May 3, 2011

దైవమిచ్చిన భార్య – రీడింగ్ నోట్సు

.
(ఈ బ్లాగులో కొన్నాళ్ళు చలం సందడి కన్పించవచ్చు. చలం మీద ఒక పుస్తకం రాయవలసి వచ్చి ఆయన రచనలు, ముఖ్యంగా నవలలు, క్రమంలో చదువుదామనుకుంటున్నాను. రచన చదవగానే వచ్చే ఆలోచనల్ని మరుపుకు రాకుండా యిక్కడ రాద్దామనుకుంటున్నాను. యివి పూర్తిస్థాయి వ్యాసాలుగా వుండాలని అనుకోవటం లేదు.)

చలం మొదటి నవల “శశిరేఖ” 1921లో రాసాడు. రెండవ నవల “దైవమిచ్చిన భార్య” 1923లో రాసాడు. మొదటి నవలతో పోలిస్తే ఈ నవలలో చాలా పరిణతి కన్పిస్తుంది. మొదటి నవల చాలా ఓపిక పట్టినా పూర్తి చేయలేకపోయాను. అందులో నాకు చలం ముద్ర పెద్దగా కన్పించలేదు. ప్రవాహసదృశమైన ఆయన శైలి లేదు. సంభాషణలు తప్పించి మిగతా వచనం అంతా సరళగ్రాంథికంలో వుంటుంది. వర్ణనల తర్వాత సన్నివేశము, సన్నివేశం తర్వాత సంభాషణలు యిలా ఒకదాని తర్వాత ఒకటి పడికట్టు క్రమంలో సాగుతుంటాయి. చలం కూడా ఈ రచన విషయంలో పెద్ద ఆసక్తుడై ఎపుడూ మాట్లాడలేదు.

“దైవమిచ్చిన భార్య”లో మున్ముందు పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేయబోయే చలం లీలగా కనిపిస్తాడు. సులువైన మాటల్లో నాటుకుపోయేట్టు కథనాన్ని నడిపించే చలం బలం యిక్కడ రూపం తెచ్చుకుంటూ కనిపిస్తుంది. కథ మొదట్నించీ విధి గుద్దిన విషాదపు ముద్రల్తో కనిపించే యిద్దరు ప్రేమికుల కథ యిది. వాళ్ళ చిన్నతనం నుండి మొదలై వారిలో ఒకరి మరణం దాకా నడుస్తుంది. రాధాకృష్ణ, పద్మావతి చిన్నతనం నుండీ స్నేహితులు. తహసీల్దారు కొడుకు రాధాకృష్ణ. వాళ్ళ పక్క యింటి జమీందార్ల అమ్మాయి పద్మావతి. పద్మావతి చెన్నపట్నంలో వుంటూ అపుడపుడూ చుట్టంచూపుకు ఊరు వస్తూంటుంది. అలా వచ్చినపుడొకసారి యిద్దరూ తొలిసారి కలుస్తారు. ఆటల్లో జట్టుకడతారు. ఆ రోజుల్లోనే పద్మావతికి ముప్ఫయ్యేళ్ళ ఒక న్యాయమూర్తితో బాల్యవివాహం జరిగిపోతుంది. స్నేహితులిద్దరూ ఏడేళ్ళు మళ్ళీ కలుసుకోరు. మరలా ఆమె ఊరు వచ్చేసరికి, యిద్దరూ నిండు యవ్వనంతో వుంటారు. యిద్దరిలోనూ పరస్పరం ప్రేమ మొదలవుతుంది. యిద్దరూ ప్రేమ లోకపు చుక్కల జల్లు కళ్ళను మెరిపిస్తూంటే, అనురాగ గాఢతను అనుభవిస్తారు. ఆమెను తనతో వచ్చేయమంటాడు రాధాకృష్ణ. యిక్కడే పద్మావతి మనల్ని ఆశ్చర్యపరుస్తూ రానంటుంది. దానికి ఆమె చెప్పే కారణం, రాధాకృష్ణకు భార్యగా మారిపోయి పెళ్ళి అనే బంధంలో ఇరికిపోవడం ఆమెకి యిష్టం లేదు. ఒకరికొకరు పాతబడిపోవడం యిష్టంలేదు. యిలా అప్పుడపుడూ కలుసుకోవడంలో ఎప్పటికపుడు తాజాగా ఉత్పన్నమయ్యే ప్రేమావేశపు కొత్తదనం ఆమెకి కావాలి:
“నిన్ను కలుసుకోవడమంటే నాకెంతో యిష్టం – నీ దగ్గర్నించి వెళ్ళిపోయి నిన్ను కొంతకాలం చూడకుండా వుండడం మరీ యిష్టం! మళ్ళీ మనం కలుసుకొన్నప్పుడు మరీ బావుంటుందిగా! యెవరికీ తెలీకుండా నీ దగ్గిర కిలా తప్పించుకు రావడం చాలా యిష్టం... కానీ నేనిప్పుడు లేనూ, అలానే వుంటా యెప్పుడూ. నా మీద యెవరికీ అధికారం యివ్వను. యెవరి సొమ్మునీ అయిపోను. యెవరి వస్తువునీ కాను. ఎప్పుడూ పొద్దున్నా, సాయంత్రమూ ఒకరికి కనబడుతో, రాత్రంతా వాళ్ళతో వుండి వాళ్ళకి పాతదాన్నయి, అసహ్యం అయిపోను. ఆఖరికి నీకు కూడా...”
ఆమె న్యాయమూర్తికి భార్యగానే వుండాలనుకుంటుంది. అలాక్కాక రాధాకృష్ణతో లేచి వచ్చేస్తే సంఘం పెట్టే కష్టాలేవీ ఆమె ఎదుర్కునేందుకు సుముఖంగా లేదు.
“[నీతో వచ్చేసింతర్వాత] యెక్కడికో అసహ్యమైన చోటికనుకో యే సందుల్లోనో, గుడిశల్లో బతకాలనుకో. మనకు డబ్బు వుండదు. పొద్దున్న లేస్తే మన యిద్దరికీ ఆందోళనే. విచారమే, తాపత్రయమే. మన ప్రేమ అనుభవించడానికి సమయమే వుండదు. నేను నీతో వున్నప్పుడల్లా, సంతోషంగా, చింత లేకుండా అందమైన చోట్ల అనుభవించాలని వుంటుంది”
ఆమె వ్యక్తిత్వాన్ని ఒక్కముక్కలో చెప్పాలంటే “నేను” అనే చట్రందాటి బయటకు రాలేని మామూలు స్వార్థపరురాలు. ఆమెకు ప్రేమ వల్ల వచ్చే ఆనందం మాత్రమే కావాలి. ఇద్దరు మనుషులు నిత్యం కలిసి బతుకుతూ ఉమ్మడిగా రాసుకునే ఆనంద-విషాదాల చరిత్ర ఆమెకు అక్కర్లేదు. Her myopic vision is guarded thickly by her own passions. Byronic blindness! ఈ భావోద్వేగాల్ని దాటి చూడగలగడం చూస్తుంది, గానీ ఆమెకు అక్కడ కనిపించే నిస్సారత్వం భయం. దాన్ని ఎదుర్కోవాలనుకోదు. దానికి బదులుగా అబద్ధమయినా అందమైందైతే చాలనుకుంటుంది:
“ఈ నూతనోత్సాహంలో అలానే అనిపిస్తుంది. నేను చాలామందిని చూశాను రాధా!... ప్రేమ అనేది ఆకాశంలో దానంత అది వెలిగే జ్యోతి కాదు. కావ్యాల్లో నాటకాల్లో ఇంగ్లీషు నావెల్సులో రాసే ప్రేమ వేరు; మనుషులం మనకి వుండే ప్రేమ వేరు. పెళ్ళి అయిందని కథ ముగిస్తారు? తరువాత వాళ్ల ప్రేమ ఏమయిందో రాస్తే ఎంత ఘోరమైన సంగతులు బయటపడతాయో! మనం దాన్ని భద్రంగా పెంచి, కాపాడి పోషించాలి. లేకపోతే పువ్వులోని మృధుపరిమళంమల్లే యెరిగిపోతుంది.”
ప్రేమను భద్రంగా పెంచి కాపాడి పోషించాలనీ, లేకపోతే నిలవదనీ, ఆమెకు తెలుసు. కానీ ఆమె ఆ ప్రయత్నానికి సిద్ధం కాదు. దీనికి పలాయనాన్ని విరుగుడుగా ఎంచుకుంటుంది. ఒకరికొకరు దూరంగా వుంటూ, అపుడపుడూ మాత్రమే, జీవితపు నిరాసక్తత చలిగా ముప్పిరిగొని ఆత్మను కొంకర్లు తిరిగిపోయేలా చేస్తున్నపుడు మాత్రమే ఆ ప్రేమ యజ్ఞగుండాన్ని వెలిగించి చలికాచుకుని, ఆ నిత్యాగ్నిహోత్రం స్వభావానుసారం తన కన్నీటి ఆజ్యాన్నిమ్మని నాలుకలు చాచినపుడు మాత్రం ఆర్పేసి దూరం పారిపోవాలి. అదీ ఆమె తత్త్వం. ఆమెకు అతనిపై నిజమైన ప్రేమ వుంది. కానీ ఆమెకు ప్రేమకున్న బలం పైనే నిజమైన నమ్మకం లేదు.

