February 14, 2017

వచనానిది వేరే కవిత్వం



‘‘పుస్తకాలనేవి కవిత్వానికి ఒక సందర్భం మాత్రమే’’ (Books are only occasions for poetry) అని అంటాడు బోర్హెస్‌. ఈ మాటలోని భావాన్నే కొనసాగిస్తే, అసలు మనం కవిత్వం అని పిలిచే ప్రక్రియ కూడా కవిత్వానికి ఒకానొక సందర్భం మాత్రమే అనవచ్చు. పై మాటకు ముందే బోర్హెస్‌, ‘‘జీవితం సాంతం కవిత్వ నిర్మితం. కవిత్వమేం పరాయిది కాదు, చుట్టుపక్కలే నక్కి వుంటుంది. ఏ క్షణమైనా మన మీదకు గెంతవచ్చు’’ అంటాడు. అలా మీదకు గెంతే కవిత్వాన్ని అక్షరాల్లో పట్టుకునేందుకు పద్యమెంత సాయపడుతుందో, వచనమూ అంతే సాయపడుతుంది. (ఈ వ్యాసంలో ‘పద్యం’ అంటే నా ఉద్దేశం ఛందోబద్ధ, వచన కవిత్వాలు రెండూను.)

మనవాళ్లు ‘‘వాక్యం రసాత్మకం కావ్యం’’ అన్నారు. నోటి మాటల తీరులో ఉండి, వ్యాకరణబద్ధమైన వాక్యాల సంచయమైతే చాలు అది వచనం అవుతుంది. 'Prose' అనే పదానికి కొన్ని ఇంగ్లీష్‌ నిఘంటువుల్లో కనీసం స్వతంత్రమైన నిర్వచనం కూడా లేదు. దానికి పద్యం కంటే వేరైనది అని మాత్రమే అర్థం చెబుతారు. ఆ పదాన్ని విశేషణంగా వాడినపుడు ‘చప్పగా’, ‘నీరసంగా’ అనే అర్థంలో వాడతారు. కానీ ఇక్కడ నేను చరిత్ర పుస్తకాల్లోనూ, ఆత్మకథల్లోనూ, వార్తాపత్రికల్లోనూ, కరపత్రాల్లోనూ, వ్యాసాల్లోనూ, ప్రభుత్వ ఆఫీసు లేఖల్లోనూ కనిపించే వచనం గురించి మాట్లాడటం లేదు. వచనం అంటే ఇక్కడ నా ఉద్దేశం కథలు చెప్పే వచనం. ఎందుకంటే, మిగతావాటిలా గాక కథా, కవిత్వమూ ఊహాశక్తికి సంబంధించినవి. రష్యన్‌ రచయిత వ్లదీమర్‌ నబొకొవ్‌ సాహిత్యం పుట్టుక గురించి ఇలా ఊహిస్తాడు: ‘‘ఒక ఆదిమ బాలుడు ‘తోడేలు తోడేలు!’ అని లోయలోంచి అరుచుకుంటూ వచ్చినప్పుడూ, అతడ్ని వెంటాడుతూ పెద్ద తోడేలు కనిపించినప్పుడూ కాదు సాహిత్యం పుట్టింది; ఒక ఆదిమ బాలుడు ‘తోడేలు తోడేలు!’ అని లోయలోంచి అరుచుకుంటూ వచ్చినప్పుడూ, వెనక ఏ తోడేలూ లేనప్పుడూ సాహిత్యం పుట్టింది.’’

మొదట్లో పద్యం ఒక్కటే ఉండేది. మహాకావ్యాల (epics) కాలంలో కథల్ని కూడా పద్యాల్లోనే చెప్పారు. మానవుడి అనుభవ ప్రపంచం విస్తృతమయ్యే కొద్దీ పద్యం తీసుకునే ఇతివృ త్తాలు సునిశితమయ్యాయి. ఆ ఇతివృత్తాల్ని స్వీకరించేందుకు పద్యానికి కథ అనే చట్రం అడ్డమయ్యింది. దాంతో కథ చెప్పే బాధ్యతను వచనం తీసుకుంది. పద్యాలు కట్టేవాళ్ళు కవులూ, కథలు రాసేవాళ్ళు కథకులూ అయ్యారు.

