ, శ్రామికుల చెమటనీ గొప్పగా చూపించాలి. హేతువుతో సరిపోల్చు కోదగ్గ వాస్తవిక శైలికి ఏమాత్రం దూరం జరిగినా ఆ రచనను బూర్జువా బడాయిగా తీసిపారేసేవారు. ఆ రచయితలకు ఆదరణ లేదు, వారి రచనలు ఎవరూ ప్రచురించరు. ఈ స్థితిని వ్యతిరేకించి రాసినవారిని చంపే శారు. మరికొందరు రాయలేనితనం భరించలేక బతికుండీ నిర్జీవులయ్యారు. బెలీ అదృష్టవశాత్తూ 1934లోనే చనిపో యినా, అతని రచనలు మాత్రం అప్రకటిత నిషేధానికి గురయ్యాయి. అతని రచనలే కాదు; వాటి మీద విమర్శలు గానీ, అతని మీద జీవిత చరిత్రలు గానీ రాయటానికి వీల్లేకుండాపోయింది. మరణం తర్వాత దాదాపు ముప్ఫయ్యేళ్ళ పాటు ఆయన పేరు అటు మాతృభూమిలోనూ, ఇటు బయటి ప్రపంచంలోనూ మరుగునపడిపోయింది.

1965లో ప్రముఖ రష్యన్‌ అమెరికన్‌ రచయిత వ్లదిమిర్‌ నబొకొవ్‌ ఒక అమెరికన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘నా దృష్టిలో ఇరవయ్యొవ శతాబ్దపు వచనంలో అద్భుతమైన మాస్టర్‌పీసెస్‌ ఇవి- జేమ్స్‌ జాయ్స్‌ ‘యులిసెస్‌’, కాఫ్కా ‘మెటమార్ఫసిస్‌’, బెలీ ‘పీటర్స్‌బర్గ్‌’, ఇంకా ప్రూస్ట్‌ ఫెయిరీటేల్‌ ‘ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ఎ లాస్ట్‌ టైమ్‌’లో మొదటి సగం’’ అన్నాడు. అప్పటికే నబొకొవ్‌కు కేవలం ‘లొలిటా’ నవలకు రచయితగానే కాక, తన మాతృభూమి రష్యాకు చెందిన సాహిత్యంపై నిశితమైన పరిశీలన కలవాడిగా గుర్తింపు ఉంది. ఆయనిక్కడ పేర్కొన్న పేర్లలో జాయ్స్‌, కాఫ్కా, ప్రూస్ట్‌లకు అప్పటికే ఆధునిక సాహిత్యంలో విలువైన స్థానం ఉంది. దాంతో వీళ్ళందరి మధ్యనా కొత్తగా ఈ బెలీ ఎవరా అని చాలామందికి కుతూహలం కలిగింది. ఫలితంగా ఆయన రచనల అనువాదాలు మొదలయ్యాయి. అయితే బెలీ బాషను వాడిన పద్ధతి ఆయన రచనల్ని అనువాదానికి లొంగనివిగా చేసింది. జేమ్స్‌ జాయ్స్‌ ‘యులిసెస్‌’ నవలను వేరే భాషలోకి అనువదిస్తే ఎంత సారం పోతుందో, బెలీ ‘పీటర్స్‌బర్గ్‌’ను ఇంగ్లీషులోకి అనువ దించినా అంతే పోతుంది. ఈ రెండు నవలలకు మధ్య భాషపరంగాను, శైలిపరంగాను, పాత్రలపరంగానూ చాలా పోలికలు ఉండటాన్ని విమర్శకులు గమనించారు (బెలీ పుస్తకం ‘యులిసెస్‌’ కన్నా తొమ్మిదేళ్ళ ముందే ప్రచురి తమైంది). ‘యులిసెస్‌’ను ఇంగ్లీషులో రాయటం వల్ల జాయ్స్‌ ఆధునిక సాహిత్యానికి ఆద్యుడుగా గుర్తింపు పొందాడు. అంతే గొప్ప పుస్తకాన్ని రష్యన్‌ భాషలో రాసి బెలీ ఇప్పటికీ ఎవరో కొద్దిమందికి తప్ప తెలియనివాడుగా మిగిలాడు.

(ఆంధ్ర జ్యోతి 'వివిధ'లో)


కోర్ స్పీషీస్

నందు నాలుగో పెగ్గు కలుపుకుని ఆరామ్‌గా వెనక్కి వాలాడు. తన కథల్లోని “నేటివ్ ఎనర్జీ” గురించి టేబిల్ కవతల కూర్చున్న రామారావు సరైన మాటలు అందని ప్రయాసలో మలబద్ధకం మొహంపెట్టి ఏదో చెబుతుంటే వింటున్నాడు. మధ్య మధ్యలో రామారావు తల మీంచి వెనకాల గోడకి తగిలించి వున్న టీవీలో క్రికెట్ మేచ్ వైపూ ఓ లుక్కేస్తున్నాడు. ఎదుట ఓ మనిషి కూర్చుని తన కథల గురించి అంత లోతుగా విశ్లేషిస్తున్నా ఏం పట్టనంత అతీతుడేం కాదు నందు. కానీ అతనికి రామారావు మాట్లాడుతున్నది ఒక్కోసారి ఏం అర్థం కాక ధ్యాస నిలవటం లేదు.

“నీ ఊరూ, నీ జనం, వాళ్ల ఎసెన్సూ... వీటన్నింటినీ... పదేళ్లుగా నువ్వుంటున్న ఈ నగరం నీకిచ్చిన... నీకు చేసిన... పరాయీకరణ అనే గాయంలోంచి, ఆ బాధలోంచి కొత్తగా చూడగలుగుతున్నావ్. అక్కడే నీకు కనెక్టవుతున్నారు పాఠకులు. కానీ నీ కథల్లో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే, నువ్వు చెబుతున్న కథల్నీ, ఆ కథల్లో పాత్రల్నీ అలా నడుచుకునేలా చేస్తున్న అంతఃసూత్రాన్ని నువ్వు పట్టుకోలేకపోతున్నావు. You are missing out on the bigger picture. For example, మొన్న ‘జ్యోతి’లో వచ్చిన కథేమిటది....?”

రామారావు గాల్లో వేళ్ళు రుద్దుకోవటం చూసి నందు కథ పేరు అందించాడు. ఈ సారి శ్రద్ధగా విందామని బల్ల మీదకు వాలాడు.

“ఆ... అదే. ఆ కథ, it’s good, it’s good... కథలో conflictని బాగా ప్రెజెంట్ చేశావు. కానీ నేరేటర్ అన్నయ్యకీ, అతని తండ్రికీ మధ్య ఉన్న ఘర్షణని సింపుల్‌గా అదేదో వొట్టి జెనరేషన్ గాప్ అన్నట్టు తేల్చేసుకుంటూ పోయావు. అలా ఎందుకు జరిగిందంటే- నీకు సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావం, సమాజపు కుదుళ్ళలోకంటా మార్కెట్ చొరబాటు, ఫలితంగా మానవ సంబంధాల మధ్య పరాయీకరణ... వీటన్నింటి పట్లా అవగాహన లేకపోవటం వల్ల. అది ఉండుంటే ఆ తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణకి a whole new dimension తెచ్చి పెట్టగలిగి ఉండేవాడివి. మార్కెట్ అనేది ఎప్పుడూ ఊరకే దాని పని అది చేసుకుంటూ ఊరుకోదు. Mind You! అది సకల మానవ వ్యవస్థల్లోకీ... కుటుంబాల మధ్యకీ, వ్యక్తుల మధ్యకీ చొరబడుతుంది. దానిపై నీకు సరైన అవగాహన లేకపోవటం వల్ల... ఏవో చుట్టుతిరుగుళ్లు తిరుగుతూ ఏవేవో రాసుకుంటూ పోయావు. పెరట్లో వేపచెట్టు మీద ఏకంగా రెండు మూడు పేరాలటయ్యా! మీ ఊళ్లో మంగలాయన గొడవా, ఆయన షాపులో సినిమా పోస్టర్ల గొడవా... ఇవన్నీ కథకి ఏం ఏడ్ చేశాయి?”

