May 7, 2011

అమీనా – రీడింగ్ నోట్సు

రచయితగా చలం శక్తిని పరిపూర్ణంగా చూపించే నవల ‘అమీనా’. కొన్ని పేజీల్లో అయితే చలం తన సాహిత్యమంతటిలోనూ మరెక్కడా సాధించలేని ఉన్నతమైన స్థాయిని అందుకున్నాడనిపిస్తుంది. చలం పుస్తకాల్లో ఇదో వింత పుస్తకం. మిగతా వాటితో కలవని పుస్తకం.

‘అమీనా’లో చలం నిజజీవితం ఎక్కువ. ముఖ్యపాత్ర అమీనాతో సహా చాలా పాత్రలకు వాస్తవమైన మనుషులే ఆధారం. కథ కూడా జరిగిందే. కానీ చలం కొంత మార్చి కొంత అటుదిటు చేసి ఏమారుస్తాడు. యిందులో నిజం ఎంత కల్పన ఎంత అనేవి శాతాలు నిర్ణయించి ఖచ్చితంగా విభజనరేఖ గీయలేము. యేది నిజమో యేది కల్పనో, ఆ రోజుల్లో ఆ రాత్రులలో ఆ పేజీల మీద ‘అమీనా’ కథ రాసిన చలానికి తప్ప ఎవరికీ తెలియదు. అది మనకు అనవసరం కూడా. వేరే రచయితలతో పోల్చి చలంలో కల్పనా శక్తి తక్కువని తీర్మానించడానికి ఈ అంశం తోడ్పడుతుందేమో. కానీ ఒకసారి రాసి బయటకు వదిలేసాకా ఆ రచన రచయితను దాటి వచ్చేస్తుంది. అతనితో నిమిత్తాన్ని వదిలించుకుని తనదైన ఉనికిని ఏర్పరుచుకుంటుంది. అది యిక వ్యక్తిగా రచయితకు చెందదు, వ్యవస్థగా సాహిత్యానికి చెందుతుంది. చదివినపుడు పాఠకునికే చెందుతుంది. కాబట్టి రచయిత ఏది కల్పనాశక్తితో రాసాడు, ఏది జీవితంలోంచి తీసి రాసాడు అనేది పాఠకులుగా మనకు అనవసరం. దాని ఆధారంగా పుస్తకం విలువను నిర్ధారించడం అసమంజసం.

నేపథ్యం:

కానీ ‘అమీనా’ కథ వెనుక నిజజీవిత నేపథ్యం తెలుసుకోవడం ఒకందుకు అవసరం. ఇందులో కన్పించే వాతావరణం తెలుగు కథల సగటువాతావరణానికి బహుదూరం. పాత్రలు, వాటి మధ్య బంధాలు అనూహ్యం. చలం ఈ కొత్తని ఎక్కడా పాఠకుల కోసమని విడమర్చడానికి ప్రయత్నించడు. ఏ పాత్ర పూర్వాపరాల్నీ, ఏ బంధాల మూలాల్నీ, ఏ స్థలకాలాల్నీ పరిచయం చేయడు. అందమైన గతాన్ని తన అంతరంగానికి మరోమారు తన కోసమే నెమరువేసుకుంటున్నట్టు కథ చెప్పుకుంటూ పోతుంటాడు. ఇది ‘అమీనా’ మొదటి కొన్ని పేజీల్లో పాఠకుల గందరగోళానికి కారణమవుతుంది. ఎవరు ఎవరో, వారెందుకిలా వున్నారో అర్థం కాదు. రెండో పఠనంలో మాత్రమే దీన్ని ఆసాంతం అనుభవించగలరు. అందుకే, కథ వెనుక నిజ జీవిత నేపథ్యాన్ని తెలుసుకోవడం ఈ అయోమయాన్ని కాస్త తగ్గిస్తుంది.

1915లో తన ఇరవయ్యొకటో యేట బ్రహ్మసమాజ సభ్యత్వం తీసుకున్ననాటి నుంచి మొదలు చలం జీవితం సంఘంపోయే త్రోవ నుంచి కొంతకొంతగా విడివడుతూనే వచ్చింది. సంస్కర్త రఘుపతివెంకటరత్నం నాయుడుగారి శిష్యుడైన చలం ఆయన ఆధ్వర్యంలో కాకినాడ బ్రహ్మసమాజానికి సెక్రటరీగా పనిచేశాడు. స్నేహితులైన రామ్మూర్తి, ప్రకాశం, కవి కృష్ణశాస్త్రి యిలా యితర యువకుల్తో కలిసి బ్రహ్మసమాజం ఆదర్శాల్ని ప్రచారం చేసేవాడు. భార్య కూడా అతనితో చేదోడువాదోడుగా నడిచింది. కానీ చలం స్త్రీ యావ తొందర్లోనే అతణ్ణి బ్రహ్మసమాజానికి కూడా వెలిపడేట్టు చేసింది. స్నేహితుడు రామ్మూర్తి మరదలు రత్నమ్మతో అతని సంబంధం బయటకు పొక్కి అతణ్ణి బ్రహ్మసమాజం నుంచి వెలివేసారు. అతనికి కూడా బ్రహ్మసమాజ ఆదర్శాల్లో నమ్మకం పోయింది. అతని సూటి ప్రశ్నలకు నిలవలేని ప్రతీ నీతినీ త్యజిస్తూ వచ్చాడు. అరాచక జీవితం వైపుకు నడిచాడు. కులం విడిచాడు, మతం విడిచాడు, తత్ఫలితంగా బంధువులకూ దూరమయ్యాడు. సంఘపు పొలిమేరల్లోకి నెట్టబడ్డాడు. అతనిలాంటి మానసిక నిర్మాణం గల కొందరు స్నేహితులు మాత్రమే అతనితో మిగిలారు. చలంలో రచయిత అంశ చిన్నప్పట్నించీ వుంది. అది యిప్పుడు ఉబికి యివతలకి వచ్చింది. లోపలి గోడల్ని కూలదోయగా ఏర్పడిన నైతిక వైశాల్యం అతని రచనలకి పదునైన శక్తి నిచ్చింది. పొలిమేరల్లోనే నిలబడి రచనల్ని సంఘంవైపుకు విసరడం ప్రారంభించాడు. స్త్రీ పట్ల విపరీతమైన కుతూహలమూ ఆకర్షణా అతనికి స్వభావపరంగా సహజాతం. ఆధ్యాత్మిక పరంగా అన్ని కట్టళ్ళనూ ఛేదించిన తర్వాత, భౌతికంగా ఈ విషయంలో మాత్రం ఏ కట్టళ్ళకైనా ఎందుకు బద్ధుడై వుండాలో అతనికి సమాధానం దొరకలేదు. స్వేచ్ఛాప్రణయం వైపుకు మళ్ళాడు. స్నేహితులు రామ్మూర్తీ, ప్రకాశం లాంటి వాళ్ళు అతనికి తోడు. కంచె దూకే సాహసంలోని ఆనందం వీళ్ళ జీవితాల్ని ఈ సమయంలో నడిపిస్తూ వచ్చింది. ఈ విశృంఖల జీవితమే అమీనా నేపథ్యంలో కన్పించేది. చలం 1921లో స్కూలు హెడ్మాస్టరుగా హోస్పేటలో ఉద్యోగంలో చేరాడు. ఆ ఏడాదే మొదటి నవల శశిరేఖ రాసాడు. తర్వాత రాజమండ్రీ, బందర్లలో కొన్నాళ్ళు పన్చేసి 1926లో ఏలూరు బదిలీ అయి వచ్చాడు. అమీనా కథా స్థలం ఏలూరే.