కొందరు కవులకు వచనమంటే చులకన. కవుల దాకా ఎందుకు, అసలు కథకులే కవిత్వానికి పెద్దపీట వేసిన సందర్భాలెన్నో. సోమర్సెట్‌ మామ్‌ ఒక చోట, ‘‘సాహిత్యానికి మకుటం కవిత్వమే. అదే దాని లక్ష్యమూ, పరమార్థమూను. కవులు ఇలా నడిచొస్తుంటే కథకులు చేయగలిగిందల్లా పక్కకు తప్పుకొని దారివ్వటమే’’ అంటాడు. ఇంగ్లీష్‌ కవి కోలరిడ్జి ‘‘వచనంలో పదాలు వాటి సరైన క్రమంలో ఉంటే చాలు; కవిత్వంలో సరైన పదాలు సరైన క్రమంలో ఉండాలి’’ అంటాడు. రష్యన్‌ కవి జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ వచనానికి క్రమశిక్షణ నేర్పే గురువు కవిత్వమే అంటాడు. కానీ నేర్చుకునే విషయంలో వచనం సోమరి విద్యార్థిగానే మిగిలిపోయిందని వాపోతాడు. మనవాళ్ళు కూడా ‘‘వచనమై తేలిపోవటం’’ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆధిక్యతా భావానికి ఒక కారణం తడుతుంది. పద్యాన్ని ఏ మార్పూ చొరనివ్వనంత పకడ్బందీగా నిర్మించటం సులువు. నిడివి పరిమితం కావటం మూలానా, నిర్మాణ రీతి మూలానా పద్యాన్ని ఆద్యంతం అదుపులో ఉంచుకు నడిపే వీలుంటుంది. కానీ వచనానికి అంత కట్టుదిట్టమైన రూపాన్నివ్వటం దాదాపు అసాధ్యం. అది అసంపూర్ణతల్ని ఒప్పుకునే ప్రక్రియ. ఆధునిక నవలకు ఆద్యుడైన ఫ్లాబె ‘మదాం బోవరీ’ నవల రాసేటప్పడు తన ప్రేయసికి పంపిన ఒక ఉత్తరంలో What a bitch of a thing prose is!'' అని వాపోతాడు: ‘‘ఎంత దుంప తెంచుతుంది ఈ వచనం! ఎప్పటికీ ఓ కొలిక్కి రాదు; తిరగరాయాల్సింది ఏదో మిగిలే ఉంటుంది. కానీ వచనంలో కూడా పద్యం లాంటి నిలకడ సాధించవచ్చుననే అనుకుంటాను. వచనంలో మంచి వాక్యం ఉందంటే అది పద్యంలో ఒక మంచి పంక్తి ఉన్నట్టే ఉండాలి--మార్చటానికి వీల్లేకుండా, అంతే లయతో, అంతే శ్రావ్యంగా.’’ 

అయితే ఇలా మార్చి రాయటానికి వీల్లేని వాక్యాల్ని ఫ్లాబె నవలల్లో కూడా మహా అయితే పేజీకి మూణ్ణాలుగు మాత్రమే పట్టుకోగలమని అనుకుంటాను. నవల మొత్తం అలా ఒక్క వాక్యమూ ‘‘మార్చటానికి వీల్లేని’’ వచనం రాయటం ఆయనకే కాదు, ఎవరికీ వీలు కాదనే అనుకుంటాను. అసలు ఆయన పెట్టుకున్న ఆదర్శాలే వచనానికి తగనివి. లయాత్మకతంగా సాగే వచనం కథ చెప్పటానికి అడ్డం కాదా? ప్రాసానుప్రాసాది విన్యాసాలతో వున్న వచనాన్ని ఎన్ని పేజీల దాకా భరించగలం? అవన్నీ పద్యానికి తగిన లక్షణాలు. అది కూడా ఛందోబద్ధమైన పద్యానికి. ఆధునిక పద్యానికి మెటఫర్‌, సిమిలీ, ఇమేజరీ ఇత్యాదులు ప్రధానాంగాలయ్యాయి. ఇవి వచనంలోనూ అంతర్భాగమే. కానీ వచనం చేయగలిగే ఇంకెన్నో విషయాలతో పోలిస్తే వీటి ప్రాధాన్యత తక్కువే. వచనం కవిత్వం కావటానికి ఉన్న దారులు వేరు.