“అట్లేం లేద్సార్. అయన్నేం బల్మీట్కి తెచ్చిపెట్టినయ్ గావు. రాశేటప్పుడు యాదికొస్తే మంచిగ అనిపించి రాషిన అంతే.”

“రాయొద్దని అనటం లేదు నందూ. Try to understand me. ఒక పర్పస్ ఉండాలి. ఒక bigger perspective ఉండాలి. ఉదాహరణకి, ఆ మంగలి షాపులో సినిమా పోస్టర్లని నీ కథ ఏ కాలంలో జరుగుతుందో సూచించటానికి వాడుకుని, అక్కడితో వదిలేయచ్చు. మీ స్కూలు దగ్గర చెప్పులు కుట్టే ఆయన గురించి ఒక స్కెచ్ లాగా రాసి వదిలేశావు. అలాకాకుండా తర్వాతి కాలంలో ఊళ్లల్లో కూడా పెద్ద పెద్ద చెప్పుల షోరూంస్ వచ్చేసాకా ఆయన ఏమయ్యాడో చెప్పుండాల్సింది. నిచ్చెన మెట్ల కుల...”

“గాయన ఇప్పుడు అట్లే ఉన్నడు సార్. మంగలాయ్న మాత్రం షాపును మస్తు మాడ్రన్‌గ జేషిండు...”

“నో.. నో... That’s no the point. I’m just saying these are the possibilities. నువ్వు చెప్తున్నది ఒకానొక ఐసొలేటెడ్ రియాలిటీ. మనక్కావాల్సింది రిప్రెజెంటిటివ్ రియాలిటీ. నీ కథలో ప్రతీ పాత్ర, ప్రతీ సంఘటనా ఏదీ రాండమ్‌గా ఉండకూడదు. ఒక విస్తృతమైన సామాజిక వాస్తవానికి ప్రాతినిధ్యం వహించాలి. అందుకోసం కొన్ని మినహాయింపుల్ని పక్కన పెట్టేయాలి.”

“గట్లంటే నా లైఫ్ మొత్తం ‘మినహాయింపు’లెక్కనే ఏడ్శింది సార్. మా బాపు బా నిదానము మనిషి ఉంటుండె...”

“Then you have to transcend your reality అబ్బా! నిన్ను మినహాయించే పరిస్థితుల్ని దాటుకుని ముందుకొచ్చేయాలి. నీ కాన్షస్‌నెస్‌ని... you have to plug it into social reality. సమాజానికి ఎవరూ ప్రత్యేకం కాదు నందూ. ఇప్పుడు మీ నాన్న మనస్తత్వమే తీసుకో... అది అట్లా ఎలా రూపొందింది. ఏ సామాజిక చలన సూత్రాలు, ఏ చారిత్రక శక్తులు ఆయన్నీ ఆయన జీవిత గతినీ ఆవిధంగా మలిచాయి...”

“ప్లానింగ్ సరిగ లేకుండె సార్ ఆయ్నెకు. కాపాయం జేసుడన్న కాన్సెప్టే లేదు. మాకు పానం బాగలేకున్నా, ఇంట్ల ఏదన్నా ఫంక్షన్ గిట్టయినా బైటి నుంచి పైసల్దెచ్చి అప్పటికి పని ఐపోయేటట్టు చూస్తుండె. ఆ రిటైర్మెంట్ డబ్బుల్తోటి అక్క పెళ్ళేమో జేసిండు ఇగంతే. పుర్సత్‌గ కాళ్లు చాపుకుని కూర్సుండు. మనిషి మంచోడు, గదేమంటలే గానీ... మాకు కట్టుకోండ్ర కొడకల్లారా అని మిత్తిలు తప్ప గాయన మిగిల్సిందైతే ఏం లేదు.”

రామారావు తాను ఇందాక చేసిన సైద్ధాంతిక విశ్లేషణనని ఇప్పుడు నందు చెప్పిన పరిస్థితికి అన్వయించాలని చూసాడు. కానీ, నందు కన్న ఒక పెగ్గు వెనకే ఉన్నా, అప్పుడే ఆలోచనలు అరాచకంగా ఒకటి అటంటే ఒకటి ఇటన్నట్టు పోతున్నాయి. సమన్వయించలేక, తోచిన వెంటనే తుర్రుమంటున్న ఆలోచనల కొసల్ని అందుకుని దగ్గరగా తెచ్చి ముడివేయలేక, ఊరికే మొహం నిండా సానుభూతిని ఒక కవళికగా మాత్రమే పులుముకుని “మానవ జన్మంబిది...” అన్నట్టు బుర్రాడిస్తున్నాడు.

“సార్, గిట్ల అడుగుతున్ననని ఏమన్కోవద్దు. మీరిప్పుడు జెప్పిన్రు గదా, గివన్నీ మెన్షన్ జేస్కుంట ఓ మంచి వ్యాసం రాస్తే ఎట్లుంటదంటరు?”

ఈ ఒక్క ముక్కతో రామారావు ఒంట్లోని రాజమండ్రి రక్తంలోకి పేరూ పరపతి లెక్కలన్నీ రెక్కలల్లార్చుకుంటూ వచ్చి వాలాయి. “రాద్దాం రాద్దాం” అన్నాడు గుంభనంగా, గ్లాసు వంక చూసుకుంటూ నవ్వుతూ.