సరే, రాధాకృష్ణకు మరోదారి వుండదు. ఆమెపై ప్రేమ అన్నీ ఒప్పుకునేలా చేస్తుంది. కొన్నాళ్ళు సాగుతుంది. న్యాయమూర్తి విదేశాల్లో చదువుముగించుకుని వచ్చాకా, ఆమె చెన్నపట్నం కాపురానికి వెళ్ళిందని తెలిసినపుడు మాత్రం బాధతో మండిపోతాడు. ఆ బాధలో కూడా, అతనికి మగవాడి సహజమైన అపరాధ భావన తప్పదు. అలా అతని మనసుని పద్మావతి కండీషన్ చేసిపెడ్తుంది. తన ప్రియురాలు తనది కావాలి అనుకోవడం కూడా జెలసీ వల్ల మాత్రమే అని సమాధానపడతాడు:
నా దగ్గర్నించీ పద్మావతి వెళ్ళిపోయిన విరహబాధ కంటె నాకు – నాకు కాకుండా పద్మావతి యింకొకరిదయిందనే బాధ అంత తీవ్రమయింది. ఆమెని నేను ప్రేమించినది మొదలు ఆమెని నా పదార్థం చేసుకోవాలనే ముఖ్య ప్రయత్నం. పద్మావతి సంతోషం కాదు ముఖ్యం. ఆమెకి బాధ కలిగినా సరే, యెవరిదీ కాకుండా ఆమె నాది కావాలి. పద్మావతి, ముందు నాదైపోతే తరవాత నేను ఆమెకి జీవనమంతా ఇస్తాను. యెంత సేవన్నా చేస్తాను. నాది కాకపోతే యేమీ లేదు. నా ప్రేమ అంతా ద్వేషమైపోతుంది. ఇది సాధారణంగా స్త్రీ పురుషులకి ఒకరి మీద ఒకరికి వుండే ప్రేమ. న్యాయమూర్తి నా పద్మావతి దగ్గిరిగా ఒక యింట్లో, ఒక గాలిని పీలుస్తోవున్నాడని నా హృదయం రాత్రింబవళ్ళు దహించుకుపొయ్యేది.
చెన్నపట్నం వెళ్ళి ఆమెకు ద్వేషాన్నంతా వెళ్ళగక్కుతూ ఉత్తరాలు రాస్తాడు. ఆమె మళ్ళీ అతణ్ణి ఎలాగో పాత పాటే పాడి ఒప్పిస్తుంది. ఈ అయోమయ స్థితిలోనే అతను వేరే పెళ్ళి కూడా చేసుకుంటాడు. అయిదేళ్ళ పాటు యింగ్లాండు వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చాక పద్మావతితో బంధం మళ్ళీ కొనసాగుతుంది. ఈసారి ఆమె యింట్లోనే. కొన్నాళ్ళకి ఒకరోజు ఇద్దరూ బాహటంగా భర్తకి పట్టుబడిపోతారు. ఈ సందర్భంలో భర్తని బయటి పార్టీగా విలన్‌గా చూపించకుండా, అతణ్ణి కూడా ఈ త్రికోణంలో సానుభూతి పడాల్సిన భాగంగా చూపిస్తాడు చలం. అతను పద్మావతిని కొన్నాళ్ళపాటు సింగపూరు తీసుకుపోతాడు. తర్వాత చెన్నపట్టణం తీసుకువచ్చి ఇంట్లో ఖైదు చేస్తాడు. ఇద్దరూ కలుసుకోకూడదని, ఉత్తరాలు రాసుకోకూడదనీ, లేదంటే రాధాకృష్ణ మీద కేసులు పెట్టిస్తాననీ బెదిరిస్తాడు. షరతులకు ఆమె లొంగిపోతుంది. అంతేకాదు, రాధాకృష్ణ కూడా లొంగిపోయేలా ఒప్పిస్తుంది.