ఫలానా రచయిత వచనం ‘‘అచ్చం కవిత్వంలా ఉంది’’ లాంటి పొగడ్తలు అప్పుడప్పుడూ వింటాము. మామూలుగా పద్య లక్షణాలైన అలంకారిక వ్యక్తీకరణల దట్టింపూ, లయాత్మక శైలీ, ప్రతీకలూ, అటు నోటి మాటల్ని కానీ ఇటు వ్యాకరణాన్ని కానీ అనుసరించక రచయిత తాలూకూ ఉద్వేగంతో ఛార్జ్‌ ఐన అసంపూర్ణ వాక్య శకలాలూ- ఇలాంటివేవో కనపడినప్పుడు ఈ పొగడ్తలు వింటాము. కానీ ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు వచనం పద్యం చేసే పనుల మీదే ఎక్కువ శ్రద్ధపెట్టిందనీ, వచనం మాత్రమే చేయగలిగే మరెన్నో చేయలేకపోతోందనీ అర్థం. ఏమిటీ వచనం మాత్రమే చేయగలిగేవి? వచనాన్ని గురించి నాకెంతో ఇష్టమైన మాట ఒకటుంది. ఇంగ్లీష్‌ రచయిత హెన్రీ గ్రీన్‌ వచనాన్ని ఇలా నిర్వచిస్తాడు: "Prose is not to be read aloud but to oneself alone at night, and it is not quick as poetry but rather a gathering web of insinuations...''

ఈ వాక్యంలోని సారమంతా "gathering web of insinuations'' అనే పదాల్లో ఉంది. ఈ పదాల్లో మొత్తం వాక్యానికే శక్తినిస్తున్న "insinuations'' అనే పదాన్ని దాని నెగెటివ్‌ ఛాయలతో సహా తెలుగులోకి అనువదించటం కష్టం: ‘‘వచనాన్ని పైకి కాదు, రాత్రుళ్ళు మనకు మనం ఒంటరిగా చదువుకోవాలి. వచనం కవిత్వంలా చప్పున పనిచేయదు. అది మెల్లగా కమ్ముకొనే అన్యాపదేశాల వల...’’ అని ఉజ్జాయింపుగా అనువదించుకోవచ్చు. చెప్పదల్చుకున్నదాన్ని మంచి వచనం ఒకే చోట సాంద్రంగా వ్యక్తం చేయదు. దాన్ని పాఠ్యమంతటా పల్చగా వెదజల్లుతుంది. అక్కడో సూచనా ఇక్కడో సూచనా మినుకు మినుకుమంటూ, పాఠకుడ్ని కలిపి చదువుకొమ్మనీ, కథను అల్లుకొమ్మనీ ఆహ్వానిస్తాయి.

అలాగే వచనానికే సాధ్యమయ్యే మరో లక్షణం, అది మనుషుల్ని రానిస్తుంది. శ్రీశ్రీ ‘భిక్షువర్షీయసి’, తిలక్‌ ‘తపాలా బంట్రోతు’ లాంటి పద్యాల్లో మనుషులు లేరా అంటే ఉన్నారు. కానీ పద్యంలో వాళ్ళు నేరుగా కనిపించరు. కవి అంతరంగపుటద్దంపై వారి ప్రతిబింబాలు మాత్రమే కనిపిస్తాయి. వచనంలోనికి మనుషులు నేరుగా నడిచి వస్తారు, తమ మాటలు తామే మాట్లాడతారు. అంటే దానర్థం రచయిత తానున్న చోటు నుంచి మాట్లాడ్డం గాక, వాళ్ల వైపు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. (అసలు మనం మనల్ని తప్పితే పక్కనున్న మనిషిని తెలుసుకోవటం సాధ్యం కాదనే తీవ్రమైన ఆత్మాశ్రయత్వం వచనమనే వ్యవస్థనే కుప్పకూలుస్తుంది. పరాయి ప్రపంచాల పట్ల కుతూహలమూ, ఆర్తీ కథలల్లే వచనకారుడి కనీస అర్హతలు.)