“లే సార్... మీర్రాయాలె. నాకు నమస్తే తెలంగానం ఎడిటోరియల్ల ఒకాయన గీ మద్దెల్నే పరిచయమైండు. మన కతలు నచ్చినయాయినెకు. మీర్రాయుండి సాలు, నేనెట్లన్న పబ్లిష్ చేపిస్త. ఎవ్వల్ విశ్లేషించకుంట మనమిట్ల ఊకె ఎన్ని రాసిన వేస్టు సర్. ఆ వేణుగోపాల్ మొన్న కథ సంకలనం మీద సమీక్ష రాశిండు సూశిర్రా? నా కథ గురించి ఏమన్నడో ఎర్కెనా? శైలి వస్తువుకు మింగేషిందట. జనాకర్షణ ధోరణి కనిపిస్తుందట (జనాలకి చీదర దొబ్బాల్నో ఏందో మరి), హేతువాద మూలాల్ని విడిచి సాము జేశ్న కథనమట. ఇంకేం రాశిండనుకుర్రు? ‘తాము ఎటువైపు నిలబడ్డామన్న అంశంపై స్పష్టత లేని రచయితల్ని ప్రోత్సహించకుండుంటె గదే తెలుగు సాహిత్యానికి సంపాదకులు చేషే మేల’ట. ఓ ఇంక ఎట్లంటె అట్ల ఒర్రిండు. ఆని బాధంత ఎందుకో చెబుత ఇనుర్రి. మొన్న వెంకట కృష్ణ ఇంటికి పోతే ఆయనక్కడ్నే ఉన్నడు. గాయనే గుర్తుపట్టి ‘మిత్రమా మంచిగున్నవా’ అనుకుంటా భుజం మీద గిట్ల చేయేషి ‘నీ కథలూ’ అంటూ మంచిగనే ఏదో చెప్పబట్టిండు. ఆయనెవరో నేను గుర్తువట్టలే. ఐనా అంత సోపతి చూపిస్తున్నడు లెమ్మని ఆయనెవరో నాకు ఎరుకైనట్టే ఏక్ట్ జేస్తున్న. ఆయన్ను నాకు పరిచయం జేసిన బద్మాష్ గాడు గమ్మునుండక ‘సారెవరో తెలుసు కద’ అని అడిగిండు గాయన ముంగట్నే. ఇంకేమంటము. బర్రెలెక్క తల అడ్డంగ ఊపినం. గాయ్నె ఎంటనే ముఖం చిన్నగ వెట్టుకున్నడు. తర్వాతిక నా వైపు చూసి మాట్లాడుడు బంజేశిండు. పోయేటప్పుడు విష్ జేశిన ‘పోతున్నా సార్’ అనుకుంట. ‘ఆ మంచిది’ అని ఏందో ఆయనింట్ల పన్జేయనీకి వచ్చినోనికి చెప్పినట్టు చెప్పిండు. అరే ఏందిర బయ్ గిట్లయింది అని గప్పుడే అనుకున్న. ఇంగ చాన్సు రాంగనే ఏదంటె అది రాసి గబ్బుపట్టిచ్చిండు.”

“మీ తెలంగాణ మేధావే కదయ్యా,” అన్నాడు రామారావు నవ్వుతూ. తెలంగాణవాడూ తెలంగాణవాడూ కొట్టుకుని ఆంధ్రావాడి దగ్గరకు తగూకొస్తే నవ్వినవాడి నవ్వులా ఉందా నవ్వు.

“నా బొచ్చెల తెలంగాణ, యాడుంది సార్. గా అలాయ్ బలాయ్‌లన్నీ  ఉజ్జమంతోటే ఇడ్శిపెట్టినరు. ఇంగ ఇప్పుడంత ఎవ్వలన్న పైకెళ్తున్నరనిపిస్తే ఆని ఎంబటపడి కాళ్లు పట్కొని గుంజుడే మిగిలింది. కొట్కు సస్తుర్రు కొడుకులు.”

“అలా అనొద్దు నందూ. మా వాళ్లతో పోలిస్తే మీ వాళ్లు చాలా బెటర్. నేటివ్ హానెస్టీ ఉంటుంది మీ దగ్గర,” అన్నాడు రామారావు. ఇప్పుడంటే అలా అన్నాడు కానీ, ఎపుడన్నా ఏ ఆటోవాడన్నా, “ఏమన్న! గీడదాక గీడదాక అన్చెప్పి సీదా పటాన్‌చెరు తొల్కబోయేట్టున్నావ్, దిగు ఈడ,” అన్నప్పుడో, ఏ కూరగాయలవాడో “ఏంది పది రూపాయలూ? ఎందుకు సార్ ఉట్టిగనే ఇస్త తీస్కపోరాదు? జరుగు సార్.. సైడుకి జరుగు,” అన్నప్పుడో,  ఎన్నోసార్లు లోపల్లోపలే “ఏనిమల్స్!” అని గొణుక్కున్నాడు.

నందు “ఏమో సార్, ఏం హానెస్టీనో ఏం పాడో,” అనుకుంటూ మందు తెచ్చిన దిగులుతో మిగిలిన ద్రవంలోకి చూస్తూ గ్లాసు తిప్పుతున్నాడు.

రామారావు అతని వైపు మందు తెచ్చిన వాత్సల్యంతో చూస్తున్నాడు. “అన్‌కట్ డైమండ్” అన్న పదం మళ్లీ మెదిలింది అతని మనసులో. అతనీ మధ్య సాహిత్య విమర్శకుడి హోదాలో ఇలాంటి అన్‌కట్ డైమండ్స్ కోసం వెతుకుతున్నాడు. వెతకటం మొదలుపెట్టగానే నందు చప్పున తగిలాడు. ఈ ఏడాది వచ్చిన మంచి కథలతో ఒక సంకలనం తెస్తున్నవాళ్లు ముందుమాట రాయమంటే ఆ పని మీద సంకలనంలోని కథలు చదువుతూ నందూ కథ కూడా చదివాడు. ఏదో “నేటివ్ ఎనర్జీ” కనిపించింది. నందు రాసిన ఇంకొన్ని కథల్ని సంపాయించి చదివాడు. “అన్‌కట్ డైమండ్” అనుకున్నాడు. కానీ కథల్లో కొంత అయోమయం కనిపించింది. “ఇటీవలి సామాజిక ఆర్థిక పరిమాణాల ఫలితంగా తెలుగు సమాజంలో వర్గేతర మార్గాల్లో దారితప్పుతున్న తరంలో కథలు రాస్తున్నాడు కాబట్టి ఆ అయోమయం” అని తీర్మానించుకున్నాడు. దిశానిర్దేశం లేకపోవటం వల్ల కలిగిన దృక్పథ రాహిత్యాన్ని చప్పున పసిగట్టాడు. రామారావుకి యాభయ్యోపడిలోకి వచ్చాకా ఈ “దిశానిర్దేశం” అనే పదం కూడా ఎక్కువగా మనసులో మెదులుతోంది.

“కనీ సీరియస్‌గా ఆలోచించుర్రి సార్ వ్యాసం గురించి. నన్ను ఊ.. ఎత్తుకుంట రాయమని అంటలే. ఏమన్న అనేదుంటే అనుర్రి. కనీ.. మాటలు తిట్టేటియి రెండుంటే, మెచ్చుకునేటియి నాలుగుండాలె. అట్ల బాలెన్స్ జేసుకుంట మీరే రాయగల్రు సార్. సాహిత్యం లోకమంత ‘అరె.. ఎవడ్రబై ఈడు మెంటలెక్కిస్తుండు, అని ఎన్కకు దిరిగి సూడాలె....”

నందు ఈ మాటలు అంటుంటే ఒక వెస్ట్రన్ కంట్రీ బార్ లోకి స్ప్రింగ్ డోర్స్ తోసుకుంటూ కౌబాయ్ గెటప్పులో హేట్ అంచుల కింద నుంచీ చూస్తూ నడిచొస్తున్న నందు ఊహల్లోకి వచ్చాడు రామారావుకి. టేబిల్ మీద చరుస్తూ వెకిలిగా నవ్వాడు. “సాహిత్యంలో నీ గ్రాండ్ ఎంట్రీకి హార్మోనికా వాయించాలన్నమాట....”

“గట్లనే అనుకోర్రి. ఇందాక స్టేజి మీద మాట్లాడిర్రు సూడు. గట్లాంటి మాటలన్ని పడాల వ్యాసంలో. భలే మాట్లాడిర్రు సార్.”