అమీనా నవలను చలం రెండు విడతలుగా రాసాడు. మొదటి భాగం 1928లో మొదలుపెట్టి మధ్యలో ఆపేసాడు. మళ్ళా పద్నాలుగేళ్ల విరామం తరువాత 1942లో మిగతా కథ పూర్తి చేసాడు. అయితే చాలామంది 1924లో కథ మొదలుపెట్టినట్టు పేర్కొనడం చూసాను. అది తప్పు. చలం ఏలూరు వచ్చింది 1926 ప్రాంతాల్లో. ఏలూరు లేకపోతే ఈ కథలేదు. నిజజీవితంలోంచి వచ్చి ఈ కథలో పాత్రలుగా మారిన ఎంకిపాటల నండూరి సుబ్బారావు, అమీనా, మరో పాత్ర విమల... వీళ్ళంతా ఏలూరు వచ్చాకనే చలం జీవితంలోకి ప్రవేశించారు. నండూరి సుబ్బారావు మరణించిన తర్వాత చలం ఆయనతో తన జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ 1961లో రాసిన “కవి హృదయం” అనే వ్యాసంలో ఈ విషయం తెలుస్తుంది. యిందులోనే అమీనా, విమల, ప్రస్తుత కథా పరిసరాల ప్రస్తావనా వుంటుంది. ఇది చదివినా అప్పటి చలం జీవితం ఎలా వుండేదో ఒక ఊహా చిత్రం స్ఫురిస్తుంది:
1926 ప్రాంతాలు. [నాకు] ఏలూరు బదిలీ అయింది. అప్పటినించీ సుబ్బారావుగారికీ, [నాకూ] స్నేహం మొదలు. ... అప్పటికింకా సుబ్బారావుగారు పెద్ద వకీలు కాలేదు. ‘కుదేలు’ అంటో చీట్ల పేకలు ఆడుతో వున్నారు. నేను వెళ్ళి పిలవగానే నాతో వొచ్చేసేవారు. నా యిల్లు, నా సహవాసాలు, నేను తిరిగే చోట్లు (రోడ్డు) అన్నీ మర్యాదకి గౌరవానికి దూరం. కాని నా కోసం ఆయన నా వెంటవచ్చి, నా అమర్యాద కథల్ని ఆప్యాయతతో వినేవారు. నాకోసం, నా సహచరులైన స్త్రీలని చూసి బెదరలేదు. ఊరిబైట అపవిత్రమైన ఇళ్ళల్లో నేను ఉండడం పరిపాటి అయినా, తక్కిన మిత్రుల వలె, నా యింటకి రావడానికి సంకోచించలేదు. నీతి బాహ్యులైన నా స్త్రీ మిత్రుల దీనచరిత్రల్ని విని వారికి సలహాలనిచ్చి, అవసరమైనప్పుడు సహాయపడేవారు కూడా. ఆనాటి ఆచార ప్రకారం, అవసర ప్రకారం, నా ఇల్లు రైలుస్టేషన్ వేపు వూరి చివర వుండేది. మైదానం దాటితే ఏరు. ఆ ఏరు మీద వూగే తీగల వంతెన. వంతెన అవతల తోటలు. తోటకీ ఏటికీ మధ్య ఏటిలో ప్రతిఫలించే కంచె. దాని వెనుక బోర్డింగు. బోర్డింగు మర్యాదల ప్రకారం దాంటో సగం కైదు పడ్డ విమల. ఆనాటికీ ఈనాటికీ ఆ దుమ్ము ఏలూరుకి అదొక్కటే (beauty spot) అందమైన స్థలం. బోర్డింగుకి ఎదురుగా ఏటి అవతల గట్టున ఓ మామిడి చెట్టు. సాయంత్రం అయిందా ‘ఆ చెట్టునిండా’ మిణుగురు దీపాలు. ఆ ఏటి చివర, రోడ్డు వంతెన పక్కనే అమీనా గుడిశ. ... 
ఆ విధంగా తిప్పాను, కొన్ని వందల ఏళ్ళకిగాని జన్మలేని ఆ మధుర శృంగార కవిని, ముసల్మాన్ వీధుల, క్రిస్టియను గొందుల, చీకటి సందుల, ఏటిగట్ల పైన, దుమ్ము రోడ్లపైన. తరచూ వొచ్చేవారు మిత్రులు నాతో నా మొండి గోడల యింట్లో గంతులెయ్యడానికి. రామ్మూర్తీ, రత్నమ్మా సరేసరి. ప్రతీసారీ వొచ్చి నా మిత్రులకి, విసుగనకండా వినిపించేవారు తన పాటల్ని సుబ్బారావుగారు. ఎంతో సహృదయంతో, బాధతో పదునెక్కిన అభిలాషతో, ఆయన పాటల్ని ప్రేమించే అనామకులు యువతీయువకులు, అతని పాటలకి కళ్ళు చెవులప్పచెప్పి వింటో, మధ్య ఆపుతో, పాడిందే పాడిస్తో, స్వేచ్ఛగా comment చేస్తో, parody చేస్తో, పాటల్లో, పాడే విధంతో stressesలో సరదాకి మార్పులు సూచిస్తో, పాటలు అంతరార్థాలు, పుట్టుకలు, మర్మాలు, వ్యంగ్యాలు ప్రశ్నిస్తో, నవ్వుతో, కళ్ళనీళ్ళు పెట్టుకుంటో, ప్రియులు ఒకరివంక ఒకరు చూసుకుంటో – యెటువంటి రాత్రులు, అర్థరాత్రులు గడిపామో!
***
1946 ప్రాంతాల నాకు మళ్ళీ మూడోసారి ఏలూరు బదిలీ అయింది. ... కాని, ఎంత భేదమో! ఎంకి లేదు. తీర్థయాత్రలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏటివొడ్డుకి రాదు. విమల చచ్చిపోయింది. అమీనా యెదిగి ఏళ్ళల్లో మాయమైంది. “పోయి పాడో అంటె/ ఓ యంట పలికేని-” ఆ ఏటి గట్టున బావి, మిణుగురుల మామిడి చెట్టు లేదు. మిణుగురులు లేవు.
కథ:

