June 16, 2011

'మల్లెల యువరాజు' (తమిళ జానపద కథ)

ఒకానొక రాజ్యంలో ప్రజలంతా రాజుని మల్లెల యువరాజుఅని పిలిచేవారు. ఎందుకంటే అతనెప్పుడు నవ్వినా మల్లెల పరిమళం మైళ్లవరకూ వ్యాపించేది. కానీ అతను తనంతటతాను నవ్వాలి. ఎవరూ కితకితలు పెట్టకూడదు. బలవంతపెట్టకూడదు. అలా జరిగితే మల్లెల పరిమళం రాదు.
       మల్లెల యువరాజు పాలించే రాజ్యం చిన్నది. సార్వభౌముడైన మరో మహారాజుకి విధేయుడై సామంతునిగా వుండేవాడు. ఆ మహారాజుకి ఈ వార్త చేరింది. కేవలం నవ్వడం ద్వారా మల్లెల పరిమళాన్ని వెదజల్లే ఈ వింతను తనే స్వయంగా చూడాలనుకున్నాడు. యువరాజుని తన రాజధానికి అతిథిగా ఆహ్వానించి, పురప్రముఖులంతా ఆహూతులుగా కొలువుదీరిన నిండుసభలో, నవ్వమని అడిగాడు. కానీ ఆజ్ఞాబద్ధుడై నవ్వడం యువరాజుకు చేతకాదు. ఎంతో ప్రయత్నించినా నవ్వలేకపోయాడు. మహారాజు దీన్ని అవమానంగా భావించాడు. మా ఆజ్ఞ ధిక్కరిస్తున్నాడు! మమ్ము పరిహసిస్తున్నాడు!అనుకున్నాడు. నవ్వే వరకూ యువరాజుని శివార్లలోని చెరసాలలో బంధించమని ఆదేశాలిచ్చాడు.
       చెరసాలకు సరిగ్గా ముందున్న గుడిసెలో ఒక అవిటివాడున్నాడు. వాడి ప్రేమలో పడిన రాజ్యపు పట్టపురాణి వాణ్ణి కలవడానికి ప్రతీ రాత్రీ రహస్యంగా గుడిసెకు వచ్చేది. ఆమె రాకపోకల్ని తన ఊచల కిటికీ నుండి గమనించాడు మల్లెల యువరాజు. ఇది నాకు సంబంధం లేని విషయంఅనుకుంటూ, తానేమీ చూడనట్టే మసలుకున్నాడు. ఒక రాత్రి రాణి రావడం కాస్త ఆలస్యమైంది. అవిటివాడు కోపం పట్టలేకపోయాడు. ఆమె రాగానే మీదపడి చితగ్గొట్టాడు. మొండి చేతులతో పొడుస్తూ, కుంటి కాళ్లతో తన్నాడు. ఆమె ఒక్కమాట అనకుండా దెబ్బలన్నీ భరించింది. వెంట తెచ్చిన రాచభోజ్యాలు అతనికి వడ్డించింది. ఆమె చేతి ముద్దలు తింటూంటే తన క్రూరత్వానికి పశ్చాత్తాపం కలిగింది వాడికి. నిన్ను కొట్టినందుకు బాధగా లేదా?” అనడిగాడు. ఆమె నవ్వుతూ అంది, “ఎందుకు బాధ! ఆనందంగా వుంది. ఒక్కసారే పద్నాలుగులోకాలూ చూసొచ్చాను!
       వాళ్ళిద్దరూ యిలా మాట్లాడుకుంటున్న గుడిసె బయట చూరు క్రింద చీకట్లో ఓ మూలగా పేద చాకలి వాడొకడు చలికి మునగదీసుకుని కూర్చున్నాడు. వాడి గాడిద ఎక్కడో తప్పిపోయింది. నాలుగు రోజులుగా దాని కోసం వెతకని చోటు లేదు. యిక ఎప్పటికీ దొరకదేమోనని దిగాలుగా వున్నాడు. యిపుడు రాణి అన్న మాటలు వినగానే, వాడికో ఆలోచన తోచింది, “ఈ మడిసి పద్నాలుగు లోకాలూ చూసొచ్చి వుంటే, ఈమెకి నా గాడిద ఏడనో కనపడే వుంటది!వాడు గుమ్మం వైపు తలతిప్పి లోపలికి వినపడేట్టు బిగ్గరగా అడిగాడు, “ఓయమ్మా! నా గాడిదనెక్కడన్నా చూసావా?”
       చెరసాల కిటికీ నుంచి యిదంతా వింటున్న మల్లెల యువరాజు, నవ్వు పట్టలేకపోయాడు. తెరలు తెరలుగా వెలువడిన నవ్వు చుట్టూ రాత్రిలోకి పాకింది. గాలిలో కొన్ని మైళ్ల మేర మల్లెల పరిమళం వ్యాపించింది. తెలవారడానికి యింకా కొన్ని గంటలు వుండగానే, చెరసాల భటులు పరుగుపరుగున వెళ్ళి మహారాజుకి నవ్వు సంగతీ, మల్లెల పరిమళం సంగతీ విన్నవించారు. పొద్దుపొడిచేదాకా ఆగలేకపోయాడు మహారాజు. వెంటనే మల్లెల యువరాజుని రాజభవనానికి రప్పించుకుని అడిగాడు, “స్వయానా మాకోసం నవ్వమని అడిగినపుడు నువ్వు ససేమిరా అన్నావు. యిప్పుడు నిన్ను, అదీ అర్థరాత్రివేళ, నవ్వించగలిగేంతటి గొప్ప సంగతేం జరిగింది?”
       యువరాజు తన నవ్వుకు కారణాన్ని దాయాలని చాలా ప్రయత్నిచాడు. కానీ రాజు పట్టుపట్టడంతో చివరకు నిజం చెప్పేసాడు. విషయంతా విన్న తరవాత మహారాజు రెండు ఆజ్ఞల్ని జారీ చేశాడు. ఒకటి మల్లెల యువరాజుని సాదరంగా అతని రాజధానికి పంపించడం, రెండు తన పట్టపురాణిని పట్టికెళ్ళి సున్నపు బట్టిలో కాల్చి చంపించడం. 

*  ——   *  ——   *

This is translated from a Tamil folktale `The Jasmine Prince' collected in A.K. Ramanujan’s “Folktales from India”. I have read only the first six tales. Some are good, like this one; and others are so-so. (I loved the 3rd para of this story especially, which seems like a story within the story. And I liked too the indifference rest of the story is maintaining towards it.) I am particularly fascinated by how amoral all these tales are. They deny you any moral vantage point to judge from. I liked it. I wish that tradition had sustained, without Victorian morality of  the British strangling it in the midway.