రామారావుకి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాసేపటి క్రితం జరిగిన బుక్ ఫంక్షన్లో తన ప్రసంగం గుర్తొచ్చింది. ముందు వరస కుర్చీల్లో కూర్చున్న శ్రోతల ముఖాలు ఇంకా కళ్ళముందే ఆడుతున్నట్టున్నాయి. వాళ్ళ చప్పట్లు చెవుల్లో వినిపించాయి. లాల్చీ జేబులో ఉపన్యాసం తాలూకు పాయింట్లు రాసి పెట్టుకున్న కాయితాన్ని ఇంకోసారి చూసుకోవాలనిపించింది. జేబులో చేయిపెట్టబోయాడు.

“సార్, గట్ల జేయొద్దు. ఫస్ట్ టైం నా కతల గురించి రెండు ముక్కలైన మంచిగ రాశిర్రు మీరు. ఈ ట్రీట్ నాది...” అన్నాడు నందు.

రామారావు, “సర్లే, ఈసారిక్కానీ,” అని జేబులోంచి చేయి తీసేసాడు.

ఈసారి రామారావు నందు మీద వ్యాసం గురించి ఆలోచించటానికి సిద్ధపడ్డాడు. నందు నిజంగానే తెలంగాణ సాహిత్యంలో ఒక కొత్త గొంతు. ఉద్యమం తర్వాత కథలు రాస్తున్న తరంవాడు. తనే ఒక ఆగమన ప్రకటన లాంటి సాధికారిక వ్యాసం రాస్తే? మందెక్కిన మెదడు కల్లోలంగా అన్నింటినీ గోరంతలు కొండంతలుగా చేసి చూపెడుతోంది. మామూలు స్ఫురణలు కూడా గొప్ప సాక్షాత్కారాల్లాగా తోచడం మొదలుపెట్టాయి. ఎందుకు తానీ ఉభయ తెలుగు రాష్ట్రాల పాలిట ఒక విస్సారియన్ బెలింస్కీనై ఒక దాస్తోయెవ్‌స్కీని పరిచయం చేయకూడదు. కానీ ఈ నందు కథల్లోనివి మరీ కులాసా, తీరుబడి లోకాలు. పోనీ గోర్కీ అందామా అంటే ఆ పేరుని నామినికి వాడేసారు. అయినా నామిని ఆంధ్రా కదా... పాపం తెలంగాణకీ ఓ గోర్కీ అక్కర్లేదా....

ఇంతలో కునుకుతూ ఊగిన మనిషికి పడిపోతున్న భ్రమతో మెలకువ వచ్చినట్టు మందు మత్తులో మునుగుతోన్న రామారావు మెదడు క్షణమాత్రం వాస్తవ తలంపైకి తేలింది. అసలు ఆ స్థాయి వ్యాసానికి నందు మున్ముందు తూగలేకపోతేనో.. అన్న అనుమానం వచ్చింది. కానీ కాబోయే తెలంగాణ మహాకథకుడికి తొలి బాకా ఊదేవాడు మళ్ళీ ఒక ఆంధ్రావాడే కావటమన్న ముచ్చటైన ఊహ నిలవనీయలేదు. నందు కూడా స్కీమ్ ఆఫ్ థింగ్స్ నుంచి జారిపోయాడు. నందూ కాకపోతే ఇంకో తెలంగాణ కథకుడు... అలాంటి వ్యాసం మాత్రం రాయాలనుకున్నాడు.

నందు “ఇగో తమ్మీ, బిల్ తీస్కరా,” అని పిలిచాడు. అక్కడ ఓ స్తంభానికి జారబడి చేతులు కట్టుకుని గోళ్ళు కొరుక్కుంటున్న ఒక కుర్రాడు అయిష్టంగా అన్నట్టు ముందుకు కదిలాడు.

ఏ టేబిల్ దగ్గర ఆ టేబిల్‌దే ప్రపంచమన్నట్టు ఉంది బార్. ఆ అబ్బాయి బిల్ తెచ్చి పెట్టాడు. ఎంగిలి ప్లేట్లూ, ఖాళీ గ్లాసుల మధ్య.

నందు పైసలు లెక్కపెడుతుంటే రామారావు ఆ అబ్బాయి వంక చూస్తున్నాడు. “ఏం చదువుతున్నావమ్మా,” అన్నాడు.

నీకెందుకన్నట్టు ముఖం పెట్టి, “డిగ్రీ జేషిన,” అన్నాడు ఆ అబ్బాయి.

“మరి ఇక్కడేం చేస్తున్నావయ్యా, ఇంకా చదువుకోకుండా?”

నందుకి ఈ సంభాషణ ఇబ్బందిగా అనిపించి పైసలు వెంటనే లెక్కపెట్టి ఆ అబ్బాయికి ఇచ్చేశాడు.

ఆ అబ్బాయి ఇలాంటి టేబిల్స్ ఎన్నో చూసి వున్నాడు కాబట్టి సమాధానం ఇవ్వకుండా డబ్బు లెక్కపెట్టుకున్నాడు.

నందు, “ఛేంజ్ ఉంచుకో,” అన్నాడు.

“మీ నాయన ఏం చేస్తాడు,” మళ్ళీ అడిగాడు రామారావు.

ఆ అబ్బాయి టిప్పు ఎంతో లెక్క చూసిన ప్రసన్నతతో, “ఎందుకడుగుతుర్రు సార్,” అన్నాడు నవ్వుతూ.

“తెలుసుకుందామనీ. మీరు ఒక తరం అయ్యా. ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన తరం. ఇలా వెనక మిగిలిపోయినవాళ్ళకి మందు పోయాల్సిన తరం కాదు. ఎవ్రీ ఒన్ ఆఫ్ యూ హేవ్ ఎ పొటెన్షియల్,” అన్నాడు.

నందు ఆ అబ్బాయి వంక చూస్తున్నాడు. ఆ అబ్బాయి తన కన్నా బహుశా ఒక పదేళ్ళు చిన్నవాడు. పదేళ్ళ క్రితం నందు ఒక పెద్ద స్టీల్ సామాన్ల షాపులో పని చేశాడు. అపుడు రామారావు లాంటి కస్టమర్లని కౌంటర్కి అటువైపు నుంచి డీల్ చేసిన అనుభవం ఉంది. ఇపుడు రామారావు గురించి ఈ అబ్బాయి ఏమనుకుంటూ ఉంటాడో నందుకి తెలుసు.

“సార్ పదండి, టైమైతుంది,” అంటూ లేచి, “మంచిది తమ్మీ,” అన్నాడు ఆ అబ్బాయిని ఇక వెళ్ళమన్నట్టు.

టేబిల్స్ దాటి బయటకు వచ్చాకా రామారావు నందు భుజం మీద ఆసరాగా చేయి వేశాడు. ఇద్దరూ చీకటి గుయ్యారంలా ఉన్న మెట్లు దిగుతున్నారు.