ఈ “ఎదిగి ఏళ్ళలో మాయమవడ”మనే పదం అమీనా నవల అంకితం పేజీలో కూడా వస్తుంది:
ఏళ్ళలో ఎదిగి
వాకిట్లో నుంచుని, వొచ్చానంటే,
చిన్నప్పటి నీ వొంటి బురదని
కావలించుకున్నా,
పెద్దైన నీ మనసు మీద
లోకం చిమ్మిన మాలిన్యాన్ని
అంగీకరించలేని
చలం
అవమానానికి
లోకపరత్వానికి
పరిహారంగా
నీకు, అమీనా,
ఈ పుస్తకం.
కథ మొత్తం చదివాకా ఈ అంకితం మరోసారి చదివితే యిందులోని విషాదం హృదయాన్ని మెలితిప్పుతుంది. కౌమారం తొలిలో యింకా పసి ఛాయలు వీడని తురక పిల్ల అమీనా. చుట్టూ పెద్దతనపు కపటత్వంతో చిక్కుపడ్డ రచయిత అమీనాలోని పసితనాన్ని ప్రేమిస్తాడు. అయితే ఆమె ప్రేమ తిరిగి స్వచ్ఛంగా, ముసుగుల్లేకుండా, పదునుగా అడిగే బలిదానాల్ని భరించలేకపోతాడు. తనతో కలిసి దాటమనే మర్యాద హద్దుల్ని దాటలేకపోతాడు. చివరికి దూరం చేసుకుంటాడు. ఆమె జ్ఞాపకాన్ని ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుని కథగా చెప్తుంటాడు.

మన జీవితంలో చాలా జ్ఞాపకముండిపోయే అనుభవాల్లాగే ‘అమీనా’లో కూడా కథగా చెప్పేందుకేమీ పెద్దగా లేదు. రచయిత ఏలూరులో ఏటి వొడ్డున సంఘ మర్యాదకి దూరంగా ఒక మొండిగోడల యింట్లో వుంటూంటాడు. అతనితో పాటు కథాప్రారంభం నాటికి మరో ముగ్గురు స్నేహితులు వుంటారు. రామ్మూర్తీ, తాతా (అనిపిలవబడే యువకుడు, బహుశా ప్రకాశం) వీరిద్దరూ ఏవో పరీక్షలు రాయడానికి రాజమండ్రి నుండి యిక్కడికి వస్తారు. సత్య అనే అమ్మాయి భర్తకి మస్కా కొట్టి వస్తుంది. ప్రేమించిన శర్మని కలవడానికి ఈ యింటిని వేదికగా చేసుకుంటుంది (కానీ అతను కథ చివరి వరకూ రాడు). ఈ ముగ్గురూ కాక, రచయిత ‘జీవం’ పేరుతో ప్రస్తావించే, బహుశా రచయితను ప్రేమించే ఒక పనిమనిషి కూడా ఆ యింట్లో వుంటుంది. రచయిత భార్య సుబ్బులు వూరెళ్ళింది కథ చివరిదాకా రాదు. ఈ నలుగురూ కలిసి ఆటలూ పాటల్తో తాత్కాలిక మోహాల్తో రోజులు అల్లరచిల్లరగా గడుపుతుంటారు. నండూరి సుబ్బారావు గారు కూడా వీరితో కలుస్తుంటాడు అపుడపుడూ. తన ఎంకి పాటల్తో వీరిని రంజింపజేస్తుంటాడు. ఏటి వొడ్డుకు అవతల క్రిస్టియన్ బోర్డింగులో వుండే విమల మరో పాత్ర. ఆమె రచయితకు పాత ప్రేయసి. ఆమె ప్రస్తుత ప్రేమికుడు శ్రీమన్నారాయణ ఆమెను కలవటానికి కలకత్తా నుండి వచ్చి రచయిత ఇంట్లోనే బస చేస్తాడు. మోహ ప్రధానంగా నడిచే వీరందరి జీవిత వైనాల్ని నవల్లోని ఈ పేరా క్లుప్తంగా చెప్తుంది:
పొద్దుబోక, బహుత్వ చపలత్వం చేత, ఏదో వారం వారం కొత్త అనుభవాల్ని వెతుక్కోవడం ... – నాలుగు చూపులూ, ఇంకా సాహసం వుంటే నాలుగు ముద్దులూ, ఇరుకు మెట్ల మీద బుజాలు రాసుకోవడమూ, జట్కాలోంచి పడే భయంతో మెడలు పట్టుకు వేళ్ళాడ్డమూ, గట్లెక్కుతో పట్టుకున్న చేతుల్ని వొదలక పోవడమూ, సినీమా చీకట్లో నడుములు కావిలించుకోవడమూ, సాముద్రికం చూడడానికి చేతులు వెతికి ప్రేమగాధలు సూచించడమూ, దొంగ భయాల నుంచి, రాని దొంగల నించి రక్షించి కావిలించుకోవడమూ, ప్రేమ పద్యాలూ పాఠాలూ చెప్పి అన్వయించుకోవడమూ, ఇంతలో ప్రయాణమూ, ఇతరుల అనుమానాలో, భర్త జాగ్రత్తో, వేరే ఆకర్షణో విడిపరచటమూ, ఒకర్నొకరు మరిచిపోవడమూ, కొత్త అనుభవాల కోసం మళ్ళీ ప్రయాణం కావడమూ, అవన్నీ కులాసాగా, ఏ సంస్కారాన్నీ, బాధనీ, జ్ఞానాన్నీ యివ్వకుండా, దినాలకు తేలిక రంగులు వేస్తో గడిచిపోయాయి.
ఇలా తేలికగా రోజులు గడిపేస్తూన్న రచయితకు ఒక రోజు యేటి గట్టున అమీనా తారసపడుతుంది. అమీనా స్వేచ్ఛాజీవి. యిల్లు వుంటుంది గానీ యెక్కువ బయటే తిరుగుంటుంది. యింట్లో వున్న అమ్మ తన సొంత అమ్మ కాదంటుంది. కోపమొస్తే అపుడపుడూ యింట్లోంచి పారిపోయి వస్తూంటుంది. యింట్లో వాళ్ళు ఆమెను వదిలేసి ఊరెళిపోతే ఏటి బురదలో తాటాకుబుట్టలో చేపల్ని పట్టి వండుకుతింటూంటుంది. బహుశా రచయిత చుట్టూ కనిపించే కులాసా జీవితానికి ఆకర్షితురాలై అనుకుంటా, వాళ్ళతో వుంటానంటుంది. వాళ్ళు పేరుతో అనకపోయినా నౌకరుగా తీసుకుంటారు. కానీ అమీనాలోని స్వేచ్ఛా రక్తం స్నేహంతోనే వాళ్ళకు వొగ్గుతుంది గానీ, మర్యాదకు ఇచ్ఛకు ఏ భంగాన్నీ సహించదు. వాళ్ళకు కిళ్ళీలూ సిగరెట్లూ తెచ్చిపెడ్తూ, టీలు సరఫరా చేస్తూ, యింటి పనులెన్ని చేసినా, స్నేహంలో మాత్రం సమాన హోదా కావాలి. జీతం కూడా ఆమెకు అక్కర్లేదు. ఆమె పసి వైనాలకూ, పాడే పాటలకూ అంతా ఆమె పట్ల ముగ్ధులవుతారు. ఆమెతో అక్కడ ఒక కొత్త పండగ వచ్చినట్టు అవుతుంది. రచయిత తన పట్ల చూపుతున్న ప్రత్యేకాభిమానానికి అతని పట్ల ఆకర్షితురాలవుతుంది. అతణ్ణి తనవాడుగా నిర్ధారించేసుకుంటుంది.