మరో ప్రక్క రాధాకృష్ణ తన భార్యతో సఖ్యత పెంచుకుని, మామూలు సంసారిక జీవనంలో పడతాడు. కొన్నేళ్ళకు ఎపుడో పని మీద మలబారు వెళ్ళినపుడు మళ్ళీ పద్మావతి కన్పిస్తుంది. ఆమె దేశ పర్యటనలో వుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. పడవ యెక్కి సముద్రంలోకి వెళ్తారు. అందమైన ప్రకృతి మధ్య ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఆస్వాదిస్తారు. అయితే ఇద్దరి మధ్య భౌతికమైన వాంఛ వుండదు.
ఆ సృష్టి సౌందర్యంలో ఒకరం యింకొకరి సౌందర్యంలో లీనమైపోయినాము. ఒకరికొకరు తాకనన్నా లేదు. తాకాలనే బుద్దే లేదు. తాకనక్కర్లేదు. ఈ భౌతిక శరీరానికి అతీతమైన ఆనందం అనుభవించాము. అంతసేపూ మా యిద్దరికీ శరీరాలు లేనట్టే వుంది. ఆ కాంతి, ఒంటరితనం మా మనసులకి మంత్రం వేశాయి.
ఓ నిర్జనమైన రోడ్డు మీద వెన్నెట్లో, చెట్ల ఆకుల నీడలు నేలంతా పరుచుకున్న చోట, రాధాకృష్ణ ఆమెకు వీడ్కోలు చెప్పి వెళిపోతాడు. వెనక్కి తిరిగి వెళ్ళాలని వుంటుంది. వెళ్తే ఏమవుతుందో తెలిసి అతను ముందుకే సాగిపోతాడు. అతను తిరిగి వస్తాడని ఆమె రాత్రంతా అక్కడే వేచి చూస్తుంది. తర్వాత ఆమె భర్త ఆ రాత్రంతా ఆమె రాధాకృష్ణతోనే వుందని అనుమానిస్తాడు. రాధాకృష్ణను కోర్టు కీడ్చి అంతు చూడాలనుకుంటాడు. పద్మావతి రాధాకృష్ణను కాపాడాలనుకుంటుంది. అతణ్ణి చెన్నై రమ్మని కబురు పంపిస్తుంది. అతను వున్న హోటలుకి వస్తుంది. కోర్టువ్యవహారం లేకుండా చెయబోతున్నానంటుంది, ఇక ఇబ్బందులేమీ వుండవంటుంది, రాధా కృష్ణని కావలించుకుని అతణ్ణింకెప్పటికీ చూడటానికి వీలుపడదంటూ, ఎలా బతుకుతాడో అని దిగులుపడుతుంది, కాస్త ప్రేలాపనగా మాట్లాడుతుంది:
“నా బతుకంతా పాడు చేసుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది. ఆఖరికి ఏం చెయ్యటానికీ వీలులేనప్పుడు, అంతా మించిపోయినప్పుడు. మన సొంతవి, మనవి అనుకున్నవే, నిజంగా మనం యెక్కువగా ప్రేమించేది. మన ప్రాణాన్నిచ్చి కొనుక్కుంటామే, వాటిని మాత్రమే! నేనెంత కఠినురాల్ని అయినా, నేనెంత నా సౌఖ్యమే చూచుకున్నా, రాధా, నా చిన్న రాధా, మొదటి నుంచీ నిన్ను నిష్కపటంగా, నా ఆత్మ నంతటితోనూ ప్రేమించాను. మొదటినుంచి, చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పటినించి. యెప్పుడూ, యెప్పుడూ! కాని నేను మాత్రం నీ దాన్ని కాదలుచుకోలేదు. నా దాన్నే అయివుందామనుకున్నా, నీ దాన్నే అయితే ఇద్దరి ఆనందం, ప్రేమ పోతాయనుకున్నాను... ఇప్పుడు విచారించి లాభమేముంది.”
అంటూ, అంతకుముందే పుచ్చుకున్న ఏదో విష ప్రభావం పెరిగి, అతని చేతుల్లో మరణిస్తుంది. న్యాయమూర్తి తటాలున తలుపు తన్నుకు లోపలికి వస్తాడు:
న్యాయమూర్తి మొహం తెల్లపడ్డది. పద్మావతిని చూస్తూ నుంచున్నాడు. అంత విరోధంలోనూ, అతన్ని చూస్తే జాలి వేసింది. నా వొంక తిరిగాడు. కళ్ళల్లో నీళ్ళున్నాయి. 
“మనిద్దరం... కలిసి... చంపాము... ఇద్దరం... ముక్కల కింద చీల్చుకున్నాము” అన్నాడు. 
పోయినసారి నేనూ పద్మావతీ కలుసుకున్నప్పుడు, ఆ రాత్రి ఒకచోట వుండలేదన్నాను. 
“ఇప్పుడెందుకు? ఇంకెందుకు? ఏమయితేనేం? ఇంకేమయితేనేం?” అన్నాడు చాలా విచారంతో! పాపం!
యిలా “దైవమిచ్చిన భార్య” ముగుస్తుంది. ఈ నవలకు ప్రధాన పాత్ర పద్మావతే. ఆమే రాధాకృష్ణకు దైవమిచ్చిన భార్య. ఆమె చుట్టూనే అంతా తిరుగుతుంది. రాధాకృష్ణ ఈ కథ అంతా సింహావలోకనం చేసుకుంటూ ఉత్తమ పురుష కథనంలో చెప్తూంటాడు. పద్మావతి తీసుకున్న ఒక్క నిర్ణయమ్ కారణంగానే వీళ్ళిద్దరి ప్రేమ కథ ఈ రీతిన సాగుతుందనిపిస్తుంది. ప్రేమికులు ఎక్కువకాలం కలిసివుంటే (పెళ్ళి ద్వారా గానీ, మరే రకంగా గానీ) వాళ్ల ప్రేమలో నూతనత్వం చచ్చిపోతుంది అన్నది ఆమె అభిప్రాయం. ఈ అభిప్రాయం ఏం సూచిస్తుందంటే - ప్రేమికుల్ని చెంత నిలుపుకోవడం కన్నా, వాళ్ళని దూరం పెట్టయినా సరె ప్రేమని చెంత నిలుపుకోవడం ఆమెకు ముఖ్యమని. ప్రియునికన్నా, ప్రేమ ముఖ్యం. ప్రేమలో వున్నామన్న భావనని ఆనందించడానికి అవతలి వ్యక్తిని కేవలం ఒక సాకుగా వాడుకోవడమన్నమాట. యిలా స్వకేంద్రకంగా వున్న వ్యక్తుల్లో వాళ్ళ చుట్టూ వుండే దుర్భేద్యమైన గోడలు వాళ్ళే అయివుంటారు. వాళ్ళని దాటి వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళ నించి వాళ్ళు స్వేచ్ఛపొందలేరు. జాలికి పాత్రులు.

పద్మావతి అంటుంది “నేను మాత్రం నీ దాన్ని కాదలుచుకోలేదు. నా దాన్నే అయివుందామనుకున్నా” అని. పెళ్ళి అయినా ఒకరి స్వాతంత్ర్యాన్ని ఒకరు కాపాడుకోవచ్చు. అదీగాక ప్రేమలో వున్నపుడు మనం ఒకరికి చెందినవాళ్ళమైపోవడంలో తప్పేముంది, అర్పితమైన మన వ్యక్తిత్వాన్ని అవతలివ్యక్తి దుబారా చేసేవాడు కాదన్న నమ్మకం వున్నపుడు. పోనీ అదలా వుంచినా, ప్రేమించిన రాధాకృష్ణ దగ్గర అంత స్వాతంత్ర్యాభిలాషని ప్రదర్శించి, చివరకు భర్త దగ్గర లొంగిపోవడం చూస్తే ఆమె ఆదర్శం డొల్లగా కన్పిస్తుంది.