“నాకు వీళ్ళని చూస్తే చాలా జాలిగా ఉంటుందయ్యా. వీళ్ళంటే ఇలా బార్లలో పని చేసేవాళ్ళని కాదు. ఈ దేశంలో అసంఘటితంగా ఉన్న ఈ పీడిత వర్గ సభ్యుల్ని ఎవర్ని చూసినా సరే, నాకు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. వాళ్ల జీవితాలేంటీ, చుట్టూ నెలకొన్న ఆర్థిక సామాజిక పరిస్థితులేంటీ, ఆ ప్రభావాల్ని వాళ్ళు ఏమేరకు గ్రహించగలుగుతున్నారూ... ఇవన్నీ మాట్లాడించి రాబట్టాలని ఉంటుంది. అణచివేత నుండి సహజంగా రగలాల్సిన వర్గస్పృహ వీళ్ళల్లో ఏ చీకటి మూలల్లో ఆక్సిజన్ అందకపోవటం వల్ల అలా రాజుకోకుండా నివురుగప్పి ఉండిపోయిందో, ఎందుకు వీళ్ళిలా అన్నీ ఒప్పుకుని ఒక resigned state లోకి వెళిపోతారో కనుక్కోవాలని  ఉంటుంది. I want to know the pulse of history. నిజానికి ఇదంతా ఒక కథారచయితగా నువ్వు, అంటే ఐ మీన్ నీలాంటివాళ్ళు చేయాల్సిన పని. You have to tap into their lives with your pen boss! వీళ్ళందర్నీ కలిపికుడుతున్న దారం, వీళ్లు గ్రహించని ఉమ్మడి వర్గ పునాది... దాన్ని నువ్వు పట్టుకోవాలయ్యా... మనం ఆ స్థానంలో ఉన్నాం, ఆ స్థాయిలో ఉన్నాం... సాహితీకారులుగా... మనం వీళ్ళని నడిపించాలి ముందుండి, ఆ బాధ్యత మన మీద ఉంది... Because we are the chosen ones, we are the core of this species...”

మెట్టు దిగుతున్నప్పుడల్లా భుజం మీద నొక్కినట్టు పడుతున్న రామారావు బరువుని ఫీలవుతూ, అతని మాటల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు నందు. తర్వాత రామారావుని గుమ్మం దగ్గర వదిలి బండి తేవటానికి పార్కింగ్ సెల్లార్లోకి వెళ్ళినప్పుడూ ఇవే ఆలోచనలు. తన జీవితం గురించీ, తన చుట్టూ “నెలకొన్న ఆర్థిక సామాజిక పరిస్థితుల” గురించీ, తన మీద “వాటి ప్రభావం” గురించీ ఆలోచించటానికి ప్రయత్నించాడు. ఎందుకో కొన్ని దృశ్యాలూ, మనుషులూ, సన్నివేశాలూ-- తన తక్షణ జీవితంతో సంబంధం ఉన్నాయని అనిపించేవి-- చప్పున గుర్తొచ్చాయి. తను ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్న కార్ల కంపెనీలో ఇవాళ మధ్యాహ్నం కొలీగ్స్‌తో చేసిన లంచ్ గుర్తొచ్చింది. అకౌంట్స్ అసిస్టెంట్ వెంకట్రావు వాళ్ళ బావ కోసం ఒక సెకండ్ హాండ్ కారు పక్కకు తీసి ఉంచమని రిక్వెస్ట్ చేసాడు. వాళ్ళ బావకి ఆంధ్రాలో ఏదో ఊళ్ళో రెండు సెల్ రిపేరు షాపులున్నాయి. నందూ, వెంకట్రావూ కలిసి ఆ తర్వాత లంచ్ చేస్తూ తెలంగాణ, ఆంధ్ర పల్లెటూళ్ళ గురించి మాట్లాడుకున్నారు. వెంకట్రావు వచ్చే వారం తన ఊళ్ళో అమ్మోరి సంబరం బాగా జరుగుతుందనీ, తనతో పాటు రమ్మనీ పిలిచాడు. ఎలాగూ బావకి కారు ఇవ్వటానికి వెళ్తాడు కాబట్టి అదే కార్లో తనతో వచ్చేయమన్నాడు. అలాగే మొన్న వారం చందనతో కలిసి సిద్దిపేట దగ్గర పెళ్ళికి వెళ్ళినప్పటి సంగతులు కొన్ని గుర్తుకువచ్చాయి. కృష్ణగాడితో చెట్టుకింద మాట్లాడుతుంటే గదిలోకి గబగబా నడిచివెళ్తున్న చందన ముఖం చూసి ఏదో అయిందని అర్థమై ఆమె వెనకే గదిలోకి నడిచి వెళ్ళాడు. పుస్తెల తాడు గురించి వదినె ఏదో అన్నదని చందన తనను పట్టుకుని ఏడ్చింది, ఓదార్చాక తన అసమర్థతనే ఎత్తి చూపి తిట్టింది. నందుకి తన అక్క కూడా గుర్తొచ్చింది. గల్ఫ్కి వెళ్ళిన బావ తిరిగిరాకుండా అక్కడ వేరే అమ్మాయిని తగులుకొని అక్కని విడాకులియ్యమని ఏడిపించటం, ఇక్కడ అక్కేమో పిల్లాడి ఫీజు కోసం స్కూలు వాళ్ళతో గొడవపడటం, ఒక్కసారి తనను వచ్చి ప్రిన్సిపాల్‌తో మాట్లాడమనటం... ఇవన్నీ గుర్తొచ్చాయి. అలాగే అస్తమానం ఎడం చెయ్యెత్తి చంకలో గోక్కునే ఇంటి ఓనరూ, కామన్ బాత్రూంని రోజిడిచి రోజు చందనే కడగాలని షరతు పెట్టిన బొల్లి ముఖం ఓనరమ్మ, “మీరు జిమ్ చేస్తారా” అనడిగి నరాల్ని జివ్వుమనిపించిన ఫ్రంటాఫీస్ మల్లికా మేడమ్, ఐదేళ్ళుగా పిల్లల్లేక సెమన్ అనాలసిస్ కోసం ఇంట్లో ఎవరికీ తెలీకుండా సిటీకొచ్చిన ఫ్రెండ్ మల్లేష్ గాడు, వాడు చెప్పాపెట్టకుండా ఊరొదిలి ఎందుకొచ్చాడని ఫోన్లో కంగారుపడిన వాళ్ళ నాయన, ఊళ్ళో కొత్తగా పెట్టిన జ్యూస్ సెంటరు అన్‌సీజన్లో కూడా బానే నడుస్తోందని ఆయన పడ్డ సంతోషం... ఇలా కాలంలో చేరువైన, మనసుకు దగ్గరైన కొన్ని దృశ్యాలు నందు మనసులో కలగాపులగంగా తిరిగాయి. వీటన్నింటినీ రామారావు చెబుతున్న మాటలతో అన్వయించటానికి ప్రయత్నించాడు. కథలుగా రాయదగ్గ మనుషులనిపించే వీరందరినీ, కథలుగా రాయదగ్గ విషయాలనిపించే వీటన్నింటినీ కలిపే అంతస్సూత్రం ఒకటి వుంటుందా, నిజంగా, రామారావు అంటున్నట్టు? ఈ మనుషుల్లోనూ, విషయాల్లోనూ తను చూసే వింత అందాన్నీ, కళ్ళుచెదరగొట్టే వైవిధ్యాన్నీ దేన్నీ మినహాయించకుండా కలుపుకునే అంతస్సూత్రం... అదేంటో తెలుసుకుంటే జీవితం మీదా సాహిత్యం మీదా అవగాహన పెరుగుతుందా, చీకటి గదిలో కరెంటు వచ్చినట్టు అయోమయాలన్నీ విశదమైపోతాయా? జీవితం ముందు ప్రశ్నార్థకం మొహం వేసుకుని నిలబడకుండా అన్ని విషయాల్నీ, లోతుపాతులతో సహా, వ్యాఖ్యానించగలడా?