రచయితకు కూడా తన చుట్టూ వున్న ప్రౌఢత్వపు కాపట్యం, మర్మావయవాల చుట్టూతా తిరిగే దొంగ మోహాలూ, జెలసీలూ వీటన్నింటి మధ్యా అమీనాలోని స్వచ్ఛత ఒక అందుకోవాల్సిన ఆదర్శంగా కన్పిస్తుంది. వీటన్నింటి నించీ తనను కాచుకునేందుకు ఆమె ఒక ఆశ్రయంగా కన్పిస్తుంది. తన చుట్టూ వున్న మర్యాదస్తుల విదూషకత్వానించి, పెద్దతనపు క్రూరమైన శృంగారపుటాటల్నించీ, లోపల్లోపలేవో తెలియని లెక్కల్తోఅంచనాకు చిక్కని ప్రౌఢ స్త్రీ ఆంతర్య ప్రహేళికల్నించీ, నిలబడటానికి ఏ నికార్సైన ఆధారాన్నీ దొరకనివ్వని ప్రేమలోని అభద్రత నించీ... అమీనా ఒక్కతే — లోపల ఏమున్నా అదే పారదర్శకమైన సరస్సులా అంతా బయటికి చూపించేసే పసి అమీనా ఒక్కతే — ఆమె జ్ఞాపకం ఒక్కటే విముక్తిగా కనిపిస్తుంది.

కానీ అమీనా బయటపడినంత పూర్తిగా రచయిత బయటపడడు. అమీనా పట్ల ముసుగులేకుండా ప్రవర్తించే వీలు అతనికి లేదు. తాను పెద్దవాడు. ఆమె చిన్నపిల్ల. తను మర్యాదగల ఉద్యోగస్తుడు. ఆమె చేపలు పట్టుకుతినే వీధి పిల్ల. తామిద్దరి మధ్యా పరస్పరం మౌనంగానే అంగీకృతమైన బంధాన్ని అతను బయటి ప్రపంచానికి ఒప్పుకోలేడు. నిజానికి ఆమె దగ్గర కూడా గుంభనగానే గణించుకుంటూనే బయటపడతాడు. ఆమె తనకెవరో తన మనసుకే సరైన సమాధానం చెప్పుకోలేకపోతాడు. అమీనాలో మాత్రం ఈ సందిగ్దాలేమీ వుండవు. తనకు లోపల ఏముందో అదే చూపించేస్తుంది. ఇతర స్త్రీ మిత్రులతో అతని సాన్నిహిత్యాన్ని భరించదు. “డాక్టరు గారు” పేరిట కథలో ప్రవేశించే చలం వదిన “వొయ్యి” రాక గురించి తెలిసినపుడు అతను ప్రదర్శించే ఉత్సాహం ఆమెకు నచ్చదు. అందీ అందక రచయితను యాతనకు గురిచేసే అతని మరో ప్రేయసి శ్యామలను కూడా ఆమె కాసేపే ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరి మధ్యా ఏదో వున్నదని తెలియగానే, ఆమె వల్ల రచయిత బాధపడుతున్నాడని తెలియగానే, ద్వేషించడం మొదలుపెడుతుంది. కాని రచయిత సాంగత్యంలో ఆమెకు అందాల్సిన హోదా ఎప్పటికీ ప్రకటితమవదు. బయటివాళ్ళకి ఆమె అతని నౌకరు అంతే. కథ చివర్లో ఊర్నించి రచయిత భార్య సుబ్బులు వస్తుంది. యింట్లోకి రాగానే కుర్చీలో పడుకున్న ఈ మురికి పిల్లను చూసి “ఎవరని” అడుగుతుంది. “నువ్వెవర”ంటుంది అమీనా. ఆమె గీర చూసి కొట్టి పంపేస్తుంది సుబ్బులు. మర్యాద భంగాన్ని సహించలేని అమీనా మళ్ళీ తన గుడిసెకు వెళిపోతుంది. యేటి బురదలో మునుపటిమల్లె చేపలు పట్టుకుంటుంది. రచయిత వెతికి పట్టుకుంటాడు. ఎంత బతిమాలినా రాదు.
“ఆమె వుంటే నేను రాను. ఎన్నటికీ రాను. నన్ను కొట్టింది.”
“ఆమె ఎప్పుడూ వెళ్ళదు”
“నేను ఎప్పుడూ రాను”
“మరి నిన్ను చూడకుండా నేను—"
తలతిప్పి నా కళ్ళలోకి చూసింది.
“మరి నిన్ను చూడకుండా నేనూ...”
నీ సంగతి సరే. నా సంగతేమిటంటున్నాయి ఆమె కళ్ళు...
కొన్నాళ్ళకు అమీనాకు ఒక ముసలవాడితో పెళ్లి కుదిరిందని తెలుస్తుంది. ఆమె గుడిసెలోంచి యేవో గొడవలు కూడా వినవస్తూంటాయి.