రాధాకృష్ణా, పద్మావతీ మొత్తం జీవితంలో కలిసివున్నది తక్కువే అయినా, కలిసివున్న ఆ కొన్ని క్షణాల సాంద్రతా వాళ్ళ మొత్తం జీవితాన్ని సార్థకం చేస్తుందని సమాధానపడచ్చు పాఠకులు. కానీ ఆ భ్రమకు కారణం నాయికానాయకులు కలిసివున్న క్షణాల్ని మాత్రమే రచయిత నమోదు చేయడం. మిగతా కాలమ్ సంగతో మరి. రాధాకృష్ణ యిగ్లండులో గడిపిన అయిదేళ్ళూ, టిబెట్లో గడిపిన మూడేళ్ళూ, భార్యతో సఖ్యంగా గడుపుతూ పిల్లల్ని కని పెంచుకున్న సంవత్సరాలూ... ఈ క్షణాలేమీ రచయిత మనకి చెప్పడు. కేవలం పద్మావతీ, రాధాకృష్ణ కలిసి వున్న కొన్ని రోజుల, నెలల కాలపు నిడివిని మాత్రమే సవిస్తారంగా చెప్తాడు. మధ్యలో ఎంతెంత కాలం కొట్టుకుపోయిందోనన్న స్పృహ కూడా పెద్దగా కలగదు. ఈ అనాథ ప్రేమ కథ సార్థకమనిపిస్తే గనక అదీ ముఖ్య కారణం.
* ——— * ——— *
అయితే నేను చలం పాత్రల తీరుతెన్నుల్ని ఎందుకు సమీక్షిస్తున్నాను. ఆయన రాసిన తీరుని ఎందుకు పట్టించుకోవటం లేదు? ఎందుకంటే, ఆంగ్ల రచయిత హెచ్.జి. వెల్స్ రాసిన “ద పాషనేట్ ఫ్రెండ్స్” గురించి ప్రస్తావించకుండా, “దైవమిచ్చిన భార్య” సుగుణాల్నీ దుర్గుణాల్నీ పూర్తిగా చలానికి అంటగట్టి అంచనాకట్టలేము. చలం ఈ నవలను హెచ్.జి. వెల్స్ రాసిన ఆంగ్ల నవల నుండి ప్రేరణ పొంది రాసాడని చాలామందికి తెలుసు. యిపుడు చలాన్ని ఈ నవల విషయమై అభినందించాలన్నా విమర్శించాలన్నా అసలు ఇందులో ప్రేరణ శాతమెంతో, అనుకరణ శాతమెంతో తెలుసుకోవాలి. అయితే ఈ విషయం తెలుసుకోవడంకోసమని “ద పాషనేట్ ఫ్రెండ్స్” ఆసాంతం చదివేటంత ముఖ్యం కాదు నా ప్రస్తుతావసరం. కాబట్టి ఆ నవల సంక్షిప్త సారాంశం కోసం వెతికాను. దొరికిందాన్ని బట్టి చలం “దైవమిచ్చిన భార్య”లోని కథా, పాత్రలూ, కొన్ని సంఘటనలూ... అన్నీ దాదాపు మూలం నుండి దిగుమతి చేసుకున్నవే అని తెలుస్తోంది. అయితే మూల రచన కేవలం ప్రేమ గురించే కాదు. యిద్దరు బాల్య స్నేహితుల ఆదర్శాల గురించి. అవి కాల క్రమేణా ఏ మార్పులకు లోనై ఏ పర్యవసానాలకు చేరుకున్నాయన్న దాని గురించి. కథానాయకుడు స్టీఫెన్ తన కొడుకుని ఉద్దేశించి రాస్తున్నట్టు మొదలవుతుంది మూలమ్. ఈ ఎత్తుగడ చలం రచనలో లేదు. బహుశా చలాన్ని ఈ నవలలో ఆకర్షించింది నాయికానాయకుల అనుబంధమయి వుంటుంది. అందుకే అది మాత్రమే మూలం నుండి తీసుకున్నాడు.