కానీ ఇలా జీవితాన్ని సాక్ష్యంగా తెచ్చి నిలబెట్టేసరికి రామారావు వాడిన బరువైన మాటలన్నీ డొల్లగా, ఊరకే నోటితో చేసిన చప్పుళ్ళలాగా అనిపించాయి. అతను చరిత్ర అంటున్న దానితో సంబంధం లేని, ఒకవేళ ఏ కాస్తో సంబంధమున్నా దానికి అతీతంగా ఇదీ అని చెప్పలేని సొంత చైతన్యమేదో తొణికిసలాడే ప్రపంచమే నందుకి తన చుట్టూ పట్టించుకోదగిందిగా, రాయదగిందిగా అనిపించింది. రామారావు కూడా ఆ ప్రపంచంలో ఒకానొక లక్కపిడతలాంటి ముచ్చటైన భాగంలా అనిపించాడే తప్ప, ఆ ప్రపంచాన్ని వ్యాఖ్యానించగలిగే దేన్నో లోపల దాచుకున్న గంభీరమైన మనిషిలాగేం కనిపించలేదు. కానీ రచయితగా పేరు తెచ్చుకోవాలంటే మాత్రం రామారావు మాటల్లో వినిపించే విషయాల గురించి తెలుసుకోవటం ముఖ్యమని అనిపించింది.

నందు బండి పైకి తెచ్చేసరికి రామారావు ఫోనులో మాట్లాడుతున్నాడు. “అంతా డ్రా చేసేయకు తల్లీ! నెక్స్ట్ మంత్ మమ్మీ శాలరీ రాగానే నీకెందుకు నేను తీసికెళ్తాగా. రేయ్ నానా...” అంటున్నాడు. నందు ఆ మాటలు వింటూ-- ఖరీదైన బట్టల షాపులోనో, ఫాన్సీ హేండ్ బేగుల షాపులోనో ఫ్రెండ్స్ నుంచి కాస్త పక్కగా వచ్చి తండ్రితో ఫోన్ మాట్లాడుతున్న ఒక జీన్స్ ఫాంట్ అమ్మాయిని ఊహించుకున్నాడు. ఈ కనిపించే ముసలాడికి చేరువగా, అన్నీ పంచుకునే అలాంటి మార్దవమైన ఆడ ప్రపంచం ఒకటి ఉందంటే ఇతనిపై ఎందుకో ఒక గౌరవం కలిగింది. రామారావు ముఖాన్ని బట్టి ఆ అమ్మాయి రూపాన్ని ఊహించే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ఎపుడైనా తనకు పరిచయం అవుతుందా అని ఊహించాడు. పెళ్ళవక ముందు మావయ్య కన్నుగప్పి తనతో కరీంనగర్‌కి సినిమాలకు వచ్చిన చందన గుర్తొచ్చింది.

రామారావు ఫోన్ ఆపి వచ్చి బండెక్కాడు. వాళ్ళ అమ్మాయి గురించి మురిపెంగా ఏదో చెబుతున్నాడు. నందూ అది వింటూ బైక్‌ని పార్కింగ్ సెల్లార్ లోంచి వేగంగా రోడ్డు మీదకు తెచ్చాడు. అప్పుడే వాళ్ళని దాటిన ఆటో ఉన్నట్టుండి ఆగితే నందు బ్రేక్ వేయటం వేశాడు, కానీ బైక్ వెళ్ళి ఆటో వెనక గట్టిగా గుద్దింది. ఆటో చక్రం కొద్దిగా పైకి లేచి కిందపడింది. వాలిపోతున్న బైక్ని నందు కాళ్ళతో కష్టం మీద ఆపాడు, రామారావు గెంతి పక్కన నిలబడ్డాడు.

ఆటోవాడు అట్నుంచి దిగి వచ్చి ఆటో వెనక భాగం చూసుకున్నాడు. లైట్ చితికిపోయి, అక్కడ కొంచెం సొట్టపడింది.

“అరె ఔలాగా కళ్ళు దొబ్బినయ్యా రా! తాగి నడుపుతున్నవా బండి?”

నందు సారీ చెప్పబోయినవాడే ఈ మాటలు విని మనసు మార్చుకున్నాడు. “నిన్నెవడు బే సడెన్‌గా ఆపమంది. వెనక బళ్ళొస్తే చూస్కోవా?” అన్నాడు.

బార్లో తాగుదామని వచ్చినవాళ్ళు కావచ్చు, ఇద్దరు ఆటో వెనక నుంచి దిగి గొడవ చూస్తున్నారు.

“అరె లంజొడ్కా... ఎన్కలంత సొట్టవడేటట్టు గుద్ది మళ్ళీ ఏందిర ఎగస్ట్రాలు మాట్లాడుతున్నవ్,” అంటూ ముందుకొచ్చాడు ఆటోవాడు. ముందుకొచ్చి అప్పుడే నందు బండి పైకి లేపి కిక్ కొట్టబోతుంటే దాని కీ ఆఫ్ చేసాడు.

నందు ఆటోవాడ్ని దెబ్బలాటలో గెలవగలనా లేదా అని చూస్తూ, సీరియస్గా “చెయ్ తియ్ రా,” అన్నాడు.

ఆటోవాడు తాళం కీహోల్ లోంచి బయటికి లాగనే లాగాడు.

నందు ధడేల్మని స్టాండ్ వేసి అతని మీదకు వెళ్ళబోతోంటే, రామారావు చప్పున మధ్యలోకి వచ్చి కలగచేసుకున్నాడు. ఆటోలో దిగిన ఇద్దరూ కూడా మధ్యలోకి వచ్చారు.

రామారావు “నువ్వాగు నందు!” అని గట్టిగా అరిచి, ఆటోవాడి వైపు వెళ్ళి భుజం మీద చనువుగా చేయి వేసి అటు తిప్పబోయాడు, “మిత్రమా,” అంటూ.

ఆటోవాడు అటు తిరగలేదు సరికదా, చేయి విదిలించుకుని రామారావు దవడ మీద ఠాప్ మని కొట్టాడు. అసలే తాగివుంటంవల్ల రామారావుకి బాలెన్స్ బాలేదు. పైగా ఆ దెబ్బకి కళ్ళ ముందు ఒక్కసారి అంతా ఆరిపోయి నట్టనిపించింది. రెండడుగులు వెనక్కి తడబాటుగా వేసి ఫుట్పాత్‌కి తగులుకుని దాని మీద కూలబడ్డాడు.

నందు ఆటోవాడి మీదకెళ్ళబోతుంటే, ఆటో దిగిన ఇద్దరిలో ఒకరు ఆటోవాడ్ని, ఒకడు నందుని పట్టుకుని ఆపారు.

ఆటోవాడు “మాన్ హాండ్లింగ్ చేస్తుండు సార్,” అంటున్నాడు.

నందు విదిలించుకోవటానికి నామమాత్రం ప్రయత్నం చేస్తూ కొన్ని బూతులు తిట్టాడు. అప్పటికే జనం ఆగి చూస్తున్నారు. కొంతమంది రోడ్డుకి అటుపక్క నుంచి పరిగెడుతూ రోడ్డు దాటుతున్నారు. నందు వెంటనే పట్టు విడిపించుకుని ముందుకెళ్ళి ఆటోవాడి చేతిలో బండి తాళం లాక్కున్నాడు.