ఒకరోజు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రచయిత ఇంట్లోకి, అతనున్న గదిలోకి వచ్చేస్తుంది అమీనా. అతణ్ణి కౌగలించుకుంటుంది. తనకో చీరె కొనిపెట్టమంటుంది. అప్పటిదాకా ఏదో భావుకత్వపు లోకాల్లో అమీనాను పూజించే రచయితకు ఈ ఫక్తు భౌతికమైన కోరికను అంగీకరించలేకపోతాడు. అతనిలో లౌకికుడు మేల్కొంటాడు. తన సరిహద్దు గోడలు ఎక్కడ అక్రమ చొరబాటుకు గురికానున్నాయోనని తల్లడిల్లే మామూలు మర్యాదస్తుడు తలెత్తుతాడు. ఆమె అతని పొట్టపట్టుకు వెక్కిళ్ళు పడుతుండగానే, ఎందుకు ఆమెకు చీరకొనివ్వాలో తర్కించుకుంటాడు. అందరూ ఏమనుకుంటారో ఊహిస్తాడు.
“ఏమిటి అమీనా! ఎందుకు ఇస్తాను నీకు చీరె? ఎందుకు ఇయ్యాలి?”
నా మొహంలోకి ఒక్క చూపు.
నా నడుం నుంచి ఒక్క తోపు.
గుమ్మంలో అమీనా.
కంఠం వొణుకుతో, కాళ్ళు ఎండవేడిలో వూగుతో —
మనుషుల్లో, మంచితనంలో, ఔదార్యంలో, కుంగి, నలిగి, విశ్వాసం నశించి, చాల సిగ్గుతో —
“పోనీ... పోనీ... నా జీతం... ఇవ్వండి...”
ఆమెకు జీతం ఇచ్చేసి పంపేస్తాడు. “అమ్మా!... వెళ్ళింది తిట్టకుండా పోయింది. ఎంతయినా తురకాళ్లని నమ్మడానికి వీల్లేదు” అని ఊపిరిపీల్చుకుంటాడు కూడా.

కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం. ఎందుకొచ్చిందో అని రచయిత భయపడుతుండగానే, తన కొత్త వోణీ చూపించి బాగుందా అని అడుగుతుంది. “మీరిచ్చిన డబ్బులతో... కొన్నాను. రెండు గజాలే వచ్చింది... మీ జ్ఞాపకానికి” అంటుంది. అతనిలో ఏదో కదులుతుంది, కరుగుతుంది. ముందుకు రాబోతాడు. తను వెళ్ళిపోతున్నానంటుంది. ఎక్కడికంటే దిగంతం వైపు చూస్తుంది. ఎందుకు అంటే యింట్లో వెళ్లాకొట్టారంటుంది. అంటూ పరిగెత్తుకు వెళిపోతుంది. ఆగమని వెనకాల వెళ్తాడు. కానీ, వీధిలోకి వచ్చేసరికి, అతనికి —
గడ్డిబండి అడ్డం – మర్యాద కట్టుకున్న నా కాళ్ళే అడ్డం. చదివి చదివి గుడ్డివైన నా కళ్ళే అడ్డం. సబ్బుతో కడుక్కున్న నా చేతులే అడ్డం.
అమీనా! అమీనా!
రోడ్డు మలుపు. సైడు కాలువ. బురద.
అస్తమించే సూర్యుడు. కళ్ళలో చీకటి.
అంతే అమీనా!
జన్మానికి ఆఖరు నా చిన్న అమీనా!
ఎదగని పువ్వు నా అమీనా!
అంటూ కథ ముగుస్తుంది.

శైలి:

కథ మొత్తం నాలుగు అధ్యాయాలుగా వుంటుంది. మొదటి రెండు అధ్యాయాలు 1928లోనూ, తర్వాతి రెండు అధ్యాయాలు 1942లోనూ రాసాడు. కథ చదువుతున్నపుడు మాత్రం ఈ రెండు భాగాల మధ్యా యింత కాలభేదం వుందని మనకేమీ అనిపించదు. కథా వస్తువుకూ రచయితకూ మధ్య సాన్నిహిత్యమూ ఏమీ మారినట్టనిపించదు. నిజానికి దూరమైన కొద్దీ మరింత తీవ్రమైన జ్ఞాపకమో ఏమో, కథకు చలం మరింత చేరువై కనిపిస్తాడు. శైలిలో ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తుంది. మొదటి రెండు అధ్యాయాలూ మన (పాఠకుల) సాక్షిగా రచయిత తన పాత కథని నెమరు వేసుకుంటున్నట్టు వుంటాయి. అంటే పాఠకులున్నారన్న విషయం కాస్త పట్టించుకుంటాడు. వాళ్ళ ఉనికి పట్ల కాస్తో కూస్తో ఖాతరు కనిపిస్తుంది. అప్పుడు కూడా పాఠకుల్ని పాంపర్ చేస్తూ పూర్తి వివరాలు ఇవ్వడం వుండదు. జీవితంలోలాగానే intelligible obscurity వుంటుంది. అయినా రచన మాత్రం కాస్తో కూస్తో సగటు కథా సంప్రదాయాల్ని పాటిస్తూ సాగుతుంది. మూడో అధ్యాయం నుండి మాత్రం అంతా మారిపోతుంది. రచయిత తనలో తాను కథను గొణుక్కుంటున్నట్టు వుంటుంది. పాఠకుని సంగతి దాదాపు వదిలేస్తాడు. కానీ ఈ వదిలేయడంలోనే మనం రచయితకు మరింత చేరువవుతాం. అతనిలోకి వెళ్ళిపోతాం. రచయిత అంతరంగమనే చీకటి థియేటర్లో అతని మనోఫలకమనే తెరపై కథలాడే బొమ్మల్నీ, వాటికి వ్యాఖ్యానంగా నేపథ్యంలో వస్తోన్న అతని గొంతునీ అతిసన్నిహితంగా లీనమై వింటాం. ఎక్కడా పాత్రల పూర్వాపరాలుండవు, ప్రదేశాల వర్ణనలుండవు, సంభాషణలు కూడా అక్కడ జరిగిన అసలు సంభాషణల్ని క్లుప్తంగా సూచించే చిహ్నాల్లా వుంటాయి. మనకు మనం ఏదైనా జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నపుడు కూడా యింతే కదా! అందులో భాగమైన మనుషుల పుట్టుపూర్వోత్తరాల్ని మనకి మనం పరిచయం చేసుకోం, అందులో వచ్చే ప్రదేశాల్ని మనకి మనం వర్ణించుకోము. అలాగే యిదీను. కథ పూర్తిగా రచయిత అంతరంగ చైతన్యంగా మారిపోతుంది. ఈ చైతన్య స్రవంతి మామూలు వాడిది కాదు కాబట్టి, చలం లాంటి రచయితది కాబట్టీ, ఒక్కోసారి ఇది వచనపు తీరైన దారుల్ని దాటుకుపోయి అచ్చమైన కవిత్వంగా మారిపోతుంది. పైపై పొరల్నంటినీ ఛేదించి జీవితాన్ని అతి దగ్గరగా దాని సారంతో అనుభూతించడం కవిత్వమయితే, జీవితాన్ని అనాచ్ఛాదితం చేసి కావలించుకుని దాని హృదయస్పందనను మనసంతా శ్రవణేంద్రియంగా చేసి ఆన్చి వినడం కవిత్వమయితే, ‘అమీనా’లో చాలా కవిత్వం వుంది. ఉన్నతమైన కవిత్వం వుంది.