హెచ్.జి. వెల్స్ రచనల్లో “ఇన్విసిబుల్ మాన్” “టైంమెషీన్” “వార్ ఆఫ్ ద వరల్డ్స్” లాంటి ఫాంటసీలు పొందినంత ప్రాచుర్యం ఆయన ఇతర వాస్తవిక ఇతివృత్తాల రచనలకు లభించలేదనుకుంటాను. వెబ్ అంతా వెతికినా “ద పాషనేట్ ఫ్రెండ్స్” కథా సారంశం ఈ ఒక్క బ్లాగులో మాత్రమే కన్పించడం దీనికి తార్కాణం. రచన మొత్తం మాత్రం గూటెన్‌బర్గ్ వాళ్ళ దగ్గర లభ్యం.
The Passionate Friends is written by a father to his young son as a sort of didactic autobiography. As a young man, Stephen forms vague ambitions of serving the empire by standing for Parliament. His idealism is flimsy stuff, however, when pitted against his passion for Mary. Mary wants to be more than a wifely ornament, and, when Stephen insists that they marry, she balks, afraid to become his possession. Her own ambitions are just as vague as her lover’s, but she is remorseless in using her sense of futility to draw out Stephen’s love. … But she finally submits to social custom and marries Lord Justin, a wealthy and respectable older man. She stipulates, however, that the marriage never be consummated.
Separated for some years, Mary and Stephen eventually come back together, and the conditions of her marriage give Mary the idea that she can meet Stephen without reservations. It is difficult to guess just how far the lovers go, but discretion is not something either of them practices. … Their intimate relationship comes to Justin’s attention, and he insists that Stephen leave the country. 
The three-year exile that sends Stephen around the world is the second that occurs due to complications with Mary. The first, following Mary’s marriage, Stephen took voluntarily to fight the Second Boer War. 
Stephen repeatedly writes that he is trying for honesty in his portrait of Mary, but it is impossible to see her as anything other than an egotistical manipulator. Rather than elevated by his passion, Stephen is enervated by Mary’s self-centered nature. Mary does care for Stephen, she may even be said to love him, but she is unable to realize unselfish love because she cannot see beyond her own needs. The resulting tragedy is not so much Mary’s suicide as it is Stephen’s insistence on sacrificing his chance for happiness by loving the wrong woman.
ఈ సారాంశం చదివితే చాలు, చలం చాలావరకూ ఉన్నదున్నట్టు వెల్స్ నవల నుండి తీసుకున్నాడని తెలుస్తుంది. అయితే మూలాన్ని కాస్త అలవోకగా అటూయిటూ పరిశీలించిన మీదట తేలిందేమిటంటే, చలం కేవలం కథనే కాదు, సన్నివేశాల్ని, సంభాషణల్ని కూడా చాలాచోట్ల యధాతథంగా వాడుకున్నాడు. ఉదాహరణకి రాధాకృష్ణా, పద్మావతీ పెద్దవాళ్ళయిన తర్వాత తొలిసారి కలిసినపుడు మాట్లాడుకునే మాటలు:
“అపుడు యెన్ని ఆటలు తోచేవి! వాటి సంగతి తలుచుకుంటూ వుంటా.” 
“నేనూనూ; నీ కర్ర ఒకసారి విరిచేశాను జ్ఞాపకముందీ? అది నేను పుచ్చుదంటాను. మంచిదంటావు నువ్వు!” 
ఇద్దరం నవ్వాము. “అప్పుడంత స్నేహంగా వుండేవాళ్ళమే, ఇప్పుడింత కొత్త యెందుకు మనకి?” అని యిద్దరికీ తట్టింది. 
“అప్పుడు కొట్టినట్టు యిప్పుడు నిన్ను చెంపకాయ కొట్టను కదా!... నేను గీకాను కదూ నిన్ను?” 
ఆమె అంత చనువుగా మాటాడేటప్పటికి చాలా సంతోషం కలిగింది. 
“ఛా, లేదు, లేదు” 
“గీకానులే” 
“ఛా లేదు” 
“యెందుకు లేదంటావు? ఒప్పుకుంటేనేం? మనిద్దరం పెద్దవాళ్ళం అవుతున్నాము. ఒచ్చిన యిబ్బంది అదీ. పోట్టాట వచ్చినా, యింకా కాళ్ళూ చేతులూ ఉపయోగపరచం గదా?”
ఈ సంభాషణ మూలంలో వున్న తీరిది:
"I think so often of those games we used to invent," she declares. 
"So do I," I say, "so do I." And then with a sudden boldness: "Once I broke a stick of yours, a rotten stick you thought a sound one. Do you remember?" 
Then we laugh together and seem to approach across a painful, unnecessary distance that has separated us. It vanishes for ever. 
"I couldn't now," she says, "smack your face like that, Stephen." 
That seems to me a brilliantly daring and delightful thing for her to say, and jolly of her to use my Christian name too! "I believe I scratched," she adds. 
"You never scratched," I assert with warm conviction. "Never." 
"I did," she insists; and I deny, "You couldn't." 
"We're growing up," she cries. "That's what has happened to us. We shall never fight again with our hands and feet, never—until death do us part."
ఇక్కడ చలం రచన ప్రేరణా కాదు, అనుసరణా కాదు; అనువాదం అనిపించేట్టు వుంది. “దైవమిచ్చిన భార్య” చదువుతూ నేను పక్కన పెట్టుకున్న నోట్సులో ఒక చోట యిలా రాసుకున్నాను. “చలం రచనా విన్యాసంలో గొప్పగా అనిపిస్తుందేమిటంటే, ఒక సన్నివేశంలోని పాత్రల మనసుల్లో అంత సునాయాసంగా ప్రవేశించగలిగే రచయితలు మనకు అరుదు.” నాకు యిలా అనిపింపజేసిన సన్నివేశం రాధాకృష్ణా, పద్మావతిల సంబంధం గురించి ఆమె భర్తకు తెలిసిన సందర్భంలో వస్తుంది. తెలిసిపోయాకా అక్కడ పెద్ద గొడవ మొదలవుతుంది. రాధాకృష్ణకు మాత్రం లోపల ఆనందంగానే వుంటుంది – భర్తకి తెలిసిపోయినందుకు. ఇక పద్మావతి తనతో వచ్చేస్తుందని అనుకుంటాడు. అనుకోవడమే కాదు, ఆమె వస్తే ఆమెను ఎక్కడికి తీసుకువెళ్లాలి, హోటల్లో వుండనిస్తారా యిద్దర్నీ... యివన్నీ కూడా, అక్కడ ప్రస్తుతం జరుగుతున్న గొడవకు సంబంధం లేని విషయాలను, ఆలోచిస్తూంటాడు. మామూలుగా మనుషుల మనసులు అలానే పనిచేస్తాయి. వింత వింత పోకడలు పోతూంటాయి. అందుకే యిది నాకెంతో సహజంగా అనిపించింది. ఒక రచయిత తన పాత్రలోకి పూర్తిగా పరకాయప్రవేశం చేయగలిగితే తప్ప, రచనలోని వివరాల్లో ఈ నైశిత్యం రాదు:
వెంటనే పద్మావతి నాతో వచ్చేస్తుందనే అనుకున్నాను. చుట్టూ వున్న వుత్తరియ్యంతోటే. ఇంకేమీ బట్టలు తీసుకోవడానికి కూడా బహుశా వీలుండక, ఎలా నాతో బయటికి వస్తుందా అని కూడా సందేహపడ్డాను. ఇద్దరం వొకరి చేతులు వొకరం పట్టుకుని ఆ ఇంటిలోంచి అట్లానే బయలుదేరి చెన్నపట్నం వీధుల్లో నడిచిపోవడం కూడా కళ్ళకి కట్టినట్టు కనబడ్డది. హోటల్లో పద్మావతి కూడా వుండవచ్చా? వీల్లేకపోతే యెక్కడికి వెళ్ళాలి? అని సందేహం కూడా కలిగింది.
నేను మూలాన్ని పరిశీలించేటపుడు నాకు ఇది కూడా గుర్తుకు వచ్చింది. చలానికి నా పొగడ్త ఉదారంగా ఇచ్చేసేముందు ఒకసారి మూలం తరచి చూద్దామనిపించింది. దురదృష్టవశాత్తూ, అది కూడా యధాతథంగా వుంది.
It seemed to me there was nothing for it now but that Mary should stand by my side and face Justin with the world behind him. I remember my confused sense that presently she and I would have to go straight out of Martens. And she was wearing a tea-gown, easy and open, and the flimsiest of slippers. Any packing, any change of clothing, struck me as an incredible anti-climax. I had visions of our going forth, hand in hand. Outside was the soughing of a coming storm, a chill wind drove a tumult of leaves along the terrace, the door slammed and yawned open again, and then came the rain. Justin, I remember, still talking, closed the door. I tried to think how I could get to the station five miles away, and then what we could do in London. We should seem rather odd visitors to an hotel—without luggage. All this was behind my valiant demand that she should come with me, and come now.
మొదటి నవల “శశిరేఖ”లో నాకు చిరాకు పుట్టించిన మామూలుతనం నుండి, చలం కేవలం తన రెండో నవల్లోనే అతితక్కువ కాలంలో పరిణతి సాధించాడని అనుకోవడానికి ఏవైతే అంశాలు తోడ్పడ్డాయో — పడికట్టుతనపు పట్టాలు దాటి ఏయే వినూత్న వివరాలు “దైవమిచ్చిన భార్య”ని మంచి నవల చేసాయో — అవన్నీ నిజానికి హెచ్.జి. వెల్సు నవల్లోంచి వచ్చినవే. నవల చివర్లో గుండెల్ని కోసే క్లుప్తతతో నన్ను కదిలించిన (పైన ఉదహరించిన) రాధాకృష్ణ, న్యాయమూర్తిల ముగింపు సంభాషణ కూడా:
"Stratton," he said, "we two—— We killed her. We tore her to pieces between us...." 
I made no answer to this outbreak. 
"We tore her to pieces," he repeated. "It's so damned silly. One gets angry—like an animal." 
I became grotesquely anxious to assure him that, indeed, she and I had been, as they say, innocent throughout our last day together. "You were wrong in all that," I said. "She kept her faith with you. We never planned to meet and when we met——. If we had been brother and sister——. Indeed there was nothing." 
"I suppose," he said, "I ought to be glad of that. But now it doesn't seem to matter very much. We killed her.... What does that matter to me now?"
మూల నవలపై ఈ స్థాయిలో ఆధారపడ్డాకా యిక రచనా శైలి గురించి చర్చించవలసి వస్తే ఎలా రాసాడన్న దానికన్నా, మూలం నుండి ఎలా ప్రేరణ పొందాడు, మూలాన్ని ఎలా వాడుకున్నాడు అన్న విషయాలు పరిశీలించాల్సి వస్తుంది. అది నాకు అనవసరం. కాబట్టి వదిలేస్తున్నాను.

అయితే మూలాన్ని బట్టి చూసినపుడు, పద్మావతి చలం కథానాయికలా ఎందుకు అనిపించదో ఒక క్లూ దొరుకుతుంది. పద్మావతి హెచ్.జి. వెల్సు కథానాయిక. బహుశా చలం కథానాయిక “యెక్కడికో అసహ్యమైన చోటికనుకో యే సందుల్లోనో, గుడిశల్లో”నో ప్రేమ కోసం ప్రియుడితో వెళిపోవడానికి సందేహించదు. బహుశా ఈ నవల రాసాకే చలానికి అలాంటి కథానాయిక మనసులో మెదిలిందేమో. మెదిలి, కదిపి, మరో ఐదేళ్ళ తర్వాత “మైదానం”లో రాజేశ్వరిగా వెలికి వచ్చిందేమో. అదో ఊహ!
.