మనుషులకి అనుకరణలో (Mimesis) ఏదో చెప్పరాని సంతోషం దొరుకుతుంది. ఈ అనుకరణని అవధుల దాకా తీసుకెళ్లగలిగేది వచనం. కథలు రాసేవాడు సాక్షాత్తూ దేవుడ్నే అనుకరిస్తాడు (ఇక్కడ దేవుడంటే సృష్టిలో అతిశక్తివంతమైన మెటఫర్‌). దేవుడు కూర్చొని మనుషులకు పోత పోసినట్టు, ఈ కథలు రాసే మనిషి కాగితం ముందు కూర్చొని నీడల్లాంటి మనుషులకు పోతపోస్తాడు. వాళ్ళు తమ వెతలూ సంతోషాలతో సహా ఏదో నిజంగా భూమ్మీద మసలిన మనుషుల్లా మనకు గుర్తుండిపోతారు. సమస్త ప్రకృతిని వచనంలో అనుకరించినంత దగ్గరగా పద్యంలో అనుకరించలేము. అందుకే పుష్కిన్‌ని ఉదహరిస్తూ నబొకొవ్‌- కవుల్లో ఏంబిషన్‌ ముదిరితే ఇక కవిత్వాన్ని పక్కపెట్టి కథల వైపు మళ్లుతారని అంటాడు. ఇక్కడ ఏంబిషన్‌ అంటే కీర్తి దాహమూ అట్లాంటివి కాదు. తనతో సహా సృష్టినంతట్నీ అక్షరాల్లోకి తెచ్చిపోసెయ్యాలనే దాహం. నబొకొవ్‌ మాటల్లో: "the art of seeing the world as the potentiality of fiction.'' (ప్రపంచాన్ని కథలు తోడుకునేందుకు పనికొచ్చేదిగా చూసే కళ.)

బైబిల్లో దేవుడు ఆదాంని సృష్టించి, ఆ తర్వాత జంతుజాలాన్నంతా సృష్టిస్తాడు. జంతువులన్నింటినీ ఆదాము ముందుకు తీసుకువచ్చి వాటికి అతను ఏ పేర్లు పెడతాడో అవే ఖాయం చేస్తాడు. దేనికైనా పేరు పెట్టి ఇదీ అని చెప్పటంలో మనిషికి ఏదో ఆనందం ఉంది. జీవితంలోంచి ఏరుకున్న దృశ్యాల్ని కల్పన సాయంతో అటుదిటుగా చేసి కాగితంపై ఖర్చుచేయటంలో ఆనందం ఉంది. నోటి మాటల్ని ఉన్నదున్నట్టు పట్టుకోవటంలో ఆనందముంది. ఆ మాటల వెనక తచ్చాడే జీవితాల్నీ, మారే అంతరంగ ఛాయల్నీ సూచించటంలో ఆనందముంది. మనుషుల రూపాల్నీ, కవళికల్నీ, భంగిమల్నీ, పద్ధతుల్నీ స్ఫురింపజేయటంలో ఆనందం ఉంది. ఫలానా పరిస్థితుల మధ్య వచ్చిపడ్డ మనుషుల స్వభావాల్నో, ఫలానా మనుషుల స్వభావాల వల్ల వచ్చిపడ్డ పరిస్థితులనో జతకూర్చటంలో ఆనందం ఉంది. ఇవే వచనానికి ప్రత్యేకమైనవీ, వచనాన్ని కవిత్వం చేసేవీను.

దాస్తోయెవ్‌స్కీ ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’లో మార్మెలాడోవ్‌ తాగుబోతు ఉపన్యాసం నిండా దొర్లే బతుకు బీభత్సమూ; టాల్‌స్టాయ్‌ ‘అన్నా కరేనినా’లో వ్రాంస్కీ పాల్గొనే గుర్రాల రేసు కళ్లకు కట్టించే హోమరిక్‌ సౌందర్యమూ; కాఫ్కా ‘మెటమార్ఫసిస్‌’లో కీటకంగా మారిన గ్రెగర్‌ చుట్టూ మారే అతని కుటుంబ సభ్యుల స్వభావాలూ; ఫ్లాబె ‘సెంటిమెంటల్‌ ఎడ్యుకేషన్‌’లో కాలచక్రం జీవితాన్ని నింపాదిగా తొక్కుకుంటూ పోతున్నప్పుడు యవ్వనపుటాశలు కిందపడి నలిగే చప్పుడూ ఇదంతా వచనానికి మాత్రమే సాధ్యమయ్యే కవిత్వం.