మామూలు కవులు కవిత్వంతో తీసికెళ్లలేని జీవితపు అరుదైన మూలల్లోకి కూడా, ఇలా వచనం మధ్యలో కవిత్వాన్ని పొదగగలిగే రచయితలు యింకా సులభంగా తీసికెళ్ళగలరనిపిస్తుంది. ఎందుకనిపిస్తుందో చెప్తాను. కవులు తాము అనుభూతించిన భావోద్వేగాల్ని కవితలుగా మలుస్తారు. ఈ భావోద్వేగాలు స్వయంసమృద్ధమై వుండడమన్నది వారు వ్యక్తీకరణకు ఎంచుకున్న కవిత అనే నిర్మాణాపద్ధతికి తప్పనిసరి. అంటే కవిత మొదలయి ముగిసేలోగా కవి చెప్పదల్చుకున్న భావోద్వేగమేమిటన్నది అక్కడ ఆసాంతం పరవబడాలి. ఈ స్పష్టమైన ఫ్రేమ్‌‍వర్కూ, నిర్మాణ నియమాలూ, పదలయను దృష్టిలో పెట్టుకోవలసి రావడాలూ, క్లుప్తతావసరమూ... యివన్నీ కలిసి కవి తన కవితా వస్తువుల్ని ఎన్నుకోవడాన్ని కొంతవరకూ ప్రభావితం చేస్తాయి. ఇలా నిర్ణీత ఫ్రేమ్‌వర్కులోకి తీసికెళ్ళి పెట్టాల్సిన తన అనుభవమూ, భావోద్వేగమూ ఎంతో కంత విలువైనవే అవ్వాలని కవి మనసులో పడుతుంది. ఏదో ఏకోన్ముఖత సాధించాలని తపన పడతాడు. జీవితానికి విలువైన వ్యాఖ్యానాలు చేయాలనీ, నిర్వచనాలు ఇవ్వాలనీ, ఏదో ఒక సత్యాన్ని సూచించే పదచిత్ర సమూహాన్ని పేర్చాలనీ, లేదా ఏదో ఒక పదచిత్రం సూచించే సత్యాన్ని స్ఫురింపజేయాలనీ యావలో పడతాడు. కానీ జీవితంలో ఎల్లెడలా వెదజల్లబడి వున్న stray detail వైపు అతని చూపు మళ్ళదు. ఏ ఏకత్వానికి అందని జీవితపు అగణిత బహుముఖత్వం అతనికి పట్టదు. ఈ బహుముఖత్వాన్ని తెలుగులో కవుల కంటే సులువుగా, చలం లాంటి సమర్థులైన కథా రచయితలే స్ఫురింపజేయగలిగారనిపిస్తుంది. ఎందుకంటే కథా ప్రపంచపు ఫ్రేమ్‌వర్కు మరింత విశాలం. జీవితమంత విశాలం. అది స్పష్టమైన పాత్రలతో, ప్రదేశాలతో, పేర్లతో, సంభాషణలతో, స్వభావాలతో సృష్టింపబడుతుంది. అక్కడ జీవితం నుంచి ఎన్నుకున్నవి కాదు, జీవితాన్ని యధాతథంగా పరచడం లక్ష్యం. అందుకే వారి పని సులభం. పరస్పరం ఐక్యత లేక ఎల్లెడలా వెదజల్లబడ్డ వివరాల్ని తీసుకొచ్చి పెట్టినా కూడా, ఎబ్బెట్టుగా అన్పించని ఒక స్థానాన్ని వాటికి కేటాయించగలిగేంతటి విస్తృతమైన ఫ్రేంవర్కు వారికి వుంది. అందుకే కవి ఇముడ్చుకోలేక వదిలేసే వివరాలు కథకుడు ఇముడ్చుకోగలడు. కవులు ఎన్నుకునే వివరాల్లా అవి దేనివైపూ సూచించకపోవచ్చు. కానీ ఎటూ చూపని ఈ జీవితానికి ప్రాతినిధ్యం వహించగలిగేవి ఈ ఎటూ చూపని వివరాలే. నిజానికి కవులు చేయాల్సినదీ ఇదే. జీవితానికి ప్రాతినిధ్యం వహించడమే. సమర్థులైన కవులే అది చేయగలరేమో. ఇదంతా అల్టిమేట్‌గా ఆయా రచయితల, కవుల సమర్థత మీదే ఆధారపడివుందేమో. ఏదిఏమైనా తెలుగులో నాకు కథారచయితలు చూపించినన్ని జీవితపు మారుమూలల్ని ఏ కవీ యింతదాకా చూపించలేదూ అన్నది మాత్రం చెప్పగలను.