12 comments:

  1. నేను ఇది చదవగానే వ్రాద్దామనుకొన్నదంతా వ్రాస్తే అది చలం మీద ఈ పుస్తకం మీద నా అభిప్రాయం అవుతుంది. అది అప్రస్తుతం కనుక మీ నోట్స్ మీద నా అభిప్రాయాలు మాత్రమే వ్రాస్తాను.
    ముందుగా ఇలా నిష్పక్షపాతంగా (చలం అభిమానిలానో, చలాన్ని ఆడుపోసుకొనే వాళ్ళలానో కాక) వ్రాయటానికి ఉపక్రమించినందుకు మీకు అభినందనలు.

    ౧. పద్మావతి ప్రేమ: మీరు ఒక చట్రం లోనించి చూస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని ముఖ్యంగా అమెకు రాధాకృష్ణ పై ఉన్న ప్రేమను తక్కువ చేసారని పిస్తోంది. తెలుగు సిన్మాల్లోలా, కధల్లోలా అమె త్యాగాలు చేస్తూ కష్టాలు ఆహ్వానిస్తుంటేనే ఆమె ప్రేమ నిజం అవుతుందా?
    ఇద్దరి మూర్ఖత్వం వల్ల ట్రాఫిక్ జాం అయిందనుకోండి. ఒకడు తనను తాను తిట్టుకొంటాడు. ఒకడు వాళ్ళను చాటుగా తిడుతూ ఉంటాడు. ఒకడు వెళ్ళి వాళ్ళను కొడతాడు. కోపం అందరిదీ ఒకటే, వ్యక్తీకరణ వాళ్ళ ధైర్యం, శక్తి లాంటి ఇతర అంశాల పై ఆధారపడి ఉంటుంది.
    మైదానం రాజేశ్వరి కంటే పద్మావతి తక్కువ ప్రేమించలేదు. ఆమె ఎంచుకొన్న మార్గంవేరు. ఈమెది వేరు. ఈమె జమిందారిణి, తెలివిగలది. ఈమె పరిస్థితులు వేరు. ఆమెవి వేరు.

    ReplyDelete
  2. ౨.
    జీవితపు నిరాసక్తత చలిగా ముప్పిరిగొని ఆత్మను కొంకర్లు తిరిగిపోయేలా చేస్తున్నపుడు మాత్రమే ఆ ప్రేమ యజ్ఞగుండాన్ని వెలిగించి చలికాచుకుని, ఆ నిత్యాగ్నిహోత్రం స్వభావానుసారం తన కన్నీటి ఆజ్యాన్నిమ్మని నాలుకలు చాచినపుడు మాత్రం ఆర్పేసి దూరం పారిపోవాలి.

    ఈ వాక్యం చాలా బాగుంది. కానీ ఇది ఆమె తత్వం అని ఆ పుస్తకం ఆధారంగా చెప్పలేము. పద్మావతి ఎప్పుడూ చలిలో వంకర్లు తిరగలేదు, రాధాకృష్ణను కలవటానికి తనకు తానై ప్రయత్నం చెయ్యలేదు. అమెలో ఎప్పుడూ వెలుగుతుండే జ్యోతి ఆమెకు చాలు. అమెకు దాన్ని పెద్ద కార్చిచ్చు చెయ్యటం దానికి అన్నీ ఆజ్యం పొయ్యటం ఇష్టంలేదు. రాధాకృష్ణ కు ఆ తృప్తి లేదు. మళ్ళీ అతని ప్రవృత్తి కి ఆమె మనస్తత్వానికి ఉన్నతేడానే ఒకే ప్రేమను ఇద్దరూ వేరువేరుగా కోరుకొనటానికి కారణం. (పార్వతి, దేవదాసు లా)

    ReplyDelete
  3. ౩. ఒక ఇంగ్లీషు పుస్తకమో, ప్రెంచి సినిమానో చూసి ఇది తెలుగులో వ్రాస్తే మంచి పాపులారిటీ వస్తుందని కాపీచెయ్యటం వేరు, ఒక క్రియేటివ్ వర్క్ చూసి/చదివి, దానిలోని విషయంతో ప్రభావితం అయ్యి, పాత్రలను తలచుకొంటూ, మిత్రులతో చర్చించుకొంటూ ఊగిపోయి ఆగలేక వ్రాసే వ్రాతలు వేరు. చలం పై ఇంగ్లీషు పుస్తకాల ప్రభావం అలాంటిది. దానికి అనువాదం అని పేరు పెట్టేముందు ఆ పుస్తకం కూడా పూర్తిగా చదవాల్సిన బాధ్యత మీకు ఉందికదా. పోలిక ఎక్కడో చెప్పారు. తేడా ఎక్కడో తెలుసుకోవాలి, తెలియచెప్పాలి కదా. లేకుంటే అర్ధ సత్యం చెప్పినట్లే కదా. అసలు తేడాలేదంటే అప్పుడు అనువాదం.

    ReplyDelete
  4. మీ రచనలు పుస్తకం.net లో చాలా సార్లు చదివాను. మీ బ్లాగు చూడటం ఇదే మొదలు. మీరు చలం గూర్చి వ్రాసినన్నాళ్ళూ నా బ్రౌజర్ బుక్ మార్క్ల్లో ఉంటారు.:) . వీలైతే నా చలం బ్లాగ్ ఒక్కసారి చూడండి.
    http://telugu-chalam-quotes.blogspot.com/

    ReplyDelete
  5. మైత్రేయి గారు,

    ౧. పద్మావతికి రాధాకృష్ణపై వున్న ప్రేమపై నాకెలాంటి అనుమానమూ లేదు. అది నిజమైనదనే నేనూ చెప్పాను. "ఆమెకు అతనిపై నిజమైన ప్రేమ వుంది. కానీ ఆమెకు ప్రేమకున్న బలం పైనే నిజమైన నమ్మకం లేదు." - అన్నది నా వాక్యం. నేను విమర్శించింది ఆ పాత్ర వెనుక వున్న ఒక మూస తత్త్వాన్ని. Byronic attitudeని. నిత్యమూ కలిసుంటే ప్రేమలో రసత్వం తగ్గిపోతుందని రాధాకృష్ణకు దూరంగా వుంటుందామె, నిత్యం కలిసివుండగల అవకాశం వున్నా కూడా. ప్రేమని నిత్యం కొత్తగా మత్తెక్కించే పానశాలగా కాక, ప్రేమ తత్త్వాన్ని వేదనానందాల సమమిశ్రమంగా చూడలేని అంగీకరించలేని ఆమె కురచ చూపు గురించి నేను చెప్పింది.

    మీ ట్రాఫిక్ జాం పోలికనే పాఠకులుగా మనకీ వర్తింపజేసుకుంటే, ఏమో, నా ప్రతిస్పందన తీరు యిది.