“సార్ పాండి,” అని కిక్ కొట్టి చేయి అందించాడు. రామారావు కష్టం మీద లేచి వెనక కూర్చున్నాడు. ఆటోవాడు తనను పట్టుకున్నవాళ్ళని విడిపించుకుని వెనక పరిగెడుతుండగానే నందు బండిని స్పీడుగా పోనిచ్చాడు.

రామారావు కాస్త దూరం వరకూ వెనక పరిగెడుతున్న ఆటోవాడ్ని చూసాడు. తర్వాత తల తిప్పేసుకున్నాడు.

కాసేపటిదాకా ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.

“గట్టిగ తాకిందా సార్?”

“లేదబ్బా”

“లంజొడుకు ఊకె మీదకొస్తుండు. ఆగి తన్నేదుండె కనీ, మనం తాగినం కద. జనం మనల్నే అంటరు. అందుకే పోనిచ్చిన.”

“ఫర్లేదులే నందు. వాడ్ని మాత్రం ఏమనగలం. It’s a form of alienation. ఈ సమాజం అలా చేస్తుంది వాడ్ని. మానవత్వం నుంచి దూరంగా తరిమేసి... అలా ఒక ఏనిమల్ లాగ,” అన్నాడు రామారావు సలుపుతున్న దవడ నిమురుకుంటూ. 

July 9, 2018

మార్సెల్ ప్రూస్ట్ (1871-1922) పరిచయం: పోగొట్టుకున్న కాలాన్ని వెతుక్కొంటూ...

 పశ్చిమ దేశాల సాహిత్యంలో ఏ విమర్శకుడైనా జ్ఞాపకం (మెమొరీ) గురించి ఏదైనా మాట్లాడదల్చుకుంటే ఒక్కసారైనా ప్రూస్ట్‌ని తలచుకోవాల్సిందే. అలాగే జ్ఞాపకాల ఆధారంగా రాయదలచ్చుకున్న ఏ రచయితైనా ప్రూస్ట్‌ని అప్పటికే చదివుంటే ఆ ప్రభావంతో పెనుగులాడాల్సిందే. ప్రూస్ట్‌ జ్ఞాపకాన్ని ఇతివృత్తంగా తీసుకుని మొత్తం జీవితాన్నే మరలా పేజీ మీద ఆడించినంత పని చేసాడు. ఆ ఆటను బూతద్దంలో చూసినంత దగ్గరగా చూపించాడు. అయితే ప్రూస్ట్‌ ఉద్దేశంలో, తలచుకుంటే స్ఫురించే జ్ఞాపకాలకు పెద్ద విలువ లేదు. అలాగాక, ఏదో బయటి ప్రభావం వల్ల అనుకోకుండా మనలో పునర్జీవితమై గతాన్ని పూర్ణసారంతో సాక్షాత్కరింపజేసేదే విలువైన జ్ఞాపకం. దీన్ని ‘ఇన్‌వాలంటరీ మెమొరీ’ అన్నాడాయన. అంటే అప్రయత్నంగా తట్టే జ్ఞాపకం. మొదటి రకం జ్ఞాపకం మహఅయితే గతంతో ముడిపడివున్న స్థల కాలాదుల్ని దృశ్య రూపంలో స్ఫురింపజేస్తుంది. కానీ రెండో రకం జ్ఞాపకం మాత్రం గతాన్ని అనుభవించినప్పటి తీవ్రతతోనే స్ఫురింపజేస్తుంది. ఈ తరహా జ్ఞాపకాలు అసలు మనలో ఉన్నాయని కూడా మనకు తెలీదు. మనం కూర్చుని గుర్తు చేసుకుందామని ప్రయత్నిస్తే అవి గుర్తు రావు. గతంతో సంబంధం ఉన్న ఏదో వాసన సోకినపుడో, ఎప్పుటిదో ఒక రుచి మరలా నాలికపై తాకినపుడో, ఒకప్పుడు బాగా ఎరిగుండి తర్వాత మరచిపోయిన వైనమేదో దృశ్యంగా కనులకు తారసిల్లినపుడో... అప్పుడు ఆ జ్ఞాపకం ఒక మెరుపులా మన అంతరంగ గగనంపై వెలుగుతుంది. వర్తమానం మాయమైపోతుంది. కాలాల అవతల్నించి ఎవరో పిలిచినట్టు ఒక్క క్షణం అయోమయంలో పడతాం. గతం తాలూకు అసలైన సారం ఈ ‘ఇన్‌వాలంటరీ మెమొరీ’లోనే ఉంటుందంటాడు ప్రూస్ట్‌. మనిషి మానసిక ప్రవృత్తిలో ఎంతో ముఖ్యమైన ఈ అంశాన్ని ఎత్తిచూపింది ఎవరో సైకాలజిస్టు గాక, ఒక రచయిత కావటం ఆశ్చర్యం.

‘ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ఎ లాస్ట్‌ టైమ్‌’ (పోగొట్టుకున్న కాలాన్ని వెతుక్కొంటూ..) అనే ప్రూస్ట్‌ ప్రసిద్ధ నవలలో నేరేటర్‌ ఒక మధ్యాహ్నం టీ తాగుతూ, ‘మేడెలేన్‌’ అని ఫ్రెంచ్‌వారు పిలిచే ఒక రకం కేకు ముక్కని టీలో నంజుకుంటాడు. ఆ కేక్‌ రుచి నాలిక మీద తగలగానే బాల్యంలో అదే కేకును తన బంధువు ఒకావిడ ఇంట్లో తినటం గుర్తొస్తుంది. దాంతో పాటే బాల్యపు జ్ఞాపకాలు, అది వరకూ తనకు గుర్తులేనివి, ఒక ఉధృతిలాగా నేరేటర్‌ని ముంచెత్తుతాయి. అలా మొదలవుతుంది ఏడు సంపుటాల ఈ బృహత్‌ నవల. ‘‘గతాన్ని గుర్తు తెచ్చుకోవటమనేది ఒక వృథా ప్రయాస. అందుకోసమై మన బుద్ధి చేసే ప్రయత్నాలన్నీ ఎప్పుడూ విఫలమే అవుతాయి. మన గతం అంతా మన బుద్ధికి అందకుండా ఏదో బయటి వస్తువులో, ఆ వస్తువు మన గ్రహణేంద్రియాలకు ఇవ్వగల స్ఫురణలో దాగి వుంటుంది. ఆ వస్తువు మనకు తారసిల్లుతుందా లేక ఈలోగానే మనం చనిపోతామా అన్నది మన చేతుల్లో లేదు’’ అని అంటాడు నేరేటర్‌, ఈ మేడెలేన్‌ కేకు గురించి. ఇలా కాలాన్ని దాని అంతస్సారంతో సహా పట్టుకోగలిగే శక్తి మరలా ఒక్క కళకు (ముఖ్యంగా సాహిత్యానికి) మాత్రమే ఉన్నదన్నది ప్రూస్ట్‌ అభిప్రాయం.