ముఖ్యంగా అమీనాతో చలం ఆ పని చేయగలిగాడు. ఈ కథలో మూడో అధ్యాయం నుండి వచనం అక్షరాల్ని నిగడదన్నుకుని లేచి కవిత్వానికి ఎగురుతుంది. ఆ కవిత్వ ప్రభావాన్ని చూపించడానికి ఉదహరిద్దామంటే ఈ చోటు సరిపోదు. పూర్తిగా రచన చదివితేనే అర్థమవుతుంది. అయినా కొన్ని ఉదాహరణలిస్తాను. రచయితా, స్నేహితులూ, ఊర్నించి వచ్చిన రచయిత ప్రేయసి శ్యామలా అంతా కలిసి ఓ రాత్రి విందుకు వెళ్తారు. అమీనాను కూడా తీసుకుని వెళ్తారు. అక్కడ అంతా లౌకిక మర్యాదలు, పైపైమెప్పులూ, లోతులేని మాటలు, నమ్మే సత్యాల్ని కూడా హాస్యంగా చేసి ప్రకటించవలసిన వాతావరణం. విందు పూర్తి కావొచ్చేసరికి అమీనా కనపడదు. రచయితకు ఆందోళన ప్రారంభమవుతుంది. అతను యింటికివెళ్ళి చూద్దామంటాడు. కానీ ఆ సందట్లో చుట్టూవాళ్ళకి అదేమీ పట్టదు. విందు యిచ్చిన గృహస్తు రాత్రికి అక్కడే పడుకోమంటాడు. శ్యామల కూడా వుండమంటుంది. ఆమె కళ్ళల్లో ఏవో చిహ్నాలు రాత్రికి శృంగారావకాశం వుండవచ్చునని సూచిస్తాయి రచయితకి. శరీరం యిటు మొగ్గుతూంటుంది. మనసు మాత్రం అమీనా అమీనా అని గోలపెడుతుంటుంది. చివరికి శరీరానికీ, శ్యామలకీ లొంగిపోయి అక్కడ పడుకోవడానికే ఒప్పుకుంటాడు. అంతా పక్కలు వేసుకుంటారు. కబుర్లతో సమయం గడుస్తుంది. అంతదాకా అతనికి దగ్గర్లో పడుకున్న శ్యామల ఇక్కడ నిద్రపట్టడం లేదని పక్కకి వెళిపోతుంది. రచయిత మోసం కాబడినట్టు భావిస్తాడు. అతని అంతరంగం చేదు కషాయమైపోతుంది:
పక్కచుట్ట... గాజుల చప్పుడు... పమిట కొంగు చివర వెళ్ళే కాళ్ళు... చీకటి... చీకటి...
ఒక్క చూపు – ఒక్క మాట, ఒక్క ఓదార్పు...
ఏమీ లేవు –
చీకటి – లోపల బైట, చీకటి.
మోసబడ్డ ద్వేషపు చిక్కని కాంతి.
బలిపడ్డ జంతువు గుండెల్లోని గడ్డకట్టిన నల్లని నెత్తురు...
కొడుకు చేతుల్లో దెబ్బలుతిన్న ముసలిదాని ప్రేమపు మూలుగు...
ఒక్కటే దారి... కసి... కసి... కసి... శాంతి... ఒక్కటే శాంతి... కసి...
క్షమించలేని... ఎన్నాళ్ళకీ ఉపశమించని... మధురమైన కలిదేవత, కసి.
కసీ, ఓ కసీ!
నీ ముందు నా ప్రతిజ్ఞ –
నీ పాదాల ముందు నా కలం –
సిరాతో, నల్లని, అచ్చు సిరాతో నీకు అభిషేకం –
ద్వేష వాక్కులు – నా రుక్కులు –
నా హృదయమే — నలిగిన, మన్నులో తొక్కిన ఈ వేడి హృదయం — నీకు నైవేద్యం.
రా! నీ చేదు రసం పొయ్యి, నా కలంలో నింపు...
నిలవలేను, వెళ్ళాలి.
సమస్తం — మిత్రత్వం, ప్రేమ, ధర్మం... అన్నీ పదాలు, వుత్త పదాలు, మూఢుల అనృతాలు
ఎవరు, ఎవరు, ఇంక ఎవరు
ఏది, ఏది — అమీనా ఏది?
ఇక నిలవలేక గుమ్మం దాటి రోడ్డు యెక్కి ఇంటి దారి పడతాడు అమీనాని కలవరిస్తూ. దారి పొడుగునా అతని మానసాన్ని చలం ఇంతే తీవ్రతతో వర్ణిస్తాడు. అతను యింటికి చేరి చీకట్లో గొళ్ళాన్ని తడుముతుండగా మెట్ల దగ్గర దేన్నో తొక్కుతాడు. అమీనా! ...అక్కడ పడుకుని వుంటుంది. అతని కాళ్ళని కావలించుకుని ఏడుస్తుంది. అతనూ కరిగిపోతాడు. ఆమెను వళ్ళోకి తీసుకుంటాడు:
చీకట్లో – మెట్ల మీద – దుమ్ములో –
ప్రేమలోకంలో దిక్కుమాలిన బిచ్చగాళ్ళం –
దెబ్బతిన్న గుడ్డివాళ్ళం – అనాధలం – అంధకారులం –
ప్రేమని నిరసించే నేను,
ప్రేమని ఆశించే అమీనా.
ఇద్దరం – ఇద్దరం – పొడుగై పాకే నీడలో, పెళ్లలు రాలే గోడలో.
చీమలు, కీచురాళ్ళు, బల్లులు –
కన్నీళ్ళు – ఎక్కిళ్ళు – వేళ్ళు – ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళ వేళ్ళు – వేళ్ళ మధ్య వేళ్ళు – పెదిమల మధ్య జుట్టు – రెప్పల మధ్య నీళ్ళు.
మొదటి రెక్కల విదిలింపు.
బండీ గుర్రం సకిలింపు.
అడుగుల కదిలింపు.
నీళ్ళ ధారల వొదిలింపు.
తెల్లారుతోంది.
ఫ్యాక్టరీ, కోడీ కలిసి కూశాయి.
నేను యిందాక కవిత్వం పరిమితుల గురించి పడ్డ అనుమానాలకి మరొకటి జత చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఉదహరించిన రెండో భాగంలోని చివర తెల్లవారడాన్ని గురించి రాసిన నాలుగు వాక్యాలూ చదివినపుడు, నేను ఇదివరకూ ఎక్కడా ఆ వస్తువుపై అంతటి ప్రభావవంతమైన పంక్తుల్ని చదివినట్టు అనిపించలేదు. తెలవారడాన్ని ఏ కవిత్వంలోనూ యింతగా అనుభూతి చెందలేదు. నిజానికి కవిత్వంలో ఈ విషయకంగా ఇంతకుమించిన వ్యక్తీకరణలు వందలు వేలు వచ్చి వుంటాయి. నేనూ చదివి వుంటాను. మరి దీన్ని చదివినపుడే ఎందుకు అలా అనిపించింది? తెల్లవారడాన్ని గురించి వర్ణించడానికి ఇది ఎన్నుకున్న స్పష్టమైన నాలుగు పదచిత్రాల్ని: చెట్ల మీద పక్షులు రెక్కలు విదుల్చుకోవడాన్నీ, ఎక్కడో జెట్కాబండికి కట్టిన గుర్రం నెమ్మదిగా సకిలించడాన్నీ, నిద్ర లేచిన ఇరుగుపొరుగు అడుగుల సవ్వడినీ, ఎవరో నీళ్ళు పట్టుకోవడాన్నీ... ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఇవి కాదు ముఖ్యం. ఈ self-contained తెలవారే దృశ్యం కాదు నాలోని అనుభూతికి కారణం (నిజానికి అక్కడున్న పంక్తుల్లో స్వతహాగా వున్న కవిత్వాంశ చాలా తక్కువ). అసలు కారణం – ఆ తెలవారే దృశ్యాన్ని ప్రత్యేకంగా అనుభవించగలిగే ఒక మానసికావస్థను అంతకుముందు నించీ నెమ్మది నెమ్మదిగా నాలో సిద్ధం చేస్తూ వచ్చింది ఈ కథ. వుట్టి తెలవారే దృశ్యాన్నే యివ్వలేదు, దాన్ని అనుభూతించేందుకు ఒక vantage point ని కూడా ఇచ్చింది. ఎక్కడ నుండి చూడాలో అక్కణ్ణించి చూపించింది. ఆ కాలంలో, ఆ ఏలూరులో, ఆ గొళ్ళెం తీయని గుమ్మం ముందు అమీనాని వళ్ళో పెట్టుకుని రచయిత చూస్తున్న ఆ ప్రత్యేకమైన తెలవారి దృశ్యాన్ని — అతని మనసుతో — నేను చూడగలుగుతున్నాను. కవిత్వం తెల్లవారడాన్ని వ్యక్తీకరించవచ్చు అద్భుతంగా. కానీ దాన్ని ఒక ప్రత్యేకమైన కోణంనించి (ఒక ప్రత్యేకమైన పాత్రగా, ఒక ప్రత్యేకమైన మానసిక స్థితితో, ఒక ప్రత్యేకమైన కాలంలో స్థలంలో) అనుభవించడానికి నా మనసుని ఇంత ప్రభావవంతంగా సంసిద్ధం చేయలేదు. బహుశా హెన్రీగ్రీన్ “prose is not quick as poetry but rather a gathering web of insinuations” అన్నప్పుడు ఆ “gathering web of insinuations” అనడంలో ఇదే సూచిస్తున్నాడేమో. అవును, వచనం నెమ్మదిగా చుట్టూ అల్లుకొనబడే వల. అది తన ప్రభావం చూపించడానికి సమయం తీసుకుంటుంది. కానీ ఆల్లుకొనడం పూర్తయ్యాక అంతా కలిసి చూపించే ప్రభావం మాత్రం అనన్య సామాన్యం. అందుకే పుష్కిన్, నబొకొవ్ లాంటి రచయితలు తొలి రోజుల్లో కవిత్వం రాసి తర్వాత వచనానికి మళ్లారేమో.