    ౨. >> పద్మావతి ఎప్పుడూ చలిలో వంకర్లు తిరగలేదు, రాధాకృష్ణను కలవటానికి తనకు తానై ప్రయత్నం చెయ్యలేదు. అమెలో ఎప్పుడూ వెలుగుతుండే జ్యోతి ఆమెకు చాలు.

    యిది చలం హీరోయిన్ల పట్ల మనకు సామాన్యంగా వుండే ఆదర్శభావన అయితే అవచ్చు గానీ, పద్మావతి విషయంలో ఇది నిజమనటానికి పుస్తకంలో ఎక్కడా ఆధారం లేదు.

    పెళ్ళయిన తర్వాత పద్మావతే ఎపుడూ రాధాకృష్ణను కలవడానికి ప్రయత్నిస్తుంది. అతను అయిదేళ్ళు యింగ్లాండులో గడిపి వచ్చిన తర్వాత, అతని సభకు హాజరై ఆమే వచ్చి కలుస్తుంది. న్యాయమూర్తికి (భర్త) విషయం తెలిసి ఆమెపై కట్టడి విధించినపుడు, ఆమె వాటికి రాధాకృష్ణనూ ఒప్పించినపుడు, రాధాకృష్ణ వాటికి లొంగి తిరిగి తన జీవితంలో తాను పడతాడు. మళ్ళా ఆమే ఉత్తరాల్తో బంధాన్ని పునరుద్ధరిస్తుంది.

    పార్వతీ, దేవదాసుల తరహాల్నే ఈ కథకు అన్వయిస్తే, యిక్కడ పద్మావతే దేవదాసు, రాధాకృష్ణ పార్వతి. రాధాకృష్ణకు తనకేం కావాలో తనకు తెలుసు. పద్మావతికే అది తెలియదు. దానికి ఆమె చివరికి పశ్చాత్తాప పడుతుంది కూడాను.

    >>> “నా బతుకంతా పాడు చేసుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది. ఆఖరికి ఏం చెయ్యటానికీ వీలులేనప్పుడు, అంతా మించిపోయినప్పుడు. మన సొంతవి, మనవి అనుకున్నవే, నిజంగా మనం యెక్కువగా ప్రేమించేది. మన ప్రాణాన్నిచ్చి కొనుక్కుంటామే, వాటిని మాత్రమే! నేనెంత కఠినురాల్ని అయినా, నేనెంత నా సౌఖ్యమే చూచుకున్నా, రాధా, నా చిన్న రాధా, మొదటి నుంచీ నిన్ను నిష్కపటంగా, నా ఆత్మ నంతటితోనూ ప్రేమించాను. మొదటినుంచి, చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పటినించి. యెప్పుడూ, యెప్పుడూ! కాని నేను మాత్రం నీ దాన్ని కాదలుచుకోలేదు. నా దాన్నే అయివుందామనుకున్నా, నీ దాన్నే అయితే ఇద్దరి ఆనందం, ప్రేమ పోతాయనుకున్నాను... ఇప్పుడు విచారించి లాభమేముంది.”

    [CONTINUED...]

    ReplyDelete
  6. ౩. నేనూ రాస్తాను కాబట్టి నాకు తెలుసు ఒక్కోసారి కొన్ని రచనల/ సినిమాల ప్రభావం యెలా వుంటుందో. అది మనలో రేపే ప్రేరణ ఏ రీతిన వెలికి వస్తుందో. నేను పైన ఉదహరించిన సామ్యాలు చదివినట్టయితే అది ప్రేరణ అనో, లేక ఊగిపోయి ఆగలేక రాసిన రాత అనో అనిపించలేదు. పైన చూపించినవి మచ్చుకి మాత్రమే; అలాంటివి యింకా చాలా వున్నాయి. మక్కికి మక్కీ వాక్యాల, పేరాల, సన్నివేశాల అనుకరణలు ఎన్నో. ఊదాహరణకి పైన మీ రెండో పాయింటుకు సమాధానమిస్తూ నేను ఉదహరించిన పేరానే తీసుకోండి. దాని మూలం ఇది:

    "All my life I've been wrong, Stephen, and now I know too late. It's the things we own we love, the things we buy with our lives.... Always I have been hard, I've been a little hard.... Stephen, my dear, I loved you, always I have loved you, and always I have tried to keep myself.... It's too late...."

    ఇవన్నీ మూలాన్ని పక్కన పెట్టుకు రాసినట్టున్నాయి. ప్రేరణతో రాసేవాళ్ళు అలాచేయరు. అలా చేసినా, ఆ స్థాయిలో ప్రేరణ పొందినవాడు, మూలం ప్రభావాన్ని ఎక్కడోఅక్కడ ఖచ్చితంగా పేర్కొంటాడు. మనల్ని అంతగా ప్రేరేపించిన పుస్తకం పట్ల మన కనీస మర్యాద. చలం అదెక్కడా చేయలేదు.

    అలాగే నేను మూలానికీ దీనికీ మధ్య తేడా ఏమిటో కూడా పైన చెప్పాను:

    >>> "దొరికిందాన్ని బట్టి చలం “దైవమిచ్చిన భార్య”లోని కథా, పాత్రలూ, కొన్ని సంఘటనలూ... అన్నీ దాదాపు మూలం నుండి దిగుమతి చేసుకున్నవే అని తెలుస్తోంది. అయితే మూల రచన కేవలం ప్రేమ గురించే కాదు. యిద్దరు బాల్య స్నేహితుల ఆదర్శాల గురించి. అవి కాల క్రమేణా ఏ మార్పులకు లోనై ఏ పర్యవసానాలకు చేరుకున్నాయన్న దాని గురించి. కథానాయకుడు స్టీఫెన్ తన కొడుకుని ఉద్దేశించి రాస్తున్నట్టు మొదలవుతుంది మూలమ్. ఈ ఎత్తుగడ చలం రచనలో లేదు. బహుశా చలాన్ని ఈ నవలలో ఆకర్షించింది నాయికానాయకుల అనుబంధమయి వుంటుంది. అందుకే అది మాత్రమే మూలం నుండి తీసుకున్నాడు."

    అయినా నేను ఇదంతా తప్పనలేదు. మూలంపై ఈ స్థాయిలో ఆధారపడ్డాకా, యిక "దైవమిచ్చిన భార్య"నవలను శిల్ప విషయకంగా చర్చించడం అనవసరం అన్నాను.

    ***

    చలం నా అభిమాన రచయితల్లో ఒకరు. ఆయన మ్యూజింగ్స్‌ ప్రభావం నా మీద చాలా వుంది. నిన్ననే చదివిన "అమీనా"లో అయితే తెలుగు సాహిత్యంలో మరెక్కడా కన్పించనన్ని అద్భుతమైన పేజీలున్నాయి. అయితే ఈ "దైవమిచ్చిన భార్య" మాత్రం నన్ను అంతగా ఆకట్టుకోలేదు. ఇది చలం పూర్తిగా రూపం దిద్దుకోకముందు రాసిన కథ. మూలాన్ని ఏ రీతిన తెలుగు చేయాలనే శ్రద్ధే కన్పిస్తుంది తప్ప, చలం చాలా రచనల్లా ఆత్మనంతా కలంలోకి నిశ్వసించి రాసింది కాదనిపించింది. చలం పుస్తకాలన్నీ దాదాపు యిదివరకూ యేళ్ళ క్రితం చదివినవే. ఇపుడు చేస్తున్నదంతా పునశ్చరణ మాత్రమే.