ఇలా వచనానికి తనదంటూ ఒక కవిత్వం ఉంది. అది వదిలేసి, పద్యానికి ఒప్పే కొన్ని లక్షణాల్ని వచనంలో ప్రదర్శించినంత మాత్రాన, ఆ ఒక్క కారణానికే దాన్ని గొప్ప వచనం అనలేము. ఆలూరి బైరాగి ‘జేబుదొంగ’లో ఈ ఇబ్బంది చూస్తాను. ఆ కథ మొదట్లోనూ చివర్లోనూ బైరాగి ప్యూర్‌ పద్యాన్ని వాక్యాలుగా కలిపి రాసేస్తాడు. ‘‘మెల్లగా కమ్ముకొనే అన్యాపదేశాల వల’’ని పన్నటానికి బదులు, చెప్పదల్చుకున్నదంతా సాంద్రంగా ఒకేచోట కుమ్మరించేస్తాడు: ‘‘మరఫిరంగుల జోలపాట, మత్తుగల చీకట్ల కోనేట్లో పసరునీరుల కదలిక. ఆకాశపు ఆవులింత. కబంధుని కౌగిలింతలో పగిలిన మట్టిముంత. అహో! జీవితపు రక్తోజ్వల ముక్తిక్షణమా’’ అంటూ మొదలయ్యే ఈ కథలో కవిత్వమైతే ఉంది, కానీ అది వచనం తాలూకు కవిత్వం కాదు. ఆయన కథే ‘దరబాను’లో ఈ ఇబ్బంది లేదు. ‘జేబుదొంగ’ కథలో మన ముందుకు ఆ జేబుదొంగ రాడు, కానీ ‘దరబాను’ కథలో ఆ దరబాను (నేపాలీ గూర్ఖా) నేరుగా మన ముందుకొస్తాడు. బైరాగి తనలోని పద్యకారుడ్ని తొక్కిపట్టి, కథకునిగా తన ఊహను దరబాను వైపు ప్రసరింపజేస్తాడు. పల్లెటూరి నుంచి పరాయి దేశపు మహా నగరంలోనికి వచ్చిపడ్డ ఆ మనిషి ఒంటరితనాన్ని ఆర్తిగా స్పృశిస్తాడు.