యిక ‘అమీనా’లో కన్పించే చైతన్యస్రవంతి శిల్పం చలం సహజంగా సాధించిందనిపిస్తుంది. అతని అవసరమే అతనికా శిల్పాన్ని తెచ్చి ఇచ్చింది. బయటి ప్రేరణలు ఏవీ వున్నట్టనిపించవు. చలం 1942లోనే జాయిస్ ని చదివి వుంటాడని నేననుకోను, అసలు వినివుంటాడా అన్నది వేరే సంగతి. అలాగే అంపశయ్య నవీన్ తెలుగులో చైతన్య స్రవంతి శిల్పంతో మొదట రాసింది శ్రీశ్రీ అని తీర్మానిస్తూ ‘కోనేటి రావు’ కథను ఉదహరిస్తాడు. శ్రీశ్రీ తర్వాత బుచ్చిబాబు “చైతన్యస్రవంతి” అని ఆ శిల్పంతో ఒక కథ కూడా రాశాడంటాడు. కానీ శ్రీశ్రీ ‘కోనేటి రావు’ కథ 1946లో రాసాడు. కాబట్టి చలం వీళ్ళిద్దరి కన్నా ముందే రాసాడనుకోవాలి.

***

‘అమీనా’ని నేను రెండ్రోజుల్లో రెండుసార్లు చదివాను. అసలు ఇదివరకూ పదేళ్ళ క్రితం ఒకసారి చదివాను. అయినా ఏమీ కొత్తదనం పోలేదు. ఈ కథ నిజంగా జరగింది కావడం దీనికి ఇచ్చే శక్తిని కాదనను. కానీ తన మనసులో ఆ జ్ఞాపకం ముద్రవేసిన తీరు, అందులోంచి ఆయన పిండుకున్న మనోహరత్వమూ, చూడగలిగిన జాలీ... వీటన్నింటినీ, ఈ అనుభూతిలోని సత్యాన్నంతటినీ, అద్వితీయంగా కథలో ఇమడ్చగలిగాడు చలం. తనలోని సత్యం ఏ జల్లెడలూ లేకుండా అక్షరాల్లోకి ప్రవహింపజేయడంలో చలంకున్న అరుదైన ప్రతిభకు అత్యున్నతమైన ఉదాహరణ ‘అమీనా’.

4 comments:

  1. excellent sir
    -----------------
    buchi reddy gangula

    ReplyDelete
  2. ఏలూరులో చలాన్ని, కమ్ముల అప్పన్న గారి కళ్ళలో దయని చూసిన చలాన్ని వెతుక్కుంటుంటే ఇక్కడ అమీనా చలం కనపడ్డాడు.

    ReplyDelete