మార్సెల్ ప్రూస్ట్‌ (Marcel Proust) ఫ్రాన్సులో సంపన్న కుటుంబంలో పుట్టాడు. డాక్టరైన తండ్రితో పెద్దగా అనుబంధం లేదు. తల్లికి మాత్రం చాలా చేరువ. చిన్నతనం నుంచీ ఉబ్బసం వ్యాధి వల్ల అర్భకంగా పెరిగాడు. హోమో సెక్సువల్‌ అని చాలామందికి అనుమానం. యవ్వనాన్నంతా ఆ రోజుల్లో సంపన్న కుటుంబాలు తరచు ఇచ్చి పుచ్చుకునే విందు వినోదాల్లో పాల్గొంటూ ఖర్చు చేసేసాడు. ఇరవై నాలుగేళ్ళ వయస్సులో ఎంతో ఆర్భాటంగా చాలా ఖర్చుతో మొదటి పుస్తకాన్ని ప్రచురించాడు. అయితే అది అతనికి పేరు తేలేదు. తర్వాత తనదైన కళా దృక్పథం ఏర్పరుచుకొనే ప్రయత్నంలో పదేళ్ళ కాలాన్ని చదవటానికీ, చిత్రకళని ఆస్వాదించటానికీ ఖర్చు చేసాడు. జాన్‌ రస్కిన్‌ కళా సిద్ధాంతాలు అతన్ని బాగా ప్రభావితం చేసాయి. ఇంటిపట్టున తల్లిదండ్రుల నీడలో జీవితం సాఫీగా సాగిపోతున్న సందర్భంలో 1903లో తండ్రి, 1905లో తల్లి చనిపోయారు. తల్లి చనిపోయిన విషాదం అతన్ని చాలా ఏళ్ళ పాటు పీడించింది. 1909లో ముప్ఫై ఎనిమిదేళ్ళ వయస్సులో తన ప్రసిద్ధ నవల ‘ఇన్‌ సెర్చ్‌...’ను మొదలుపెట్టాడు. 51 ఏళ్ళ వయస్సులో చనిపోయే వరకూ ఈ నవల రాస్తూనే వున్నాడు. 1913లో మొదటి సంపుటం ప్రచురితమైంది. ఈలోగా అతని ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. నవల రాయకుండానే చనిపోతానేమోనన్న భయంతో చివరి మూడేళ్ళూ తనను తాను ఒక గదిలో బంధించుకున్నాడు. బయటి నుంచి శబ్దాలు వినిపించకుండా బెండు అమర్చిన గోడలతో కట్టిన గది అది. అన్నపానాదులు సమకూర్చి పెట్టడానికి ఒక హౌస్‌కీపర్‌. పగలంతా పడుకుని రాత్రుళ్ళు మేల్కొని తన నవల రాశాడు. మామూలుగా రచయితలు చిత్తుప్రతిని సాఫుచేస్తున్నప్పుడు అనవసరమనిపించి కొంత తీసేస్తారు. కానీ ప్రూస్ట్‌ మాత్రం అంతకంతకూ పెంచి రాసే వాడు. అలా పెంచిన వాక్యాల్ని వేరే కాగితాలపై రాసి వాటిని జత చేయాల్సిన చోట అంటించేవాడు. ఇలాంటి అంటింపులతో ఈ నవల ముద్రణలో మూడు వేల పేజీలకు పైగా చేరింది. నవల చివరి కొన్ని సంపుటాలు ఇంకా సరిదిద్దుతూనే చనిపోయాడు. ఇంతకీ ఈ నవల్లో కథ ఏమిటి? ఈ నవల రాయగల స్థాయికి ప్రూస్ట్‌ (నేరేటర్‌) చేరుకోవటమే నవల్లోని కథ. ఒక్కోసారి పేజీ కూడా దాటేసేంత పొడవుండే ప్రూస్ట్‌ శైలికి పాఠకుడు అలవాటు పడటం కష్టం కాని, అలవాటైతే ఇదే సాహిత్యం చేరగల అవధి ఏమోననిపిస్తుంది.

చాన్నాళ్ళ క్రితం ఒక వెబ్‌సైట్‌ ప్రూస్ట్‌ జీవితాన్ని రెండు మూడు వాక్యాల్లో కుదించి చెప్పమని ఒక పోటీలాగా పెట్టింది. అందులో ఒకరు ఇలా రాశారు: ‘‘జీవితమంతా విందు వినోదాల్లో వృథా చేసుకున్నాడు. చివర్లో వృథా అయిన రోజుల గురించి ఒక పెద్ద నవల రాసి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు’’.

(ఆంధ్రజ్యోతి 'వివిధ'లో...)



January 30, 2018

నరాలు

ఏడ్చినంతా ఏడ్చి ఊరుకోవాలని
కొండంచు మీంచి కన్నీటి పరవళ్ళు తొక్కాలని
కానీ కొండ చాలా ఎత్తు
ఎక్కటంలో పడి
ఏడుపు సంగతి మర్చిపోనూవచ్చు
ఉన్నచోటే కూచుని ఏడుద్దామంటే
ఉట్టి నిట్టూర్పులే వస్తాయి

January 21, 2018

(a smutty poem)

|| a smutty poem
about the first days of lovemaking ||

ఆ గదికి గోడలున్నాయని తల్చుకుంటే తప్ప గుర్తుకు రాదు,
నీకేమో కొండకొమ్మున వంగి లోయలో పూలను చూస్తున్నట్టు
ఆమెకేమో పడగవిప్పిన పాముకింద పడక సర్దుకున్నట్టు

తామరతూడు చిదిమితే వేళ్ళ మధ్య నలిగే సుఖం
పక్కదుప్పట్ల పరవళ్ళలో సమసిన శ్వాసలు

పడిగాపుల్లో గునిసి నలిగిన బట్టలకు
అప్పుడిక చీర లుంగీగా మారినా,
షర్టు జాకెట్టయినా సంతోషమే

గెలుపు గీరతో నిల్చున్నప్పుడు
ఛాతీ మీద ఆమె చూపులు గుచ్చే పతకాలు

కిటికీ అద్దం మీద ఊపిరి ఆవిర్లను
తుడిచి చూస్తే, అటేపుండాల్సిన సూర్యుడు
ఇటేపెప్పుడు జారుకున్నాడో తెలీక,
మీ పొద్దెరగని మొహాలూ మీరూను

ఈ వివశ సౌందర్య ప్రపంచమొకటి
ఉందనే తెలీని బైటి లోకం మీద
తెరలు మూసేసి మళ్ళీ

రక్తపు గోడల గుడిలోనూ బెదరని మోహంతో
నువు చేసిన పెను పూజలు

మళ్ళీ రాజుకునే లోపు, విప్పిపరచిన దేహ పటాల
మీద వాలి, తప్పించుకునే పుట్టుమచ్చల్ని వేలి
కొసల వెంటాడుతూ, తగిలిన దెబ్బల మిగిలిన
మచ్చలు చెప్పించుకునే చరిత్రలు వింటూ...

ఏమవుతారో మీ ఇద్దరూ చివరికి ఈ
దేహపాలిత ప్రపంచం మత్తు వొదిలాకా...
చెదిరిన జుట్టులో వడలిన కనకాంబరాల్ని దులుపుకొని ఆమే
కడుపు మడతల వెనుక కప్పెట్టిన ఆకలిని పట్టించుకొని నువ్వూ
గడప దాటాకా, మొద్దుబార్చి కసి తీర్చుకునే కాలంలోకి వెళ్ళాకా....