అలాగే పతంజలి కవితాత్మకంగా రాసిన కథ అని చెప్పే ‘చూపున్న పాట’ కంటే, హాస్య కథ అని చెప్పే ‘రాజుగోరు’లో ఎక్కువ కవిత్వం ఉంది. పాఠకుల్లో ఉద్వేగం కలిగించాల్సింది పోయి రాస్తున్న రచయితే ఉద్వేగంతో ఊగినప్పుడూ, మేజిక్‌రియలిజం అనే ట్రెండ్‌కి మనమూ ఏదోటి రాద్దామని ఆత్రపడినప్పుడూ వచ్చే కథ ‘చూపున్న పాట’. కానీ ‘రాజుగోరు’ మాత్రం పైకి హాస్య కథలా నడుస్తూనే, వచనానికి మాత్రమే వీలయ్యే ఎంతో కవిత్వాన్ని పొదువుకున్న కథ. ఆయన వ్యవస్థపై ధిక్కారమంటూ రాసిన ‘ఖాకీవనం’, ‘పెంపుడు జంతువులు’ లాంటి మీడియోకర్‌ రచనల కన్నా ఎంతో ఎత్తు నున్న కథ. పతంజలి ఇందులో మెట్టు తర్వాత మెట్టు అన్నట్టు క్రమబద్ధ సమీకరణంలాగ కథ చెప్పడు. వివరాల్ని ఎంతో అలవోకగా కథంతా వెదజల్లుతాడు. తను కథ చెప్పటమే కాదు, పాత్రల నోటమ్మటా కూడా ఎన్నో కథల్ని కమ్మగా చెప్పిస్తాడు. వచనం వెనుక జీవితపు నాడి కొట్టుకోవడం తెలుస్తుంది. ఉదాహరణకి, రైతు అప్పల్నాయుడు తన అత్తకు వంట్లో బాలేకపోతే మందు తెద్దామని కలగాడ నుంచి బయల్దేరి అలమండ రాజుల సావిట్లోకి వస్తాడు. అతనికి అలమండ రాజ వంశస్థులు ఫకీర్రాజూ, అతని అసిస్టెంటు గోపాత్రుడూ ఏదో పేరు తెలీని మందు ఇచ్చి పంపేస్తారు. మర్నాడు ఇద్దరూ మందు ఎలా పని చేసిందో కనుక్కుందామని కలగాడ వెళ్తారు. ఇల్లు వెతుక్కుంటుంటే, నెత్తి మీద గడ్డిబుంగతో వచ్చిన మనిషి ఒకడు వాళ్ళని పలకరించి అప్పల్నాయుడి ఇల్లెక్కడో వివరం చెప్తూనే అప్పల్నాయుడి మీద బూతులు లంకించుకుంటాడు. తను ఉంచుకున్న నూకాయమ్మతో అప్పల్నాయుడు సంబంధంపెట్టుకున్న సంగతీ, మొన్న సోమవారం సంతలో అతని మీద గొడవకెళ్లిన సంగతీ చెప్తూ, మళ్ళీ ఆమె జోలికి రావొద్దని అప్పల్నాయుడికి చెప్పండని చెప్పిపంపిస్తాడు. ఈ పాత్రతో కానీ, ఇతను వెళ్ళబోసుకున్న గోడుతో గానీ కథకు ఏ సంబంధమూ లేదు. ఈ నూకాయమ్మ ప్రస్తావన ఇంకోసారి కథ చివర్లో పోలీస్ స్టేషన్లో అప్పల్నాయుడి బావయిన బాంబులోడి నోటమ్మటా వస్తుంది- మళ్ళీ కథకు ఏ సంబంధమూ లేకుండానే. అసలు కథ మొదలవటమే ఏ సంబంధమూ లేకుండా పెదసావిట్లో కూర్చుని హుక్కా పీలుస్తూన్న పెద్ద అప్పల్రాజుగారితోనూ, మందుకోసం వచ్చిన అప్పల్నాయుడ్ని ఆయన ఊరికే కాలక్షేపానికి నిలేసి కబుర్లు చెప్పటంతోనూ మొదలవుతుంది. ఇలాగ మన జీవిత కథలతో నేరుగా ఏ సంబంధమూ లేకుండా ఊరకే చుట్టూ ముసురుకునే వివరాల్లోని కవిత్వాన్ని వచనం బాగా పట్టుకుంటుంది. హెమింగ్వే ‘ద ఆర్ట్‌ ఆఫ్‌ షార్ట్‌ స్టోరీ’ అనే వ్యాసంలో చెహోవ్‌ చెప్పిన ఒక నియమాన్ని ఇలా కొట్టిపారేస్తాడు: ‘‘కథ మొదలుపెట్టినప్పుడు గోడ మీద తుపాకీ వేలాడుతోందంటే పద్నాలుగో పేజీలోగా అది పేలి తీరాలీ అన్న మాటలో నిజం లేదు. అసలు నా ఉద్దేశంలో, అలా గోడకు తగిలించిన తుపాకీ పేలను కూడా పేలకపోవచ్చు. మంచి రచయిత రాసిన కథలో ఐతే ఎవడో పనికిమాలినోడు ఆ తుపాకీని చూట్టానికి బాగుందని అక్కడ తగిలించి ఉంటాడంతే. లేదూ ఆ ఇంటాయనకి తుపాకుల పిచ్చి ఉండొచ్చు. అదీ కాదంటే, ఇంటీరియర్‌ డెకరేటర్‌ దాన్నక్కడ తగిలించి వుండొచ్చు.’’ చెప్పొచ్చేదేమిటంటే- జీవితాన్నీ, దాని పద్ధతీపాడూ లేనితనాన్నీ వచనం మన్నిస్తుంది, పట్టింపులేమీ లేకుండా రానిస్తుంది.

జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ ‘హౌ టు రీడ్‌ ఎ బుక్‌’ అన్న వ్యాసంలో కవిత్వం నుంచి వచనం నేర్చుకోవాల్సినవి క్లుప్తతా, ఉన్నతమైన భాషా ప్రమాణాలూ అంటాడు. నిజానికి అవి రాసేవాళ్లని బట్టి ఉంటాయి. కవిత్వాన్ని ఊకదంపుడుతోనూ, జర్నలిస్టు భాషతోనూ నింపేవాళ్లున్నారు. బైబిల్‌ పాత నిబంధన కథల్లోని క్లుప్తతకు సాటి ఏముంది? చుట్టూ వినపడే మనుషుల మాటల కన్నా భాషకు ఉన్నతమైన ప్రమాణాలేవీ? కనుక వచనం ఈ గుణాల్ని ప్రత్యేకించి కవిత్వం నుంచే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బ్రాడ్‌స్కీ మాటల్లో ఉన్నది సొంత వ్యాసంగం పట్ల అందరికీ ఉండే బడాయే ననిపిస్తుంది. పద్యమూ, వచనాల్లో ఏది గురువూ, ఏది లఘువూ అని తేల్చుకునే కన్నా, కవిత్వం కావటానికి రెండింటికీ ఉన్న దార్లు వేరు అనుకుంటే సరిపోతుంది. 


0 comments:

మీ మాట...