    మీ బ్లాగుని ఇదివరకూ చూసాను. నాకు నచ్చింది. కొంత ఉపయోగపడింది కూడా. కృతజ్ఞతలు!

    ReplyDelete
  7. మెహర్ గారు, ఓపిగ్గా సమాధానాలు ఇచ్చినందుకు ధాంక్స్ అండి. మీలా మళ్ళీ పుస్తకం చదివితే ఇంకొంచెం లోతుగా చర్చించగలుగుతానేమో. ఏదైనా మీ పోస్ట్ చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ చలాన్ని చదవాలనిపించే ఉత్సాహాన్ని ఇస్తోంది.
    మీ పుస్తకం గొప్పగా తయారవ్వాలని కోరుకొంటున్నాను.

    ReplyDelete
  8. చలం నవలలు దాదాపు అన్నీచాలాకాలం కిందటే చదివాను ,"దైవమిచ్చిన భార్య "తోసహా.శశిరేఖ,మైదానం ,మీద నా పుస్తకాల్లో చర్చించాను.చలం స్త్రీ పాత్రలు క్లిష్టమైనవి. ఒకోసారి వాటి
    మీద కోపం వస్తుంది.హెచ్. జి. వేల్సు నవల చదవలేదు.దానినిఅనుసరించి చలం రాసివుంటే ఆ విషయం ఎక్నాలేద్జ్ చెయ్యాలి.చెయ్యకపోతే ఆయనది తప్పే .ఈ విషయం మీరు విసదపరచగలరు. చలం నాయికల వంటి వారుచిత్రంగా అనిపించినా సమాజంలో అరుదుగా కనిపిస్తూ వుంటారు.ఎక్కువమంది మాత్రం సామ్ప్రదాయంగానే వుంటారు ,వారి అంతర్గత
    ఆలోచనలేమయినా. రమణారావు.ముద్దు

    ReplyDelete
  9. చాలా బావుంది. మైత్రేయిగారితో చర్చకూడా చాలా బావుంది. వెల్సు నవలకి అనుసరణ/అనువాదం అన్నది ఇప్పుడే తెలుసుకున్న విషయం. మీరు ఉదహరించిన భాగాలు చూస్తే చలం పనిగట్టుకుని అనువాదం చేసినట్టే ఉన్నది - దీన్ని ప్రేరణగా తీసుకోలేము.
    మరికొన్ని చలం రచనలతోబాటు ఈ నవలని మొదటిసారి నేను కాలేజి వయసులో చదివాను. చాలా బలమైన ముద్ర వేసింది. స్పష్టంగా ఇదీ అని తెలీదు గాని చాలా కాలం ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. సుమారు రెండేళ్ళ కిందట చేతికి దొరికిన చలం నవల్లు కథలు అన్నీ మళ్ళీ ఓ సారి చదివినప్పుడుకూడా ఈ నవల నాకు ప్రత్యేకంగా అనిపించింది. బహుశా అది మూలంలోనే ఉన్న బలం కావచ్చు. కానీ ఎక్కడా ఈ ఆలోచన, ఈ సంభాషణ ఇంగ్లీషులో పుట్టింది అనే అనుమానం రానట్టుగా రాసిన ఆ భాష, ఆ సున్నితమైన తెలుగు వ్యక్తీకరణ మాత్రం చలం మనకిచ్చినదే.

    వెల్సుగారిని సైఫై రచయితగానే ఎరుగుదును. కానీ సుమారు పదేళ్ళ కిందట వేలంలో కొన్ని ఆంగ్లపుస్తకాలు కొన్న సందర్భంలో ఆయన నవల Marriage అనేది నా చేతికివచ్చింది. అదికూడా దీనిలాగే చాలా విచిత్రమైన మానవ సంబంధాల నవల. ప్రేమకథ పెళ్ళితో అంతం అయిపోతే నిజజీవిత కథ పెళ్ళితోనే మొదలవుతుంది అని .. ఒక మధ్యతరగతి జంట వైవాహిక జీవితాన్ని గురించిన కథ. నాకిప్పుడు స్పష్టంగా గుర్తులేదు గాని చదివినప్పుడు మాత్రం చాలా ఇంప్రెస్సయినట్టు గుర్తుంది.

    మరోమాట - ఇక్కడ చెప్పిన నవల్లోనూ, మేరేజి నవల్లోనూ చుట్టూతా ఉన్న సాంఘికవాతావరణం వాస్తవికమైతే కావచ్చుగానీ కథలో ముఖ్య పాత్రలు మాత్రం చాలా విచిత్రంగా విపరీతంగా కనిపిస్తారు, మన ఊహకి అందని వింత పనులు చేస్తారు. వాళ్ళ ఉద్రేకాలుగానీ కోరికలుగానీ మోటివేషన్స్ (తెలుగు?)గానీ మనకి ఒక పట్టాన అర్ధం కావు (ఉదా. పైన పద్మావతి వ్యక్తిత్వాన్ని గురించిన చర్చ). వెల్సుగారి ఇతర సాంఘిక రచనల్లో కూడా ఈ లక్షణం ఉన్నదేమో మరి. మంచి సాహిత్యంలో ముఖ్య పాత్రలకి ఉండే ఈ "అసాధారణత్వాన్ని" గురించి ఆలోచించినప్పుడల్లా నాకు తమాషాగా ఉంటుంది. జనాలు మొత్తుకుంటూ ఉంటారు - కథలో పాత్రలాగా ఎవరూ ఉండరు, అలా ఎవరూ ప్రవర్తించరు, ఒకేళ ఉన్నా చాలా తక్కువ మంది ఉంటారు, ప్రపంచంలో 99 శాతం ఇలా ఉండరు - అని. ఎక్కడో లక్షల్లోనో కోట్లలోనో ఒక్కరైన అసాధారుణుల్ని గురించే సాహిత్యం పట్టించుకునేదీ, పాత్రలుగా నిలబెట్టేదీనూ.

    ReplyDelete
  10. మీరు చలం రచనల్ని గురించి పుస్తకం రాసే ప్రయత్నంలో ఉన్నారన్న విషయం ఇప్పుడే గమనించాను. అభినందనలు మరియి ఆల్దిబెస్టులు. పుస్తకం తయారయ్యాక తెలియబరుస్తారుగా!

    ReplyDelete
  11. కొత్తపాళి గారు, తప్పకుండా తెలియజేస్తాను. పుస్తకంలో చలం రచనల్ని గురించి తక్కువే వుంటుంది. చలం జీవితం గురించే ఎక్కువ వుండవచ్చు. మరుపురాని కొందరు తెలుగు మనీషుల్ని పరిచయం చేస్తూ వస్తున్న పుస్తకాల సిరీస్‌లో నాదీ ఒకటి, అంతే.

    ReplyDelete
  12. నా పై వ్యాఖ్యల్లో ఒక సవరణ: "దైవమిచ్చిన భార్య" మొదటి ముద్రణలో ఆ నవల హెచ్.జి. వెల్సు నవల నుండి తీసుకుని రాయబడిందని పేర్కొనబడిందట. అలాగే "ప్రేమలేఖలు"లో కూడా ఈ విషయం చలం ఒక చోట పేర్కొన్నాడని నవీన్ తన సాహిత్య వ్యాసాల్లో రాసాడు.

    ReplyDelete